టీటీడీపై కొడాలి నానీ వ్యాఖ్యలపై సీఎం జగన్ ఎందుకు స్పందించటం లేదు: దేవినేని ఉమా ఫైర్
టిడిపి మాజీ మంత్రి దేవినేని ఉమా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ పైన నిప్పులు చెరిగారు. నోటికొచ్చినట్టు కొడాలి నాని తిరుమల తిరుపతి దేవస్థానంపై వివాదాస్పదవ్యాఖ్యలు చేసినా దీనిపై ఇప్పటివరకు సీఎం జగన్మోహన్ రెడ్డి ఎందుకు స్పందించలేదని దేవినేని ఉమా ప్రశ్నించారు. మత విశ్వాసాలను కించపరుస్తున్నారని మండిపడ్డారు దేవినేని ఉమ. గట్టిగా ప్రశ్నిస్తే అయ్యప్ప మాల ధారులతోటి తిట్టిస్తున్నారని దేవినేని ఉమా ఆవేదన వ్యక్తం చేశారు.
తిరుమలలో అన్యమత ప్రచారం జరుగుతున్నా సీఎం జగన్మోహన్ రెడ్డి పట్టించుకోవడం లేదన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానంపై నాని చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై మండిపడిన దేవినేని ఉమా జగన్మోహన్ రెడ్డి ఇంతా జరుగుతున్నా ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. అంతేకాదు హిందువులను, క్రైస్తవులుగా మార్చటం పెరిగిపోతోందని, అన్యమత ప్రచారం విపరీతంగా జరుగుతుందని దేవినేని ఉమా ఆరోపణలు గుప్పించారు.
ఇంతవరకు రాష్ట్రంలో ఇసుక కొరత తీరలేదని, ఇసుక మాఫియాలో 68 మంది వైసీపీ నేతల ప్రమేయం ఉందన్నారు. ఆ నేతలపై సీఎం జగన్ ఎలాంటి చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు. ఇసుక మాఫియాపై ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు.రాష్ట్రంలో సిమెంట్ కంపెనీలతో రూ. 2500 కోట్ల డీల్ కుదుర్చుకున్నారని ఇప్పటికే వెయ్యి కోట్ల ముడుపులు తీసుకున్నారని దేవినేని ఉమ ఆరోపించారు. దీనిపై తాము ప్రశ్నిస్తే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు మాటల దాడి చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు.
రాష్ట్రంలో నూతన ఎక్సైజ్ పాలసీ నేపధ్యంలో మద్యం ఏరులైపారుతోందని,విచ్చలవిడిగా బెల్ట్ షాపులు పెరిగిపోయాయని దేవినేని ఉమ అన్నారు.రాష్ట్రాన్ని దివాలా తీయించడానికి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కంకణం కట్టుకుందని దేవినేని ఉమా ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిశ్రమలను రాష్ట్రం నుంచి వెళ్లగొట్టారని పేర్కొన్న ఉమా మంత్రులు ఏ మాత్రం సోయి లేకుండా మాట్లాడుతున్నారన్నారు.పోలవరం ప్రాజెక్టును గాలికి వదిలేసిన నాయకులు టిడిపి నేతలు గురించి మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. సీఎం జగన్ తీవ్ర ఆందోళనలో ఉన్నారన్నారు. అందుకే టీడీపీ నేతలప ఎదురుదాడి చేస్తున్నారన్నారు దేవినేని ఉమా. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఏం చేసినా భయపడేది లేదని ఆయన తేల్చి చెప్పారు.