ఆంధ్రప్రదేశ్ విషయంలో బిజెపి తెగేదాకా లాగుతోంది...ఎందుకు?...
Recommended Video
అమరావతి: ఆంధ్రప్రదేశ్ విషయంలో బిజెపి అత్యంత మొండిగా వ్యవహరిస్తోందన్నది సుస్పష్టం. ఒక రాజకీయ పార్టీగా ఉండి తమ వైఖరి పార్టీకి నష్టం చేస్తుందని స్పష్టంగా తెలిసి ఏ రాజకీయ పార్టీ కూడా సాధారణంగా ఈ విధంగా వ్యవహరించదు. మరైతే బిజెపి ఎందుకలా వ్యవహరిస్తోంది?...
బిజెపి ఎందుకు ఎపికి న్యాయం చేసే విషయంలో అసలు స్పందించడం లేదు?...మరోవైపు రాజకీయంగా అసాధారణ తీరులో ప్రతిస్పందిస్తోంది...దీనివెనుక బిజెపి వ్యూహమేంటి?...ఆ పార్టీ ఆలోచనలు ఏమైయుండొచ్చు?...ఎందుకంటే...మోదీ,అమిత్ షా లెక్కలే వేరు...ఎలాగంటే?....
అన్ని పార్టీలు...ఎపి గల్లీల నుంచి ఢిల్లీ దాకా...
ఒక్క బిజెపి మినహా అన్ని రాజకీయపార్టీలు టిడిపి, వైసిపి, కాంగ్రెస్, వామపక్షాలు ఎపికి ప్రత్యేక హోదా ఇవ్వాలని, విభజన హామీలు అమలు చేయాలని ముక్త కంఠంతో డిమాండ్ చేస్తున్న భారతీయ జనతా పార్టీ ఎందుకు పట్టించుకోవడం లేదు. అలా పట్టించుకోకపోతే రాజకీయంగా ఆ పార్టీకి నష్టమే కదా?...సాధారణంగా ఎవరి మదిలోనైనా తలెత్తే పశ్నఇది. పైగా దేశం మొత్తాన్ని కాషాయీకరించాలనే పట్టుదలతో ఉన్న బిజెపి ఆ దిశలో ఒక్కో అడుగు విజయవంతంగా ముందుకు వేస్తూ సాగుతున్న క్రమం కూడా మనం చూస్తున్నాం. మరలాంటప్పుడు అదే కోణంలో ఆంధ్రప్రదేశ్ ను ఎందుకు చూడటం లేదు...రాష్ట్రం సంక్లిష్ట స్థితిలో ఉన్నప్పుడు సాయం చేసి ప్రజల మన్ననలు పొందవచ్చు కదా!...మరలా ఎందుకు చేయడం లేదు...దీని వెనుక మతలబు ఏమై ఉండొచ్చు..ఆశ్చర్యంగా అనిపించినా రాజకీయాలా ప్రయోజనాల దృష్ట్యానే బిజెపి ఇప్పుడు ఏపీకి సాయం చెయ్యడం లేదు...అదెలాగంటే...
ఇప్పుడు సాయం చేస్తే...క్రెడిట్ ఎవరి ఖాతాలో...
బిజెపి ఎప్పుడు రాజకీయం చేసినా అది సున్నితంగా ఉండదు...వాజ్ పేయి, అద్వానీ ల తరం తరువాత ఇప్పుడు మోడీ, అమిత్ షా రాజకీయం మరింత పదునుగా ఉండటం అందరూ గమనిస్తూనే ఉన్నారు. అలాగే వెనుకఉండి నడిపించే ఆర్ఎస్ఎస్ కూడా ఉదారవాద రాజకీయాలను ప్రోత్సహించదనేది ప్రస్పుటమే...కాబట్టే బిజెపి ఎపికి సంబంధించి తమకు అనుకూల సమయం కోసం వేచిచూస్తోంది. సరైన సమయంలో సరైన ఫలితాన్నిచ్చే సరైన నిర్ణయం తీసుకోవడం కోసమే మోడి, అమిత్ షాల నేతృత్వంలోని బిజేపి ఎప్పుడూ పొంచి వుంటోంది. ఆంధ్రాకు సంబంధించి వారు వేచి చూసే సమయం ఇంకా రాలేదు. ఇప్పుడు అందరూ డిమాండ్ చేస్తున్న విధంగా ఎపికి ప్రత్యేక హోదానో, విభజన హామీలో...లేక భారీ కేటాయింపులో జరిపితే ఆ క్రెడిట్ ఎవరి ఖాతాలో పడుతుంది...ఇప్పుడు ఈ ప్రశ్నకు ఖచ్చితమైన సమాధానమే లేదు...అయితే మరొకటి మాత్రం గ్యారెంటీగా చెప్పొచ్చు...ఆ క్రెడిట్ బిజెపికి మాత్రం దక్కదని...మరలాంటప్పుడు బిజెపి ప్రతిస్పందన ఇలాగే ఉండటంలో ఆశ్చర్యం ఏముంది!
మరి బిజెపి ఏం చేస్తుంది?...తెగేదాకా లాగుతోంది!
ఏ రాజకీయ పార్టీ అయినా ఒక పని చేస్తే విజయమో...లాభమో...క్రెడిటో...దక్కితీరాలి...అనే కోణంలోనే చూస్తాయి. మోడీ, అమిత్ షా నేతృత్వంలోని బిజెపి ఈ విషయంలో మరింత ఫోకస్డ్ గా ఉంటున్న విషయం అందరూ గమనించే ఉంటారు...అందుకే ఎపిలో రాజకీయ పరిణామాలు మారాలి...క్రెడిట్ తమకు దక్కేవిధంగా పరిస్థితులు రావాలి. అందుకే తమ మిత్ర పక్షం, భాగస్వామ్య పార్టీ అయిన తెలుగుదేశంతోనే మైత్రీ బంధం తెంచుకోవడానికి సిద్దపడింది. పొమ్మనకుండా పొగబెట్టిన తీరులో తెగేదాకా లాగుతోంది. తాము తెంచేస్తే అది ఎపిలో భవిష్యత్ రాజకీయాల దృష్ట్యా నష్టం కాబట్టి టిడిపినే తమతో బంధం తెంచుకునేవిధంగా రాజకీయం నడిపిస్తోంది...ఎపిలో బిజెపి పాగా వేయడానికి ప్రధాన అడ్డంకి టిడిపినే కాబట్టి...అందుకే ముందుగా ఆ పార్టీనే టార్గెట్ చేసింది...మిగిలిన పార్టీల సంగతి ఆ తరువాత చూస్తుంది...బిజెపితో పొత్తు మాకొద్దు అని టిడిపినే తనంతట తానుగా బయటకు వచ్చేలా చేస్తోంది...అచ్చం ఆ పార్టీ కోరుకున్నట్లే టిడిపి ప్రతిస్పందిస్తుండటం బిజెపి అధిష్టానం వ్యూహ చతురతకు నిదర్శనం.
బిజెపికి ఫలితం కావాలి...పాగా వేయాలి...
అంచెలంచెల ఎదుగుదల బిజెపికి నచ్చని పద్ధతి...టైమింగ్ చూసుకొని టార్గెట్ పూర్తి చెయ్యడమే ఆ పార్టీకి ఇష్టం. అందుకు త్రిపుర లో ఆ పార్టీ విజయం సాధించేందుకు అవలంభించిన విధానాలు, గెలిచిన తీరే నిదర్శనం. పైగా త్రిపురను చేజిక్కించుకోవడం వెనుక రాజకీయ వ్యూహకర్తగా వ్యవహరించిన బిజెపి నేత రామ్ మాధవ్ తెలుగువాడనే విషయం గమనార్హం. ఎక్కడో జమ్మూ కాశ్మీర్, ఈశాన్య రాష్ట్రాలకు పార్టీ ఇన్ ఛార్జ్ గా పనిచేస్తూ పార్టీని ముందుకు నడిపిస్తున్న రామ్ మాధవ్ కు తన సొంత రాష్ట్రం రాజకీయాల గురించి తెలియదా?...ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ లో అవలంభించాల్సిన విధానం గురించి బిజెపి ఎప్పుడో స్కెచ్ రెడీ చేసుకుందని, ఆ స్కెచ్ ప్రకారమే వెంకయ్యనాయుడును సైడ్ చేశారని, ఆ తరువాత ఆ ప్లేస్ ను పూర్తి బిజెపి-ఆర్ఎస్ఎస్ శైలిలో రామ్ మాధవ్ భర్తీ చేస్తారని తెలుస్తోంది...అయితే బిజెపికి సంబంధించి వెంకయ్యనాయుడునే నమ్ముకున్నటిడిపినే ఈ వ్యూహాన్నిపసిగట్టడంలో చాలా ఆలస్యం చేసింది. ఇటీవల విశాఖ సిఐఐ సదస్సులో కలుసుకున్న సందర్భంగా చంద్రబాబుకు ఈ విషయమై వెంకయ్యనాయుడు స్పష్టత ఇచ్చాకే టిడిపి అసలు పరిస్థితిని అర్థం చేసుకోగలిగింది.
ముందు ముందు ఏం జరగనుంది?...టిడిపికి తిప్పలు తప్పవా?...
బిజెపికి...ఎపికి...చంద్రబాబు ఏదైతే జరగకూడదని కోరుకుంటున్నారో అదే జరుగుతున్న పరిస్థితి...తాను ఏదైతే ఆశించి బిజెపితో ఎంతో అణుకువ గలిగిన రాజకీయం చేశారో...నాలుగేళ్లు రాష్ట్రానికి కేంద్రం చేయాల్సినంత సాయం చేయకున్నా కవర్ చేసుకుంటూ వచ్చారో...తద్వారా బిజెపిని ఎపిలోకి వెంటనే అడుగిడకుండా మిత్ర ధర్మంతో కొంతకాలం వాయిదా వేయించాలని భావించారో...అవన్నీ కల్లలుగానే మిగిలి...ఒక్కసారిగా ఊహలు తలకిందులై...కఠిన వాస్తవాన్ని ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ఎదురయ్యాయి. అందులోనూ తాను ఎదుర్కోనున్నది అసాధారణమైన, అవసరమైతే ఎంత కటువుగానైనా వ్యవహరించే నేతలను కావడమే చంద్రబాబును కలవరపెడుతోంది...ఇప్పటివరకు ఎపి రాజకీయాలపై పూర్తి దృష్టి నిలపని బిజెపి ఇకపై ఆ పని చేయనుందట...ఆ వ్యూహాలను ఎదుర్కోవడంపైనే టిడిపి సత్తా తేలనుందని, అది అంత ఈజీ కాదని తెలుస్తోంది.