చంద్రబాబు నిర్ణయమే ఫైనల్: జగన్ ఎఫెక్ట్... కడప నుంచి పోటీకి వీరిద్దరి వెనుకడుకు ఎందుకు?
కడప: జిల్లాలోని కడప లోకసభ, జమ్మలమడుగు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసే అభ్యర్థుల విషయంలో తెలుగుదేశం పార్టీలో సందిగ్ధత నెలకొంది. దీంతో మంత్రి ఆదినారాయణ రెడ్డి, పార్టీ విప్ రామసుబ్బా రెడ్డి గురువారం ముఖ్యమంత్రి, టీడీపీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడును కలిశారు. పోటీ విషయంలో చంద్రబాబు ఏం చెబితే అది చేస్తామని వారు ఆ తర్వాత మీడియాతో చెప్పారు.
ఎన్నికల టైంలో ఏం మాటలవి: పవన్ కళ్యాణ్తో పొత్తు, టీజీపై చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
చంద్రబాబు నిర్ణయమే ఫైనల్
దీంతో ఓ విధంగా ఈ వ్యవహారం కాస్త కొలిక్కి వచ్చినట్లుగా భావిస్తున్నారు. కడప లోకసభ, జమ్మలమడుగు అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి పోటీకి ఎవరిని నిలబెట్టాలన్నది చంద్రబాబు నిర్ణయం తీసుకుంటారని వారు చెప్పారు. వారం రోజుల్లో చంద్రబాబు తన నిర్ణయాన్ని చెబుతానని చెప్పారని తెలిపారు. అభ్యర్థి ఎంపిక నిర్ణయాన్ని తాము చంద్రబాబుకే వదిలేశామని చెప్పారు.
ఎవరికి కేటాయించినా కలిసి పని చేస్తాం
ఎవరికి ఏ స్థానం కేటాయించినా కలిసి పని చేస్తామని ఆదినారాయణ రెడ్డి, రామసుబ్బారెడ్డిలు చెప్పారు. కడప జిల్లాలో అన్ని స్థానాలను కైవసం చేసుకుంటామని వారు ధీమా వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై కార్యకర్తలను ఒప్పిస్తామన్నారు. తమ ఇద్దరి మధ్య ఒప్పందం కుదిరాక కార్యకర్తలు అంగీకరిస్తారని చెప్పారు. సీఎం వద్ద అంగీకరించిన విషయాలను కార్యకర్తలతో చర్చిస్తామని చెప్పారు. ఇద్దరిలో ఎవరికి ఎంపీ సీటు ఇచ్చిన కలిసి పని చేస్తామన్నారు. రాయచోటి సీటు విషయంలోను చంద్రబాబు చర్చించారని చెప్పారు. రమేష్ కుమార్ రెడ్డి, ప్రసాద్లు కూడా అధినేత నిర్ణయానికి కట్టుబడి ఉంటారని చెప్పారు.
అందుకే కడప నుంచి పోటీకి ఆసక్తిలేదా?
అంతకుముందు సీట్ల విషయంలో చంద్రబాబుతో బుధవారం అమరావతిలో ఆదినారాయణరెడ్డి, రామసుబ్బారెడ్డి సమావేశమయ్యారు. మూడు గంటల పాటు ఇద్దరు నేతలతో మాట్లాడారు. ఎమ్మెల్యే టిక్కెట్ కోసమే వారు పట్టుబట్టారు. దీంతో టికెట్ల విషయంలో మరోసారి చంద్రబాబు గురువారం వారితో చర్చించారు. కాగా, ఇరువురు నేతలు కడప నుంచి లోకసభకు పోటీ చేసేందుకు అయిష్టత చూపుతున్నారు. రామసుబ్బారెడ్డి, ఆదినారాయణ రెడ్డిలలో ఒకరు ఎమ్మెల్యేగా (జమ్మలమడుగు), మరొకరు లోకసభకు పోటీ చేయాల్సిన పరిస్థితి. ఎమ్మెల్యేగా పోటీ చేయాలని ఇద్దరు పట్టుబట్టేందుకు కారణాలు ఉన్నాయి. ఒకటి సొంత నియోజకవర్గంలో ప్రజల మధ్య, కార్యకర్తల మధ్య ఉండేందుకు ఆసక్తి కనబర్చడం. ఢిల్లీ కంటే అమరావతికే వెళ్లడానికి మొగ్గు చూపడం. మరో కీలకమైన అంశం కడప నుంచి పోటీ చేసినా ఆ సీటు వైసీపీకే వెళ్తుందనే అభిప్రాయం కూడా ఉండవచ్చునని అంటున్నారు.