చంద్రబాబు మంత్రివర్గ భేటీ ప్రస్తావన వెనుక అసలు విషయం అదేనా?
దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమలులో ఉంది. లోక్సభతో పాటు అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొంటున్న రాష్ట్రాల్లో ఆపద్ధర్మ ప్రభుత్వాలు కొనసాగుతున్నాయి. ఆపద్ధర్మ ప్రభుత్వంలో ఎలాంటి సమీక్షలు గానీ, సమావేశాలను గానీ నిర్వహించడానికి అవకాశం ఉండదు. అధికారం యావత్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి చేతుల్లో ఉంటుంది. వివిధ శాఖల పనితీరును సమీక్షించాలన్నా, నిధులను మంజూరు చేయాలన్నా, నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులను పనితీరును పర్యవేక్షించాలన్నా అది ఒక్క ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మాత్రమే చేయగలుగుతారు.
మన రాష్ట్రంలో మాత్రం దీనికి భిన్నమైన వాతావరణం కనిపిస్తోంది. ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా వ్యవహరించాల్సిన చంద్రబాబు ఎన్నికల ప్రవర్తనా నియమావళికి భిన్నంగా ప్రవర్తిస్తున్నారనే ఆరోపణలు ఇప్పటికే వెల్లువెత్తాయి. అటు ప్రతిపక్ష నాయకులు గానీ, ఇటు మేధావులు గానీ సామాజిక మాధ్యమాలను వేదికగా చేసుకుని.. చంద్రబాబు వైఖరిని ఎండగడుతున్నారు. కేంద్ర ఎన్నికల సంఘంతో చంద్రబాబు ఘర్షణ పడుతున్నారని విమర్శిస్తున్నారు. బ్యూరోక్రాట్లలోనూ ఇదే విషయం చర్చనీయాంశమైంది.
సమీక్షలు.. సందర్శనలతో వివాదం
కిందటి నెల 11వ తేదీన తొలిదశలోనే రాష్ట్రంలో పోలింగ్ ప్రక్రియ ముగిసింది. 175 అసెంబ్లీ, 25 లోక్సభ స్థానాలకు ఒకే దఫాలో ఎన్నికలను నిర్వహించారు అధికారులు. మే 23వ తేదీన ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఫలితాల అనంతరమే రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడుతుంది. అప్పటి వరకూ తాను సమయాన్ని వృధా చేయదలచుకోలేదంటూ చంద్రబాబు వరుస సమీక్షలను నిర్వహించిన విషయం తెలిసిందే. పోలవరం సహా నిర్మాణంలో ఉన్న పలు ప్రాజెక్టులపై అధికారికంగా సమావేశాలను చేపట్టారు. అధికారులకు ఆదేశాలను కూడా జారీ చేశారు. పోలవరం ప్రాజెక్టును స్వయంగా వెళ్లి పరిశీలించి వచ్చారు. ఆపద్ధర్మ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి ఇలా అధికారిక పర్యటలు చేయడం, సమీక్షా సమావేశాలను ఏర్పాటు చేయడం ఎన్నికల కోడ్కు విరుద్ధం. దాన్ని ఆయన అనుసరించట్లేదు.
మంత్రివర్గ భేటీతో మరో రచ్చ
సమీక్షా సమావేశాలతోనే ఆగలేదు చంద్రబాబు. వాటికి మాత్రమే పరిమితం కాలేదు. మంత్రివర్గ సమావేశాన్ని కూడా నిర్వహిస్తానని అంటున్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సహా ఆయా శాఖలు, విభాగాధిపతులు రావాలని, ఎలా గైర్హాజరు అవుతారో చూస్తాననీ హూంకరిస్తున్నారు. మంత్రివర్గ సమావేశం నిర్వహిండానికి నిఖార్సయిన అజెండా అంటూ ఏదీ లేదనే అభిప్రాయాలు అధికారుల్లో వ్యక్తమౌతున్నాయి. కేంద్ర ఎన్నికల కమిషన్తో ఘర్షణ పడటానికి మాత్రమే చంద్రబాబు మంత్రివర్గ సమావేశాన్ని నిర్వహిస్తున్నారని అధికారులు బాహటంగా చెబుతున్నారు. ఈ నెల 10వ తేదీన అంటే.. శుక్రవారం మంత్రివర్గ భేటీని ఏర్పాటు చేయాలని ముందుగా చంద్రబాబు నిర్ణయించుకున్నారు. అనంతరం దాన్ని వాయిదా వేశారు. ఈ నెల 14న క్యాబినెట్ భేటీ ఉంటుందని లీకులు ఇచ్చారు.
అసలు కారణం వేరే ఉందా?
చంద్రబాబు ఇంత మొండిగా, కేంద్ర ఎన్నికల కమిషన్ నిబంధనలకు విరుద్ధంగా ఘర్షణ పడుతూ మంత్రివర్గ సమావేశాన్ని నిర్వహించడానికి ప్రయత్నించడం వెనుక అసలు కారణం వేరే ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎన్నికల షెడ్యూల్ వెలువడటానికి ముందు చంద్రబాబు ప్రభుత్వం తన అనుయాయులైన కొందరు కాంట్రాక్టర్లకు చెల్లించాల్సిన బిల్లులను నిలిపివేశారని, వాటిని విడుదల చేయాలనే ప్రధాన కారణంతో ఆయన హడావుడిగా మంత్రివర్గ సమావేశాన్ని నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నారనే విమర్శలు ప్రతిపక్ష నేతల్లో వ్యక్తమౌతున్నాయి. ఇదే విషయాన్ని ఆయన రాజకీయ ప్రత్యర్థులు ప్రస్తావిస్తున్నారు.
కాంట్రాక్టర్ల బిల్లులు నిలిపివేసిన సీఎస్..
ఆపద్ధర్మ ప్రభుత్వం నడుస్తున్నందున ప్రస్తుతం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యమే అసలు బాస్. ఆపద్ధర్మ ప్రభుత్వం ఉన్న సమయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎలాంటి నిబంధనలను పాటించాలనే విషయంపై కేంద్ర ఎన్నికల కమిషన్ ఓ రూల్ బుక్ను రూపొందించింది. దాన్ని నిక్కచ్చిగా అనుసరిస్తున్నారు ఎల్వీ సుబ్రహ్మణ్యం. అధికార తెలుగుదేశం పార్టీకి ఇది రుచించట్లేదని అంటున్నారు. రూల్ బుక్ను అనుసరిస్తూ, ఆయన శాఖలవారీగా సమీక్షలు నిర్వహిస్తున్నారు.
ఆర్థికశాఖే టార్గెట్..
ఇందులో ఆయన ఆర్థికశాఖకు అధిక ప్రాధాన్యత ఇచ్చారు. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి రవిచంద్ర విడుదల చేసిన కొన్ని జీవోలనూ ఎల్వీ సుబ్రహ్మణ్యం సమీక్షించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆర్థికశాఖలో అనేక లోటుపాట్లు కనిపించాయని, వాటన్నింటినీ తిరగదోడుతున్నారని చెబుతున్నారు. ఫలితంగా- ప్రభుత్వ పెద్దల దుర్వినియోగం ఏ స్థాయిలో ఉంటుందనేది బయట పడుతుందని, తమ పరువు పోతుందనే ఆందోళన ప్రభుత్వ పెద్దల్లో వ్యక్తమౌతోందని చెబుతున్నారు. వాటన్నింటినీ పక్కదారి పట్టించడానికి మంత్రివర్గ సమావేశాన్ని నిర్వహించి, రచ్చ చేయాలని చంద్రబాబు ప్రధాన ఉద్దేశమనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.