అప్పుడు బాబు కనీసం మాట్లాడలేదు: చదలవాడ ఆవేదన, జనసేన సేఫ్, పవన్ పచ్చజెండా!
Recommended Video
చిత్తూరు: తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి జనసేనలోకి వెళ్లేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారని తెలుస్తోంది. వచ్చే నెల దసరా రోజున ఆయన అధికారికంగా జనసేనలో చేరనున్నారని చెబుతున్నారు. ఆయన పార్టీ వీడటానికి పలు కారణాలు చూపిస్తున్నారు.
తెలుగుదేశం పార్టీలో తనకు సరైన గుర్తింపు లేకపోవడంతో ఆయన పవన్ కళ్యాణ్ వైపు వెళ్లాలని నిర్ణయించుకున్నారని తెలుస్తోంది. ఇటీవల బ్రహోత్సవాల సందర్భంగా శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన సమయంలో సీఎం చంద్రబాబు నాయుడు ఆయనకు సరైన గౌరవం ఇవ్వలేదని, ఇది ఆయనను తీవ్ర ఆవేదనకు గురి చేసిందని తెలుస్తోంది. కనీసం తనతో మాట్లాడలేదని వాపోతున్నారట.
2019లోను టిక్కెట్ లేదు
చదలవాడ కృష్ణమూర్తి బలిజ సామాజిక వర్గానికి చెందిన నేత. తిరుపతి నుంచి పోటీ చేయాలని భావించారు. కానీ అధిష్టానం ఆయనకు టిక్కెట్ నిరాకరించింది. దానికి బదులు టీటీడీ చైర్మన్ పదవి ఇస్తామని చెప్పారు. 2019లోను టిక్కెట్ ఇచ్చే అవకాశాలు లేవని అధిష్టానం ఆయనకు తేల్చి చెప్పినట్లుగా ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలోనే ఆయన వైసీపీ వైపు చూశారు. కానీ అక్కడ భూమన కరుణాకర్ రెడ్డి ఉండటంతో వెనక్కి తగ్గారు. ఇప్పుడు జనసేన రంగంలోకి దిగుతుండటంతో ఆయన ఈ పార్టీ నుంచి పోటీ చేసేందుకు చేరుతున్నారని తెలుస్తోంది.
రంగంలోకి జగన్, ఇదీ విషయం!: మాజీ మంత్రికి షాకిచ్చిన వంగవీటి రాధా
ఈ లెక్కలతో జనసేన సేఫ్
2009లో తిరుపతిలో చిరంజీవి గెలిచారు. సామాజిక వర్గం లెక్కలు తీసినా, మెగా అభిమానుల పరంగా చూసినా జనసేన సేఫ్ అని చదలవాడ భావించారని అంటున్నారు. అలాగే, జనసేనకు కూడా ఆయన చేరిక కలిసి వస్తుంది.
అందుకే పవన్ కళ్యాణ్ కూడా ఓకే చెప్పారట
గురువారం పవన్ కళ్యాణ్తో హైదరాబాదులోని పార్టీ కార్యాలయంలో భేటీ అయిన చదలవాడ.. సుదీర్ఘంగా చర్చించారని తెలుస్తోంది. తిరుపతి నియోజకవర్గంలో ఆయన వర్గం ఓట్లు ఎక్కువగా ఉండటం సహా వివిధ కారణాలతో పవన్ కళ్యాణ్ కూడా ఆయనకు ఓకే చెప్పారట.
క్లుప్తంగా చదలవాడ రాజకీయ ప్రస్థానం
చదలవాడ 1973లో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆ తర్వాత జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా పని చేశారు. 1981లో నాయుడుపేట సర్పంచ్గా గెలిచారు. రెండేళ్ల తర్వాత ఉత్తమ సర్పంచ్ అవార్డు అందుకున్నారు. 1994లో ఆయన తిరుపతి నుంచి బరిలో నిలుస్తానంటే కాంగ్రెస్ శ్రీకాళహస్తి టిక్కెట్ ఇచ్చింది. అప్పుడు ఓడిపోయారు. 1999లో కాంగ్రెస్ టిక్కెట్ నిరాకరించడంతో టీడీపీలో చేరారు. ఎమ్మెల్యేగా గెలిచారు. అలిపిరి ఘటనలో చంద్రబాబు సహా ఇతను కూడా గాయపడ్డారు. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చాక టీటీడీ చైర్మన్గా నియమించారు.