చివరి నిమిషంలో షాక్: బోండా ఉమకు అందుకే మంత్రి పదవి దక్కలేదా?
ఇటీవల జరిగిన కేబినెట్ విస్తరణలో విజయవాడ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వర రావుకు చోటు దక్కుతుందని బాగా ప్రచారం జరిగింది. కానీ ఆయనకు చోటు దక్కలేదు. కేబినెట్ పదవిపై ఎన్నో ఆశలు పెట్టుకున్న ఉమ కూడా..
విజయవాడ: ఇటీవల జరిగిన కేబినెట్ విస్తరణలో విజయవాడ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వర రావుకు చోటు దక్కుతుందని బాగా ప్రచారం జరిగింది. కానీ ఆయనకు చోటు దక్కలేదు. కేబినెట్ పదవిపై ఎన్నో ఆశలు పెట్టుకున్న ఉమ కూడా.. ఆ తర్వాత తీవ్ర అసంతృప్తికి లోనై, టిడిపిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
దావుద్ ఇబ్రహీంలా, అన్నీ ఫెయిల్: జగన్పై జేసీ దివాకర్ తీవ్ర వ్యాఖ్యలు
అయితే, ఆయనకు చోటు దక్కకపోవడంపై వివిధ రకాల ప్రచారం సాగుతోంది. కేబినెట్ విస్తరణ రోజే అసంతృప్తికి లోనైన బోండా ఉమను పిలిపించుకున్న చంద్రబాబు.. మొదటిసారి ఎమ్మెల్యేవు అయిన నీవు అడగడం భావ్యమా అని ప్రశ్నించారని కూడా తెలిసింది.
మొదటిసారి ఎమ్మెల్యేనే కాకుండా ఆయనకు పదవి రాకపోడవంపై మరో కారణం కూడా ఉందనే వాదనలు వినిపిస్తున్నాయి. కాపు అంశంపై విపక్షాలు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ టిడిపిని ప్రశ్నించినప్పుడు బోండా ఉమ ధీటుగా స్పందించారు. మంత్రి పదవి కోసం ఈ సామాజిక కార్డు కూడా ఉపయోగపడుతుందని భావించారు. కానీ ఆయన ఆకాంక్ష నెరవేరలేదు.
ఈ ఆర్హతలతో ఆశించారు కానీ..
బోండా ఉమామహేశ్వర రావు పార్టీ ప్రధాన కార్యదర్శిగా, అధికార ప్రతినిధిగా పని చేశారు. బోండా ఉమ 2014 ఎన్నికలలో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుంచి గెలుపొందారు. అనేక విషయాలపై అవగాహన పెంచుకోవడం, రాజకీయ పరిణామాలపై పార్టీ వాదనను వినిపించే వాగ్ధాటి ఉన్న నేతగా బోండాకు మంచి పేరుంది.
టీవీ చర్చలలో కూడా ఆయన తన వాదనను ఎటువంటి సంకోచం, సందేహం లేకుండా వినిపిస్తారు. కులం కూడా ఆయనకు కలిసివచ్చింది. ఈ అర్హతతోనే తనకు మంత్రి పదవి వస్తుందని ఆశించారు.
పరిగణలోకి తీసుకున్న అధిష్టానం.. కానీ
ఒకదశలో టీడీపీ హైకమాండ్ కూడా ఆయన పేరును పరిశీలనలోకి తీసుకుంది. రాజధాని నగరంలో ఉమా వంటి నేతలు ఉండాలని భావించింది. కానీ ఊహించని ఓ సంఘటన ఉమ అదృష్టాన్ని తలకిందులు చేసిందని టిడిపిలో చెవులు కొరుక్కుంటున్నారట.
రవాణాశాఖ కార్యాలయం వద్ద ట్రాన్స్పోర్టు కమిషనర్ బాలసుబ్రహ్మణ్యాన్ని కేశినేని నాని అడ్డుకోవడం, అదే సమయంలో బోండా ఉమ ట్రాన్స్పోర్టు కమిషనర్కు రక్షణగా ఉన్న గార్డును తోసివేయడం, దూషించడం సంఘటనలు సంచలనం రేపాయి.
చంద్రబాబు జోక్యంతో..
అయితే, ప్రజాప్రతినిధులమైన తాము కార్యాలయానికి వస్తే కనీస మర్యాద పాటించలేదనీ, రెండు గంటలపాటు నిలబెట్టి మాట్లాడారనీ, సెక్యురిటీ సిబ్బందితో దగ్గరకు రావద్దని చెప్పించారనీ, ఈ తరుణంలోనే సెక్యూరిటీ గార్డ్ను నెట్టవలసి వచ్చిందని బోండా ఉమ వివరణ ఇచ్చారు. అయినప్పటికీ ఈ వివాదం చల్లారలేదు.
ఆ మరుసటి రోజు సీఎం చంద్రబాబు ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్యే బోండా ఉమలను పిలిచి క్లాస్ పీకారు. రవాణా శాఖ అధికారులకు క్షమాపణ చెప్పాలని సూచించారు. దీంతో వారు తగ్గారు. అధికారులకు క్షమాపణ చెప్పడంతో సమస్య సద్దుమణిగింది.
వివాదం వల్లే దెబ్బపడింది
ఆ తర్వాత, అసెంబ్లీ సమావేశాలలో ఈ ఘటనపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వాయిదా తీర్మానం ఇచ్చి, చర్చకు పట్టుబట్టింది. వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర రెడ్డి అసెంబ్లీ ప్రాంగణంలోనే దీక్షకు కూర్చున్నారు. ఈ పరిణామాలన్నీ కూడా మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. చెవిరెడ్డి అరెస్టును చంద్రబాబు కూడా తప్పుబట్టారు.
ఆ తర్వాత రెండు రోజులకు మంత్రివర్గ విస్తరణ జరిగింది. పై వివాదం వల్లే బోండా ఉమకు వచ్చిన అవకాశాన్ని దెబ్బతీసిందని అంటున్నారు. అంతకముందు హైకమాండ్ ఆయనకు మంత్రి పదవి, లేదా ఛీప్ విప్ పదవి ఇవ్వాలని భావించినప్పటికీ ఆ తర్వాత వెనక్కి తగ్గిందని అంటున్నారు. ఇందుకు కారణం రవాణాశాఖ కార్యాలయం వద్ద జరిగిన సంఘటనేనని చెబుతున్నారు.