ఛీఫ్ జస్టిస్కు జగన్ లేఖపై విచారణ జరగాల్సిందే ? న్యాయనిపుణులు చెప్తున్న ఐదు కారణాలివే..
సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ఏపీ హైకోర్టులోని కొందరు న్యాయమూర్తులతో కలిసి తన ప్రభుత్వాన్ని అస్ధిర పరిచేందుకు ప్రయత్నిస్తున్నారంటూ సీఎం జగన్ భారత ప్రధాన న్యాయమూర్తికి రాసిన లేఖ దేశవ్యాప్తంగా కలకలం రేపుతూనే ఉంది. జగన్ లేఖపై ఎవరికి వారు తమ అభిప్రాయాలు వినిపిస్తుండగా.. బార్ కౌన్సిళ్లు, అసోసియేషన్లు ఖండన తీర్మానాలు కూడా చేస్తున్నాయి. అయితే మెజారిటీ న్యాయవర్గాల్లో మాత్రం జగన్ రాసిన లేఖపై భారత ప్రధాన న్యాయమూర్తి విచారణ జరపాల్సిందేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇందుకు వారు పలు కారణాలు కూడా చెబుతున్నారు. గతంలో ఇలాంటి సందర్భాలు వచ్చినప్పుడు జరిగిన విచారణలను సైతం గుర్తుచేస్తున్నారు.
ఛీఫ్ జస్టిస్కు జగన్ లేఖ కలకలం..
సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ ఎన్వీరమణతో పాటు ఏపీ హైకోర్టులోని కొందరు న్యాయమూర్తులపై భారత ప్రధాన న్యాయమూర్తికి ఫిర్యాదు చేస్తూ సీఎం జగన్ రాసిన లేఖపై దేశవ్యాప్తంగా దుమారం కొనసాగుతూనే ఉంది. దీనిపై న్యాయవర్గాల్లోనే భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
కొందరు జగన్ ఫిర్యాదు లేఖ వరకూ సమజంజమే అయినా దాన్ని బయటపెట్టడం సరికాదని చెప్తుండగా.. మరికొందరు మాత్రం ప్రజా ప్రభుత్వంపై బురదజల్లేందుకు జరుగుతున్న ప్రయత్నం కాబట్టి దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడమే కరెక్టనే వాదన కూడా వినిపిస్తున్నారు. ఇలాంటి నేపథ్యంలో జగన్ లేఖపై అసలు విచారణ లేకుండానే ఖండనలు ఎందుకంటూ సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు దుష్యంత్ దవే లాంటి వారు కూడా వ్యాఖ్యానించారు.
జగన్ లేఖపై విచారణ తప్పనిసరి ?
సుప్రీంకోర్టు ఛీఫ్ జస్టిస్ బాబ్డేకు సీఎం జగన్ రాసిన లేఖపై విచారణ జరపాల్సిందే అన్న వాదన ఇప్పుడు మెజారిటీ న్యాయవర్గాల్లో వినిపిస్తోంది. సుప్రీంకోర్టుకు కాబోయే ఛీఫ్ జస్టస్తో ముడిపడి ఉన్న ఈ వ్యవహారంలో విచారణ జరిగితే తప్ప వాస్తవాలు వెలుగులోకి రావని సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ పెద్దలే అభిప్రాయపడుతున్నారు.
దీంతో ఈ వాదనకు మద్దతు కూడా పెరుగుతోంది. జస్టిస్ ఎన్వీ రమణ వ్యవహారశైలిపై జగన్ చేసిన ఫిర్యాదులో చాలా అంశాలపై ఏపీ బయట ఉన్న వారికి అసలు అవగాహనే లేదు. ఇందులో వాస్తవాలు తెలియకుండా వాటిని ఎలా నిర్ధారిస్తామంటూ దుష్యంత్ దవే లాంటి వారు చెప్తున్నారు. దీంతో ఎలాగో సుప్రీం ఛీఫ్ జస్టిస్కు లేఖ రాశారు కాబట్టి అక్కడే విచారణ జరిగితే బావుటుందనే వాదన పెరుగుతోంది.
జగన్ లేఖపై విచారణకు కారణాలివే..
సుప్రీం ఛీఫ్ జస్టిస్కు జగన్ రాసిన లేఖపై విచారణ తప్పనిసరి అని అభిప్రాయపడుతున్న న్యాయ కోవిదులు ఇందుకు ఐదు స్పష్టమైన కారణాలను చెబుతున్నారు. ఇందులో మొదటిది సుప్రీంకోర్టుకు ఉన్న విశిష్టత. ఇక్కడ జస్టిస్ రమణ కానీ, ఆయనపై ఫిర్యాదు చేసిన సీఎం జగన్ కానీ శాశ్వతం కాదు. కానీ దేశంలోనే ప్రతిష్టాత్మకమైన సుప్రీంకోర్టుకు ఉన్న గౌరవ ప్రతిష్టలు ముఖ్యం.
అలాగే రెండో కారణం చూస్తే న్యాయవ్యవస్ధకు ఇతర వ్యవస్దల కంటే మెరుగైన ట్రాక్ రికార్డు ఉంది. ఎఫ్ఐఆర్ నమోదు నుంచి తుది తీర్పు ఇచ్చే వరకూ న్యాయవ్యవస్ధకు పారదర్శకంగా వ్యవహరిస్తుందనే పేరుంది. ఇప్పుడు జగన్ రాసిన లేఖలోనూ ఆయన నిర్దిష్టంగా ఎలాంటి చర్యలు కోరలేదు. న్యాయవ్యవస్ద నిష్పాక్షికంగా వ్యవహరించేలా చూడామని మాత్రమే కోరారు. కాబట్టి విచారణ చేసి తదనుగుణంగా చర్యలు తీసుకోవచ్చు.
జగన్ దాడి వారిపైనే.. న్యాయవ్యవస్ధపై కాదు...
జగన్ లేఖపై విచారణ జరగాలని కోరుకోవడానికి న్యాయనిపుణులు చూపుతున్న మూడో కారణం జగన్ తన లేఖ ద్వారా న్యాయవ్యవస్దపై దాడి చేస్తున్నారని చెప్పడానికి వీల్లేదు. ఎందుకంటే ఆయన నిర్దిష్టంగా బాధ్యులైన న్యాయమూర్తుల పేర్లనే అందులో ప్రస్తావించారు తప్ప అందరినీ ఒక గాటన కట్టలేదు. అలాగే 2015లో న్యాయమూర్తులపై వచ్చే పిర్యాదులను విచారించడానికి సుప్రీంకోర్టు ఏర్పాట్లు చేసింది. ఆ తర్వాత ముగ్గురు సభ్యుల కమిటీ ఏర్పాటు చేసి వాటిపై విచారణ జరపాల్సి ఉంటుంది. ఒకవేళ కమిటీ సదరు ఫిర్యాదు విచారణార్హం కాదని తేలితే తిరస్కరించవచ్చు. ఆరోపణలు నిజమని భావిస్తే విచారణ జరిపి చర్యల కోసం పార్లమెంటుకు సదరు న్యాయమూర్తిని అభిశంసన చేయాలని సిఫార్సు చేయొచ్చు.
అలాగే జగన్ ప్రస్తుతం సీఎంగా రాజ్యాంగ పదవిలో ఉండి ఫిర్యాదు చేశారు. ఆయనపై తీవ్ర ఆర్ధిక నేరాలపై సీబీఐ కేసులునప్పటికీ వాటి కంటే వ్యక్తిగతంగా ఆయన ఇచ్చిన ఫిర్యాదును ఛీఫ్ జస్టిస్ పరిగణలోకి తీసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇతర వ్యవస్ధల నిష్పాక్షికతపై వచ్చే ఫిర్యాదులపై రోజూ విచారణ జరిపే సుప్రీంకోర్టు.. జగన్ లేఖ విషయంలోనూ విచారణ నిర్వహించడం ద్వారా తన నిష్పాక్షికతను నిరూపించుకునేందుకు వీలు కలుగుతుందని న్యాయనిపుణలు చెబుతున్నారు.