సస్పెన్స్:ఆ 4గురు ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేశారా? గోప్యత ఎందుకు?
మంత్రివర్గంలో చోటు దక్కించుకొన్న వైసీపీ ఎమ్మెల్యేలు తమ ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసినట్టు వచ్చిన లీకు వార్తలపై ఇంకా అధికారిక వివరణ రాలేదు. దీంతో ఇంకా గందరగోళ పరిస్థితులు కొనసాగుతున్నాయి.
అమరావతి:మంత్రివర్గంలో చోటు దక్కించుకొన్న వైసీపీ ఎమ్మెల్యేలు తమ ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసినట్టు వచ్చిన లీకు వార్తలపై ఇంకా అధికారిక వివరణ రాలేదు. దీంతో ఇంకా గందరగోళ పరిస్థితులు కొనసాగుతున్నాయి.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఏప్రిల్ రెండవతేదిన క్యాబినెట్ ను పునర్వవ్యవస్థీకరించారు.అయితే క్యాబినెట్ లో పునర్వవ్యవస్థీకరణలో నలుగురు వైసీపీ నుండి టిడిపిలో చేరిన ఎమ్మెల్యేలకు చోటు కల్పించారు.
మంత్రులుగా ప్రమాణం చేసిన తర్వాత ఎమ్మెల్యేలుగా వారంతా ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసినట్టుగా లీకు వార్తలు వచ్చాయి.అయితే ఈ విషయమై ఇంకా అధికారికంగా ప్రకటన రాలేదు.
ఎమ్మెల్యే పదవులకు రాజీనామా లేఖలు అందాయా, లేదా అనే విషయమై కూడ స్పీకర్ కార్యాలయం ఇంకా ప్రకటించలేదు. ఈ విషయమై ఇంకా గందరగోళ పరిస్థితులు కన్పిస్తున్నాయి.
ముందు నుయ్యి వెనుక గొయ్యి చందంగా రాజీనామాల వ్యవహరం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో వైసీపీ నుండి సుమారు 21 మంది ఎమ్మెల్యేలు టిడిపిలో చేరారు.అయితే టిడిపిలో చేరిన 21 మంది ఎమ్మెల్యేలలో నలుగురికి చంద్రబాబునాయుడు తన మంత్రివర్గంలో చోటు కల్పించారు.అయితే వైసీపీ నుండి విజయం సాధించిన ఎమ్మెల్యేలకు మంత్రివర్గంలో చోటు కల్పించడం పట్ల టిడిపిపై వైసీపీ దుమ్మెత్తిపోసింది. ఈ అంశాన్ని టిడిపిపై జాతీయస్థాయిలో ప్రచారం చేసింది.ఈ పరిణామాల నేపథ్యంలో మంత్రివర్గంలో చోటు దక్కించుకొన్న నలుగురు ఎమ్మెల్యేలు స్పీకర్ కార్యాలయానికి రాజీనామా లేఖలను పంపారని లీక్ వార్తలు వచ్చాయి. అయితే ఈ రాజీనామాల విషయమై అధికారికంగా ఇంకా ప్రకటన రాలేదు. రాజీనామాలు వచ్చాయా, రాలేదా అనే విషయమై స్పష్టత లేదు. అయితే ఈ విషయమై ఏం చెబితే ఏ రకమైన పరిణామాలు చోటుచేసుకొంటాయనే భయం అధికారుల్లో నెలకొంది.
ఎమ్మేల్యే పదవికి తలసాని రాజీనామా
తెలంగాణలో సనత్ నగర్ అసెంబ్లీ స్థానం నుండి టిడిపి అభ్యర్థిగా పోటీచేసి విజయం సాధించిన తలసాని శ్రీనివాస్ యాదవ్ ను కెసిఆర్ తన మంత్రివర్గంలోకి తీసుకొన్నారు. అయితే మంత్రిపదవిని చేపట్టేముందు తలసాని శ్రీనివాస్ యాదవ్ మీడియాను పిలిచి తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు.రాజీనామా లేఖను స్పీకర్ కార్యాలయానికి పంపుతున్నట్టు చెప్పారు.అయితే స్పీకర్ కార్యాలయం కూడ ఈ లేఖ అందిందని ప్రకటించింది.ఈ విషయం ఇంకా స్పీకర్ పరిశీలనలో ఉంది.
ఎపిలో ఎమ్మెల్యేల రాజీనామాల విషయంలో గోప్యత
అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణలో పాటించిన సంప్రదాయాలనే కొనసాగిస్తున్నారా లేదా అనేది చర్చనీయాంశంగా మారింది.వైసీపీ నుండి టిడిపిలో చేరిన భూమా అఖిలప్రియ, సుజయ కృష్ణ రంగారావు, ఆదినారాయణరెడ్డి,అమర్ నాథ్ రెడ్డి మంత్రివర్గంలో చేరారు.అయితే వారు తమ ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసినట్టుగా లీక్ వార్తలు వచ్చాయి.అయితే ఈ విషయమై రహస్యంగానే ఉంచడం విస్మయం కల్గిస్తోందని రాజకీయ విమర్శలు అభిప్రాయపడుతున్నారు.
స్పష్టత ఇవ్వని స్పీకర్ కార్యాలయం
నలుగురు మంత్రులు తమ ఎమ్మెల్యే పదవులకు రాజీనామాలు చేసినట్టు వచ్చిన వార్తల విషయమై స్పష్టత రాలేదు. అయితే ఈ విషయమై కార్యాలయానికి ఏవో వచ్చాయన్నారు. కాని , ఏమో వచ్చాయో తాను చూడలేదని స్పీకర్ ప్రకటించారు.అయితే అలాంటి లేఖలు ఏవీ రాలేదని అసెంబ్లీ కార్యదర్శి ప్రకటించారు.అసెంబ్లీ సెక్రటరీ వద్ద స్పీకర్ మాటలను ప్రస్తావిస్తే స్పీకర్ చెప్పిందే ఫైనల్ అంటూ సమాధానమివ్వడం గమనార్హం.