నేనోడిపోతానా.. ఆ సర్వే చిచ్చు: గంటా మనస్తాపం, కేబినెట్ భేటీకి డుమ్మా, బాబు పర్యటనపై డైలమా
అమరావతి: మంత్రి గంటా శ్రీనివాస రావు పార్టీ అధిష్టానంపై అసంతృప్తితో ఉన్నారని తెలుస్తోంది. ఆయన మనస్తాపానికి గురి కావడం వల్లే మంగళవారం జరిగిన మంత్రి వర్గ సమావేశానికి రాలేదని అంటున్నారు. కేబినెట్ భేటీ ఉందని తెలిసి, ఆయన విశాఖపట్నంలోనే ఉన్నారు. ఈ విషయం తెలుసుకున్న కొందరు ఆయనను ఫోన్ ద్వారా సంప్రదించే ప్రయత్నాలు చేశారు.
Recommended Video
చదవండి: చంద్రబాబుపై మా పార్టీ ఎంపీది తప్పు, వారివల్లే గెలిచాం: స్వరంమార్చిన విష్ణు, సంచలన వ్యాఖ్యలు
తోటి మంత్రులు, కొందరు నాయకులు ఫోన్ చేసినప్పటికీ ఆయన అందుబాటులోకి రాలేదని తెలుస్తోంది. పార్టీలో జరుగుతున్న పరిణామాలపై ఆయన అసంతృప్తితో ఉన్నారని తెలుస్తోంది. గత ఒకటి రెండు సంవత్సరాలుగా తనకు వ్యతిరేకంగా పార్టీలో పరిణామాలు చోటు చేసుకుంటున్నాయని ఆయన భావిస్తున్నారు. ఈ విషయాలను ఎప్పటికప్పుడు అధిష్టానం దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకపోయిందట.
సర్వేల్లో ఓడిపోతారని చెప్పడంపై కినుక
ఇటీవల సర్వేలు చేస్తున్నారు. తన నియోజకవర్గం భీమిలిలో చేసిన సర్వే తనను అప్రతిష్టపాలు చేసేలా, తన నియోజకవర్గంలోనే తనకు వ్యతిరేకత పెంచేలా ఉందని గంటా శ్రీనివాస రావు భావిస్తున్నారని తెలుస్తోంది. భీమిలిలో ఓడిపోవడం ఖాయమని వార్తలు రావడంపై ఆయన కినుక వహించారని తెలుస్తోంది. పార్టీ అధిష్టానం తీరు, పార్టీలోని పరిణామాలకు తోడు.. కుంభకోణాల ఆరోపణల పట్ల ఆయన తీవ్ర మనస్తాపంతో ఉన్నారని తెలుస్తోంది.
వారి వెనుక పార్టీలోని కొందరు, అధిష్టానానికి ఫిర్యాదు చేసినా
గవర్నమెంట్ భూములను బ్యాంకులో పెట్టి రుణం తీసుకున్నట్లు, విశాఖలో భూకుంభకోణం.. ఇలా తనపై ఆరోపణలు రావడం, హైకోర్టులో పిల్ వేయడం.. వంటి పరిణామాలు ఆయన మనస్తాపానికి కారణమయ్యాయని అంటున్నారు. ఎందుకంటే వీటన్నింటి వెనుక కొందరు పార్టీలోని వారి పాత్ర ఉందని ఆయన భావిస్తున్నారని సమాచారం. ఆధారాలతో అధిష్టానానికి ఫిర్యాదు చేసినా ఫలితం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారట.
దానిని ఎందుకు బయటపెట్టడం లేదు?
అంతేకాదు, విశాఖ భూకుంభకోణంపై ప్రభుత్వం వేసిన సిట్ నివేదిక.. తనకు పాత్ర లేదని తేల్చిందని, అయినా దానిని ఎందుకు బయటకు చెప్పడం లేదని గంటా అంటున్నారట. తన పాత్ర లేదని తేలినా బహిర్గతం చేయకపోవడం ఏమిటని ఆయన అనుమానాలు వ్యక్తం చేస్తున్నారని సమాచారం. తనను ఇబ్బంది పెట్టడానికి ఇలా జరుగుతుందేమోనని భావిస్తున్నారట.
బాబు విశాఖ పర్యటన, గంటా డైలమా
పార్టీ తీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్న మంత్రి గంటా ఇప్పటికే కేబినెట్ భేటీకి హాజరు కాలేదు. గురువారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విశాఖపట్నంలో పర్యటిస్తున్నారు. వీటికి హాజరు కావడంపై ఆయన తర్జన భర్జన పడుతున్నారని తెలుస్తోంది. బాబు వస్తే హాజరు కాకుంటే అది తీవ్ర నిర్ణయమే అవుతుంది. ఈ రోజు ఆయన ఓ నిర్ణయానికి వచ్చే అవకాశముందని అంటున్నారు. అయితే, జ్వరం కారణంగా ఆయన రాలేదని మరో వాదనగా ఉంది.