కలకలం: 'తేలిపోయింది.. వీడియోలే నిదర్శనం, పురంధేశ్వరి సహా అమిత్ షాతో బుగ్గన భేటీ వెనుక?'
విజయవాడ: ఏపీకి కేంద్రం తీవ్ర అన్యాయం చేస్తోందని, ఇలాంటి పరిస్థితుల్లోను వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు బీజేపీ నేతలను కలుస్తున్నారని టీడీపీ విమర్శలు గుప్పిస్తోంది. ప్రత్యేక హోదా నుంచి ఇప్పుడు కడప స్టీల్ ప్లాంట్ వరకు ఏపీకి కేంద్రం అన్యాయం చేసిందన్నారు. ఇంత జరుగుతున్నా వైసీపీ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి బీజేపీ నేతలతో కలిసి ఆ పార్టీ జాతీయ అధ్యక్షులు అమిత్ షాను కలవడం దేనికి సంకేతమని టీడీపీ ప్రశ్నిస్తోంది.
బీజేపీతో వైసీపీ అంటకాగుతోందని ఆరోపించారు. అమిత్ షా, రామ్మాధవ్లతో బుగ్గన భేటీ కావడం వెనుక మతలబు ఏమిటని ప్రశ్నించారు. బీజేపీ నేత ఆకుల సత్యనారాయణతో కలిసి ఒకే కార్లో బుగ్గన.. అమిత్ షా ఇంటికి వెళ్లారన్నారు. బీజేపీ, వైసీపీ కుమ్మక్కు రాజకీయాలకు ఇదే సాక్ష్యం అన్నారు. బీజేపీకి వైసీపీ సిస్టర్ పార్టీ అన్నారు. అసలు అమిత్ షాను బుగ్గన ఎందుకు కలవాల్సి వచ్చిందన్నారు.
బయటకు వచ్చిన వీడియోలే నిదర్శనం
స్టీల్ ప్లాంట్ ఇవ్వనన్న కేంద్రంతో వైసీపీ మంతనాలు ఏమిటని టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. అమిత్ షా, రామ్ మాధవ్లతో బుగ్గన భేటీ అయ్యారని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. బయటకు వచ్చిన వీడియోలే బీజేపీ - వైసీపీ కుమ్మక్కుకు నిదర్శనం అన్నారు. జగన్ను రమణదీక్షితులు కూడా కలిశారని, అలా కలవాల్సిన అవసరం ఏమొచ్చిందని నిలదీశారు. తెలంగాణ నేత, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులును వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయసాయి రెడ్డి కూడా కలిశారని అచ్చెన్నాయుడు చెప్పారు.
ఢిల్లీ పరిణామాలతో తేలిపోయింది
ఢిల్లీ పరిణామాలతో బీజేపీ, వైసీపీలు వేరు కాదని స్పష్టమైందని అచ్చెన్నాయుడు అన్నారు. కన్నాకు బీజేపీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించడంతోనే ఈ విషయం స్పష్టమైపోయిందన్నారు. ఏపీకి అన్యాయం జరుగుతుంటే కేంద్రంపై ఉద్యమించకుండా వైసీపీ మిలాఖత్ కావడం దారణం అన్నారు. ఇప్పుడు బీజేపీని, వైసీపీని వేర్వేరుగా చూడాల్సిన అవసరం లేదన్నారు. బీజేపీ, వైసీపీలు అంటకాగుతున్నాయని మంత్రి అమర్నాథ్ రెడ్డి కూడా ఆరోపించారు.
మాకు నష్టమని తెలిసినా
బీజేపీ, వైసీపీలు చంద్రబాబుపై కక్షపూరితంగా వ్యవహరిస్తున్నాయని అచ్చెన్నాయుడు మండిపడ్డారు. బీజేపీ ప్రధాన పార్టీ అయితే వైసీపీ బీజేపీకి సిస్టర్ పార్టీ అన్నారు. తమకు ఇష్టం లేకపోయినా, బీజేపీతో పొత్తుతో తమకు నష్టం జరుగుతుందని తెలిసినా కేవలం రాష్ట్ర ప్రయోజనాలే పరమావధిగా ఆ పార్టీతో కలిసి ఎన్నికల్లో పోటీ చేశామన్నారు. అధికారంలోకి వచ్చాక ఏ ఆశయంతో, ఉద్దేశంతో పొత్తు పెట్టుకున్నామో వాటి అమలు కోసం తాము పడిన శ్రమను రాష్ట్రంలోని ప్రతిఒక్కరూ గుర్తించారన్నారు. కానీ, కేంద్రం మాత్రం ఇన్నాళ్లూ కథలు చెప్పి, ఇస్తాం, చేస్తామంటూ చివరకు మోసం చేసే దశకు రావడంతో గ్రహించి వెంటనే ఎన్డీయే నుంచి తాము బయటకు వచ్చామని, ఇది ప్రజలు తెలుసుకోవాలన్నారు.
వైసీపీతో సంబంధం కుదిరింది కాబట్టే టీడీపీతో తెగదెంపులు
రాష్ట్రంలో పరోక్షంగా వైసీపీతో సంబంధం కుదిరింది కాబట్టే టీడీపీని బీజేపీ పక్కన పెట్టిందని అచ్చెన్నాయుడు ఆరోపించారు. కష్టాల్లో ఉన్న, ఆర్థికంగా సమస్యలు ఉన్న ఏపీని స్వయంకృషితో, కష్టంతో కేంద్రం సహకరించకపోయినా సరే నాలుగేళ్లలో ఏ రంగాన్నీ, ఏ ప్రాంతాన్నీ, ఏ వర్గాన్నీ విడిచిపెట్టకుండా ఈ స్థాయిలో అభివృద్ధి చేసినందుకా? చంద్రబాబుపై కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇలాంటి రాజకీయాలు పట్ల తాను టీడీపీ సభ్యుడిగా కాకుండా రాష్ట్రంలోని ఓ పౌరుడిగా బాధపడుతున్నానన్నారు. కష్టపడి పనిచేసే నేతకు, ప్రభుత్వానికి సహకరించాలని, లేకపోతే ఊరుకోవాలని, కానీ కుట్రలు ఏమిటన్నారు.
బుగ్గన, ఆకుల, పురందేశ్వరిల భేటీ ఆంతర్యం ఏమిటి?
ఏపీకి అన్యాయం చేసేవారిపై పోరాటం చేయాల్సింది పోయి, బుగ్గన ఆ పార్టీ నేతల వెంట వెళ్లి అమిత్ షాను కలిశారని, ప్రజాస్వామ్యంలో ఇంతకన్నా నీచమైన పరిస్థితి ఏనాడూ చూడలేదని అచ్చెన్నాయుడు అన్నారు. అమిత్ షాను రమణ దీక్షితులు, మోత్కుపల్లిని విజయసాయిని కలవడం అంతా కుట్ర కాదా అని ప్రశ్నించారు. ఇటీవల పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించి సస్పెండైన మోత్కుపల్లి... చంద్రబాబుపై విమర్శలు చేస్తే అలాంటి వ్యక్తుల్ని కలిసిన పార్టీని ఏమనాలన్నారు. బుగ్గన, ఆకుల, పురందేశ్వరిల భేటీ ఆంతర్యమేమిటన్నారు. కడప స్టీల్ప్లాంట్ ఇచ్చేది లేదని చెప్పిన తర్వాత బుగ్గనను ఢిల్లీకి పంపడం వెనుక ఉన్న కుట్ర ఏమిటన్నారు.
టీడీపీ నేతల ఆరోపణలపై ఆకుల స్పందన
టీడీపీ నేతల ఆరోపణలపై బీజేపీ నేత ఆకుల సత్యనారాయణ స్పందించారు.టీడీపీ నేతలు గాలి పోగేసి ఆరోపణలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. కానీ టీడీపీ నేతలు మాత్రం అసలు అమిత్ షాను బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఎందుకు కలవాల్సి వచ్చిందో చెప్పాలని అంటున్నారు.