జగన్ను పిలిచి మోదీ చీవాట్లు పెట్టారు.. ఎందుకంటే.. యనమల ఆసక్తికర వ్యాఖ్యలు..
ఆంధ్రప్రదేశ్లో చోటు చేసుకుంటున్న పరిణామాలు దేశ ఆర్థిక ప్రయోజనాలపై కూడా ప్రభావం చూపిస్తున్నాయని.. అందుకే ప్రధాని మోదీ ముఖ్యమంత్రి జగన్ను పిలిచి చీవాట్లు పెట్టారని మాజీ మంత్రి,టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు అన్నారు. ఇది తమకున్న సమాచారం అని చెప్పారు. మూడు రాజధానుల ప్రకటనపై దావోస్లో పారిశ్రామికవేత్తలు ఆందోళన వ్యక్తం చేశారని.. దాని పర్యవసానమే జగన్కు మోదీ పిలుపు అన్నారు.
వ్యక్తిగత విషయాల కోసమే మోదీతో భేటీ..
జగన్ వ్యక్తిగత విషయాల కోసమే మోదీతో భేటీ అవుతున్నారు తప్ప మరొకటి కాదన్నారు యనమల. పలు అంశాలకు సంబంధించి మోదీకి వినతిపత్రం ఇచ్చామని చెబుతున్నారని.. అలాంటప్పుడు దాన్ని ఎందుకు బయటపెట్టట్లేదని ప్రశ్నించారు. అమెరికా అధ్యక్షుడు,ఉక్రెయిన్ అధ్యక్షుడితో మాట్లాడిన ఫోన్ సంభాషణలనే పబ్లిక్ డొమైన్లో పెట్టారని.. అలాంటప్పుడు మోదీతో మాట్లాడిన విషయాలను జగన్ ఎందుకు గోప్యంగా ఉంచుతున్నారని ప్రశ్నించారు.
ఏడుసార్లు వెళ్తే ఏడు రూపాయలు కూడా రాలేదు..
ఇప్పటివరకు జగన్ ఏడుసార్లు ఢిల్లీకి వెళ్లి మోదీని కలిశారని.. కానీ దానివల్ల ఏడు రూపాయల లాభం కూడా ఏపీకి జరగలేదని ఎద్దేవా చేశారు. కనీసం జగన్ స్పెషల్ ఫ్లైట్ ఖర్చులు కూడా రాలేదని విమర్శించారు. కేసులు గురించి మాట్లాడేందుకే ఢిల్లీ వెళ్తున్నారా అని నిలదీశారు. సీఎం ఎన్నిసార్లు ఢిల్లీ వెళ్లినా ఒక్క పైసా కూడా వచ్చే పరిస్థితి కనిపించడం లేదన్నారు. వైసీపీ అప్రజాస్వామిక విధానాలతో రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలోకి వెళ్లిందని ఆరోపించారు.
బిల్లులపై యనమల..
అసెంబ్లీ నుంచి వచ్చిన బిల్లులను తాము అడ్డుకోలేదని యనమల అన్నారు. అసలు బిల్లులను అసెంబ్లీలో పాస్ చేసిన విధానమే సరిగా లేదన్నారు. అభివృద్ది వికేంద్రీకరణ బిల్లు,సీఆర్డీఏ చట్టం రద్దు బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపితే ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. కమిటీ కోరితే.. సెలెక్ట్ కమిటీకి ఛైర్మన్ పదవిని ప్రజలకు మంచి చేసే బిల్లులు తీసుకొస్తే మండలిలో ఎందుకు అడ్డుకుంటామని నిలదీశారు.
మోదీతో జగన్ భేటీ..
ప్రధాని నరేంద్ర మోదీతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బుధవారం ఢిల్లీలో భేటీ అయిన సంగతి తెలిసిందే. ప్రధాని నివాసంలో జరిగిన ఈ భేటీలో ఇద్దరు దాదాపు గంటన్నరకు పైగా ముచ్చటించారు.
ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై ప్రధానికి జగన్ నివేదించారు. ఈ మేరకు పలు అంశాలతో కూడి వినతిపత్రాన్ని మోదీకి అందజేశారు. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా, ప్రాజెక్టులకు నిధులు, విభజన హామీలు వంటి అంశాలను ప్రధాని మోదీ దృష్టికి తీసుకెళ్లారు. అయితే మోదీకి జగన్ ఇచ్చిన వినతిపత్రాన్ని బయటపెట్టాలని టీడీపీ డిమాండ్ చేస్తోంది.