ఆ ఇద్దరు అక్కచెళ్లెళ్లు ఎందుకు అలా ఆత్మహత్య చేసుకున్నారంటే?...కారణాలు ఇవే!
చిత్తూరు:సంచలనం సృష్టించిన కలిగిరి అక్కాచెళ్లెళ్ల ఆత్మహత్య ఉదంతంలో వారి బలవన్మరణానికి కారణాలు పోలీసుల విచారణలో వెల్లడయ్యాయి. ప్రధానంగా ఈ సోదరీమణుల్లో ఒకరి ప్రేమ వ్యవహారమే ఇంతటి విషాదానికి దారితీసిందని తెలుస్తోంది.
ఈ అక్కాచెల్లెలులో ఒకరు రాసిన లేఖ బైటపడటం వల్ల వీరి ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారం కారణమని పోలీసులు అంచనాకు రాగలిగారు. ఎంతో అన్యోన్యంగా మెలిగే ఈ అక్కాచెళ్లెళ్లు చనిపోయేటప్పుడు కూడా ఒకే విధమైన డ్రస్ వేసుకొని ఒకే చీరతో ఒకే కొక్కానికి ఉరేసుకొని చనిపోవడం కలకలం సృష్టించింది. మరోవైపు కుటుంబ పోషణ కోసమని తాను ఉపాధి వెదుకుతూ కువైట్ వెళ్లిన తండ్రి అజంతుల్లా తన కుమార్తెల అంత్యక్రియల్లో పాల్గొనలేకపోవడం మరో విషాదం.
చిన్ననాటి నుంచి...సున్నిత మనస్కులు
చిత్తూరు జిల్లా కలికిరి పట్టణంలో అక్కాచెల్లెళ్లు తస్లీం, షికాబీల ఆత్మహత్య ఉదంతం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. వీరి మరణానికి కారణం పై ఉత్కంఠ నెలకొనగా పోలీసుల విచారణలో వివరాలు వెల్లడయ్యాయి. ఈ ఇద్దరు అక్కచెళ్లెళ్లు చిన్ననాటి నుంచే చాలా సున్నిత మనస్కులని...పెరిగి పెద్దయినా ఆ స్వభావంలో మార్పు లేదని తెలిసింది. గతంలో ఇంటర్మీడియట్ చదువుతున్న రోజుల్లో కూడా ఇద్దరి మధ్య ఓ చిన్న విషయంలో భేదాభిప్రాయాలు రాగా అప్పుడు కూడా ఇద్దరూ కలసి చనిపోవాలని నిర్ణయించుకుని ఒకేరంగు దుస్తులు ధరించి పురుగులమందు తాగారు.
గతంలో ఒకసారి...ఆత్మహత్యాయత్నం
వీరిని గమనించిన కుటుంబసభ్యులు సకాలంలో కలికిరి, తిరుపతి ప్రాంతాల్లోని ఆసుపత్రుల్లో వైద్యచికిత్సలు అందించడంతో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. అయితే అప్పుడుప్పుడూ గొడవలు పడినా అక్కాచెల్లెళ్లకు ఒకరంటే మరొకరికి ప్రాణం. మదనపల్లెలో బీఎస్సీ నర్సింగ్ చదువుతున్న వీరిద్దరికి ఒకసారి మనస్పర్ధలు రావడంతో ఒకరికొకరు రాసుకున్న లేఖలు కూడా ఇప్పుడు వెలుగులోకి వచ్చాయి. చెల్లీ నాతో ఎందుకు మాట్లాడవు...నీకోసమే నేను బతుకుతున్నాను అని అక్క చెల్లెలికి లేఖ రాయగా...అక్కా నీ కోసమే నేను బతుకుతున్నాను...నువ్వే నాతో ఎందుకు మాట్లాడవని చెల్లెలు అక్కకు లేఖ రాసింది. వీరి మధ్య అంతటి అనుబంధం నెలకొని ఉంది.
ప్రేమ వ్యవహారమే...కారణం
అయితే ఈ క్రమంలో అక్క తస్లీం ఓ యువకుడిని ప్రేమించింది. అతడు ఈమె ప్రేమని అంగీకరించకపోవడంతో ఆమె వన్ సైడ్ లవ్ విఫలమైంది. అయినా ఆమె ప్రేమికుడ్ని ఉద్దేశించి చావు వరకు నీతోనే అంటూ లేఖ రాసుకుంది. ఈ క్రమంలో అక్క తాను చనిపోవాలని అనుకొని...మళ్లీ తాను చనిపోతే చెల్లి ఉండలేదని భావించి తాను ఆత్మహత్య చేసుకోవాలనుకునే విషయం చెల్లితో చెప్పింది. ఈ క్రమంలోనే సోమవారం ఈ అక్కాచెల్లెళ్లు ఉరి వేసుకుని మృతిచెందారు.
కాలేజ్ లోను...సత్ప్రవర్తన ...
పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో ఈ విషయం తేలగా...పోలీసులు ఇందుకు సంబంధించి అక్క రాసుకున్న లేఖలు కూడా సేకరించారు. అంతేకాకుండా ఈ విషయమై మదనపల్లె నుంచి వచ్చిన తస్లీం, షికాబీ స్నేహితురాళ్లను కలికిరి ఎస్సై శ్రీనివాసులు విచారించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కళాశాలలో కూడా వీరిద్దరూ ఎంతో సత్ప్రవర్తనతో గౌరవంగా మెలిగేవారని చెప్పారు. అందరితో బాగా కలివిడిగా ఉంటూ అక్కాచెల్లెళ్లు ఒకర్ని విడిచి ఒకరు ఉండేవారు కాదని తెలిపారు. ఎప్పుడూ ఎలాంటి గొడవలు లేవని, చాలా సున్నిత మనస్కులని తెలిపారు.
చివరి చూపుకు...నోచుకోని తండ్రి
మరోవైపు కుటుంబ పోషణార్థం ఉపాధిని వెతుక్కుంటూ కువైట్ వెళ్లిన తండ్రి అజంతుల్లా తన కుమార్తెల అంత్యక్రియల్లో పాల్గొనలేకపోవడం బంధువుకు కన్నీరు పెట్టించింది. ఆయన బక్రీద్ పండుగకు ఇక్కడకు రావడంతో పాటు ఇటీవలే తిరిగి కువైట్కు వెళ్లాడు. వెంటనే తిరిగి వచ్చేందుకు అక్కడి పరిస్థితులు అనుకూలించక పోవడంతో ఆయన రాలేకపోయినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. దీంతో కుటుంబ సభ్యులు,బంధువులు,స్నేహితులు మధ్యనే వారి అంత్యక్రియలను నిర్వహించారు.