రాసిచ్చిన స్క్రిప్టు చదువుతున్నావా?, రాష్ట్రానికి అసలు నీ అవసరమే లేదు: పవన్పై టీడీపీ
హైదరాబాద్: కొందరు ఆడిస్తోన్న నాటకంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఓ భాగస్వామి అని ఏపీ మంత్రి అమరనాథరెడ్డి మండిపడ్డారు. పవన్ కల్యాణ్ రోజుకో మాట మాట్లాడుతున్నారని, ప్రత్యేక హోదా కోసం ఆమరణ దీక్ష చేస్తానన్న పవన్ కల్యాణ్ వ్యాఖ్యలను ప్రజలు ఎలా అర్థం చేసుకోవాలని ఆయన ప్రశ్నించారు.
పవన్ కల్యాణ్ పరిణతితో మాట్లాడుతున్నారా? ఎవరైనా రాసిచ్చిన స్క్రిప్టు చదువుతున్నారా? అని ఎద్దేవా చేశారు. అసలు పవన్ వంటి నాయకుల అవసరం రాష్ట్రానికి లేనే లేదని, పైగా అటువంటి వారితో రాష్ట్ర ప్రయోజనాలకు ఇబ్బంది కలుగుతుందని అన్నారు. ఇక తెలంగాణ సీఎం కేసీఆర్.. ఓవైపు థర్డ్ ఫ్రంట్ అంటూనే మరోవైపు బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నట్టు కనబడుతోందన్నారు.
బీజేపీకి అందుకే భయమా?: యనమల
అవిశ్వాసం అంటే బీజేపీకి అంత భయమెందుకుని ఏపీ ఆర్ధికశాఖ మంత్రి యనమల రామకృష్ణుడు ప్రశ్నించారు. సొంత పార్టీ సభ్యుల నమ్మకం లేకనే భయపడుతున్నారా? అని ప్రశ్నించారు. ప్రధాని మోడీపై పార్టీ సభ్యులపై నమ్మకం లేకనే భయపడుతున్నారా? అని ప్రశ్నించారు.
ప్రధాని మోదీపై అసంతృప్తితో ఉన్న బీజేపీ ఎంపీలు.. అవిశ్వాసంపై ఎక్కడ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేస్తారోనన్న భయం వారికి పట్టుకుందన్నారు. అవిశ్వాస తీర్మానంపై చర్చకు అవసరమైన సభ్యులు సంతకాలు పెట్టి, వారంతా లేచి నిలబెడితే కచ్చితంగా నోటీసును ఆమోదించి, చర్చకు తేదీని నిర్ణయించాలన్నారు. అయితే బీజేపీ మాత్రం ఇందుకు విరుద్దంగా, అప్రజస్వామికంగా వ్యవహరిస్తోందన్నారు.