మాది అమ్ముడుపోయే జాతా? గాలి మీవైపే ఉంటే.. ముందస్తుకు వెళ్లండి: చంద్రబాబుపై ముద్రగడ ఫైర్
ముఖ్యమంత్రి చంద్రబాబు దిగజారిన మాటలు మాట్లాడుతున్నారని కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం మండిపడ్డారు. ప్రత్యేక హోదా ఎలాంటి హామీనో.. కాపులను బీసీల్లో చేర్చడం కూడా అలాంటి వాగ్దానమేనని అన్నారు.
అమరావతి: ప్రత్యేక హోదా ఎలాంటి హామీనో.. కాపులను బీసీల్లో చేర్చడం కూడా అలాంటి వాగ్దానమేనని కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు.
కాపులకు రిజర్వేషన్ కల్పిస్తామని సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీని నెరవేర్చాలని కోరారు. తమ ఉద్యమాన్ని మూసేయాలని సీఎం చెప్పిస్తున్నారంటూ.. మాది అమ్ముడుపోయే జాతా? అణాకు ఆరుగురు కాపులు అమ్ముడుపోతున్నారా? అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు దిగజారిన మాటలు మాట్లాడుతున్నారని ముద్రగడ మండిపడ్డారు.
'2004 నుంచి 2014 వరకు దాదాపు 40 ఉప ఎన్నికలు జరిగితే ఏ ఎన్నికల్లోనూ టీడీపీ గెలువలేదు. చాలాచోట్ల డిపాజిట్లు కూడా రాలేదు. అంతమాత్రాన టీడీపీని మూసేశారా' అని ఆయన ప్రశ్నించారు.
ఇప్పుడు కూడా అక్రమ పద్ధతుల్లో టీడీపీ గెలిచిందని ముద్రగడ విమర్శించారు. గాలి టీడీపీ వైపే ఉందని ముఖ్యమంత్రి అంటున్నారు.. మరి వాతావరణం మీకు అనుకూలంగా ఉందని భావిస్తే.. ముందస్తు ఎన్నికలకు సిద్ధపడండి.. అని ఆయన సూచించారు.
తెలంగాణ ఉద్యమంలో టీఆర్ఎస్ శాసనసభ్యులు, ఎంపీలు రాజీనామా చేశారని, రాజీనామాలు చేశాక తిరిగి అన్నిచోట్లా గెలుపొందలేదని, అయినా ఇచ్చిన హామీ ప్రకారం సోనియాగాంధీ తెలంగాణ రాష్ట్రం ఇచ్చారని పేర్కొన్నారు. టీడీపీలో ఉన్న కాపు మంత్రులు, నేతలు కూడా వెంటనే రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
ఉద్యమ కాలంలో వూహాత్మక మౌనం పాటిస్తే.. ముద్రగడను కోనేశామని విషప్రచారం చేస్తున్నారని, హామీలను నెరవేర్చాలని రోడ్డెక్కితే ముద్రగడ అమ్ముడుపోయాడని అంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 2050 వరకు ముఖ్యమంత్రిగా ఉండాలని చంద్రబాబు, ఆయన కొడుకు తహతహలాడుతున్నారని ముద్రగడ వ్యాఖ్యానించారు.