విశాఖ భూ కుంభకోణంపై సిట్ నివేదిక ఏమైంది?...ఇరకాటంలో పడతామనా!
విశాఖపట్నం:రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన వేల కోట్ల రూపాయల విశాఖ భూ కుంభకోణంలో ప్రభుత్వం వేసిన సిట్ కమిటీ నివేదిక ఏమైంది?...అసలు సిట్ కమిటీ విచారణ చేసిందా లేదా?...చేస్తే నివేదిక ప్రభుత్వానికి సమర్పించిందా లేదా?...సమర్పిస్తే ప్రభుత్వం దాన్ని ఎందుకు బైట పెట్టలేదు...ఈ ప్రశ్నలన్నీ ప్రభుత్వంపై సంధిస్తున్నాయి ప్రజాసంఘాలు.
అయితే ఈ భూ ఆక్రమణలపై సిట్ రెండు నెలల క్రితమే ప్రభుత్వానికి అందచేసిందని...అయితే ప్రభుత్వమే ఈ నివేదిక బైటకు వస్తే రాజకీయంగా ఇబ్బందులు తప్పవని దాన్ని బైటపెట్టడం లేదనేది ప్రజాసంఘం నేతల ఆరోపణ...కారణమేమిటంటే...ఈ భూ కుంభ కోణంలో మంత్రులు,ఎంపీలు, ఎమ్మెల్యేల ప్రమేయం ఉన్నట్లు తేలడమేనంటున్నారు.
రెండు నెలల క్రితమే...సిట్ నివేదిక...
విశాఖ నగరం...పరిసర ప్రాంతాల కోట్లాది రూపాయల భూ ఆక్రమణల కుంభకోణాలు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించడంతో...ఈ స్కామ్ లపై ఎపి ప్రభుత్వం 2017 జూన్ 28న గ్రేహౌండ్స్ డిఐజి వినీత్ బ్రిజ్లాల్, విశాఖ జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ జి.సృజన, చిత్తూరు జిల్లాకు చెందిన ప్రత్యేక ఉపకలెక్టర్ పార్థసారధితో ప్రత్యేక విచారణ బృందం(సిట్) నియమించిన సంగతి తెలిసిందే. ఈ భూ కుంభకోణాలపై విచారణ జరిపిన సిట్ కమిటీ ఈ ఏడాది జనవరి 29న విశాఖ నగర్ పోలీస్ కమిషనర్ యోగానంద్కు నివేదిక అందజేసింది. ఆ తరువాత కొద్ది రోజుల వ్యవధిలోనే సిపి యోగానంద్ సిట్ నివేదికను ప్రభుత్వానికి అందజేసినట్లు తెలిసింది.
ఫిర్యాదుల వెల్లువ...ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణకే...
ఈ భూ కుంభకోణాలకు సంబంధించి అందిన దాదాపు 3000 ఫిర్యాదుల్లో 348 ఫిర్యాదులను సిట్ అధికారులు విచారించారు. విశాఖ జిల్లా...విశాఖ సిటీ వ్యాప్తంగా సిట్కు వచ్చిన మొత్తం ఫిర్యాదుల్లో ప్రభుత్వ భూముల ఆక్రమణలు, ట్యాంపరింగ్కు సంబంధించి వచ్చిన ఈ 348 ఫిర్యాదులపై సిట్ బృందం దృష్టి కేంద్రీకరించి విచారణను గతేడాది డిసెంబరు 28కి పూర్తి చేసింది. మిగిలిన ఫిర్యాదుల్లో అత్యధికం వ్యక్తిగత ఫిర్యాదులు కావడంతో సిట్ వాటి జోలికి పోకుండా ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణపైనే ప్రధానంగా దృష్టి సారించి తమకు లభించిన సమాచారం ఆధారంగా విచారణ పూర్తి చేసినట్లు తెలిసింది.
ప్రజాప్రతినిధుల ప్రమేయం...అధికారులది కూడా...
ఈ ల్యాండ్ స్కామ్ ల విచారణలో భాగంగా రెవెన్యూ అధికారులు, ఉద్యోగులు, ఫిర్యాదుదారులను సిట్ బృందం విచారించింది. భీమిలి, విశాఖ రూరల్, పెందుర్తి, గాజువాక, పెదగంట్యాడ, విశాఖ అర్బన్, ఆనందపురం, పద్మనాభం, అనకాపల్లి, పరవాడ, అచ్యుతాపురం, సబ్బవరం సహా మరికొన్ని మండలాల్లో వివిధ రకాల ప్రభుత్వ భూములకు సంబంధించి దాదాపు 3000 ఎకరాల భూములు ఆక్రమణలకు గురైనట్లు సిట్ తన నివేదికలో పేర్కొనట్లు తెలిసింది. ఈ 3000 ఎకరాల్లో అత్యధిక భాగం విశాఖ సిటీ పరిధిలోనే ఉన్నాయంటున్నారు. వేల కోట్ల రూపాయల విలువజేసే ఈ భఊములు సుమారు 300 మంది వ్యక్తుల చేతుల్లోనే ఉన్నాయని, ఆ విషయం...ఆ వ్యక్తులే సిట్ విచారణలో కీలకమని తెలుస్తోంది. దీంతో సిట్ కూడా ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించి సుమారు 140 మంది అక్రమార్కులపై ఎఫ్ఐఆర్కు సిఫార్సు చేసినట్లు సమాచారం. వీరిలో ప్రజాప్రతినిథుల అనుచరులే కాదు తహశీల్దార్ స్థాయి నుంచి ఆర్ఐ, విఆర్ఒల స్థాయి వరకు ప్రభుత్వ అదికారులు కూడా ఉన్నట్లు తెలిసింది.
ఎందుకు బైట పెట్టడం లేదు సిట్ నివేదిక...ఎందుకు బైట పెట్టడం లేదు
అయితే సుమారు రెండు నెలల క్రితమే సిట్ నివేదిక ప్రభుత్వం చేతికి అందినా నేటికి ఈ నివేదిక బైటపెట్టకపోవడంలో ఆంతర్యం ఏమిటని ప్రజాసంఘాల నేతలు ప్రశ్నిస్తున్నారు. వేలకోట్ల రూపాయల విలువైన ఈ విశాఖ భూ కుంభకోణంలో అధికార పార్టీకి చెందిన మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యేల అనుచరులు ఉన్నట్లు...ప్రజాప్రతినిధుల్లో కొంతమందికి నేరుగా ప్రమేయం లేకున్నా వారి బినామీల పేర్లు ఉన్నట్లు తేలడంతో ఈ నివేదిక బైటకు వస్తే ప్రభుత్వ ప్రతిష్ట దెబ్బతినడం ఖాయమని సిఎం చంద్రబాబు భావిస్తున్నారట. అంతేకాకుండా రాజకీయంగా ముప్పేట దాడి ఎదుర్కొంటున్న ఈ దశలో ఈ సిట్ నివేదిక బైటకు వస్తే మరింత ఇరకాటంలో పడతామని భావించి నివేదికను బైటపెట్టకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు తాత్సారం చేస్తున్నారని ప్రజాసంఘాలు ఆరోపిస్తున్నాయి.