'తప్పులేకుంటే స్టే ఎందుకు, బాబు-కేసీఆర్ల మధ్య రాజీ', 'కోర్టే కట్టుకథ అన్నది'
విజయవాడ: ఓటుకు నోటు కేసులో హైకోర్టు నుంచి స్టే తెచ్చుకున్న ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పైన విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆయన ఎలాంటి తప్పు చేయకుంటే స్టే తెచ్చుకొని ఎందుకు తప్పించుకుంటున్నారని వైసిపి, కాంగ్రెస్ నేతలు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత సీ రామచంద్రయ్య శుక్రవారం నాడు చంద్రబాబు పైన దుమ్మెత్తి పోశారు. ఆయన కడప జిల్లాలో విలేకరులతో మాట్లాడారు. ఓటుకు నోటు కేసులో ఏ తప్పు చేయకుంటే చంద్రబాబు స్టే కోసం హైకోర్టుకు ఎందుకెళ్లారో చెప్పాలని నిలదీశారు.
ఈ కేసులో కీలకంగా మారిన ఆడియో టేపుల్లో గొంతు తనది కాదని చంద్రబాబు ఏనాడూ చెప్పలేదని గుర్తు చేశారు. ఈ కేసులో ఇద్దరు ముఖ్మంత్రులు చంద్రబాబు, తెలంగాణ సీఎం కేసీఆర్ల మధ్య రాజీ కుదిర్చే భవన్గా రాజ్ భవన్ మారిందని విమర్శించారు. ఇద్దరు సీఎంలు రాజీపడి ఏసీబీ విచారణను నిలుపుదల చేయించారన్నారు.
కట్టుకథల కేసు అని హైకోర్టు చెప్పింది: దూళిపాళ్ల
ఓటుకు నోటు కేసుకు సంబంధించి హైకోర్టు స్టే ఇవ్వడం హర్షణీయమని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే దూళిపాళ్ల నరేంద్ర శుక్రవారం నాడు చెప్పారు. ఇది కట్టుకథల కేసు అని గతంలోనే హైకోర్టు చెప్పిందని వ్యాఖ్యానించారు.
ఈ కేసు ఏసీబీ పరిధిలోకి రాదని ఆయన చెప్పారు. ప్రజల మధ్య ఉండాల్సిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు కోర్టుల చుట్టు తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేసేందుకు కుట్ర చేస్తున్నారన్నారు. ఎన్ని కుయుక్తులు పన్నినా తమకు వచ్చే నష్టమేమీ లేదన్నారు.