బాబుపై ఆధారాలుంటే విచారణ జరిపించరేం: బీజేపీకి లక్ష్మీపార్వతి, పవన్పై ఫైర్
అమరావతి/హైదరాబాద్: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఆయన బినామీలు కలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కొల్లగొడుతున్నారని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకురాలు లక్ష్మీపార్వతి నిప్పులు చెరిగారు. చంద్రబాబు అండతో టీడీపీ నేతలు అక్రమ వ్యాపారాలు నిర్వహిస్తున్నారని ఆమె ఆరోపించారు.
పలుచోట్ల క్వారీ తవ్వకాలు అక్రమంగా జరుగుతున్నాయని, అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారని, అయినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ప్రధాని నరేంద్ర మోడీ, సీఎం చంద్రబాబులు కలిసి విభజన హామీల విషయంలో నాటకాలు ఆడుతున్నారని విమర్శించారు. బీజేపీ నేతలు టీడీపీ ప్రభుత్వాన్ని విమర్శించడంపై ఆమె ప్రశ్నించారు.
చంద్రబాబు ఈ ప్రాజెక్టులో ఇంత తిన్నాడు, ఆ ప్రాజెక్టులో అంత తిన్నాడని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారని, అసలు మీ వద్ద ఆధారాలు ఉన్నప్పుడు ఆయనపై విచారణ ఎందుకు జరిపించడం లేదని లక్ష్మీపార్వతి ప్రశ్నించారు. చంద్రబాబు అవినీతి ఈ నాలుగేళ్ల పాటు బీజేపీ నేతలకు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు కనిపించలేదా అని ప్రశ్నించారు. చంద్రబాబుకు రాష్ట్ర ప్రయోజనాల కంటే సొంత రాజకీయ ప్రయోజనాలు ముఖ్యమన్నారు. నారాయణ కాలేజీలలో ఆత్మహత్యలు చేసుకుంటున్న అమ్మాయిల గురించి విచారణ ఎందుకు జరిపించడం లేదని ప్రశ్నించారు.
జగన్ ప్రజా సంకల్ప యాత్ర
వైసీపీ అధినేత వైయస్ జగన్ ప్రజా సంకల్ప యాత్ర శనివారం తూర్పు గోదావరి జిల్లా గొల్లప్రోలు మండలం చేబ్రోలులో సాగింది. ఆయన పలువురి సమస్యలు వింటూ, అభివాదం చేస్తూ ముందుకు సాగారు. తనను కలిసిన వారిని ఆశీర్వదిస్తూ సుమారు మూడు కి.మీ. నడిచారు. మధ్యలో మహిళలు, బాలికలతో సెల్ఫీలు దిగారు.
కాగా, కాపు రిజర్వేషన్లకు సంబంధించి ఇటీవల జగన్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా సీతారామస్వామి ఆలయ సమీపంలో కాపు యువత నల్లజెండాలు, ప్లకార్డులతో నిరసన తెలిపింది. జగన్ ఆ ప్రాంతానికి చేరుకునే సమయానికి ముందే పోలీసులు నిరసనకారులను అక్కడి నుంచి పంపించి వేశారు.
దీంతో వారంతా జాతీయ రహదారి పక్కనున్న భవనం పైకి ఎక్కి నిరసన తెలిపేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. నలుగురు యువకులు సమీపంలోని ఓవర్ హెడ్ ట్యాంకు ఎక్కి అక్కడ నుంచి నల్లజెండాలు, ప్లకార్డులను ప్రదర్శిస్తూ నిరసన వ్యక్తం చేశారు. పోలీసులు వెంటనే వారిని అక్కడి నుంచి పంపించారు.