కెసిఆర్ను పిలిచినట్లు జగన్ను చంద్రబాబు పిలువొచ్చు కదా: ఉమ్మారెడ్డి
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావును స్వయంగా వెళ్లి ఆహ్వానిస్తున్న ముఖ్యమంత్రి తమ నేత వైయస్ జగన్మోహన్ రెడ్డిని ఎందుకు అలా ఆహ్వానించడం లేదని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకుడు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ప్రశ్నించారు. జగన్ను కూడా అపాయింట్మెంట్ కోరి ఆహ్వానించవచ్చుకదా ఆయన అన్నారు.
ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు శనివారం మీడియాతో మాట్లాడారు. రాజకీయ పార్టీగా తమ ప్రాధాన్యాలు తమకు ఉంటాయని అన్నారు. ఆహ్వానాన్ని గౌరవించి వెళితే ప్రధాని పక్కన జగన్ను కూర్చోబెడతారా అని ఆయన ప్రశ్నించారు. ఆరోగ్యం బాగాలేకనే జగన్ మంత్రులను కలుసుకోలేదని ఆయన స్పష్టం చేశారు.
ఈ నెల 22వ తేదీన అమరావతి శంకుస్థాపనకు వస్తున్న ప్రధాని మోడీ తమకు అదే రోజు గన్నవరం లేదా తిరుపతిలో కలిసేందుకు అవకాశం ఇవ్వాలని, అలా ఇస్తే ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలతో జగన్ ప్రధానిని కలుస్తారని ఆయన చెప్పారు.
కాగా, జగన్ తీరుపై తెలుగుదేశం పార్టీ నాయకులు తీవ్రంగా మండిపడ్డారు. జగన్ విచిత్రంగా వ్యవహరిస్తున్నారని తెలుగుదేశం పార్టీ నయాకుడు దూళిపాళ్ల నరేంద్ర చౌదరి వ్యాఖ్యానించారు. పవిత్రమైన అమరావతిపై అభాండాలు వేయడం జగన్కు తగదని ఆయన అన్నారు.
రాష్ట్రాన్ని గాడిలో పెట్టాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేస్తున్న కృషికి మద్దతు ఇవ్వకపోగా విషం చిమ్ముతున్నారని ఆయన విమర్శించారు. శంకుస్థాపనకు రానని చెప్పిన జగన్ లేఖ చూసి అంతా నవ్వుకున్నారని ఆయన అన్నారు.
అమరావతి శంకుస్థాపనకు రానని చెప్పడం జగన్ మూర్ఖత్వానికి నిదర్శమని మరో తెలుగుదేశం పార్టీ నేత జూపూడి ప్రభాకర రావు అన్నారు. ప్రతి అభివృద్ధికి జగన్ అడ్డుపడితే ఎలా అని ఆయన అడిగారు. ప్రజల భద్రత కోసమే అమరావతి ప్రాంతంలో 144వ సెక్షన్ విధించినట్లు ఆయన తెలిపారు.