'ప్రభుత్వ చేతగానితనం.. జగన్ అంటే ఉలికిపాటెందుకు?..'
జగన్ అమరావతి వెళ్తున్నారంటే చాలు ప్రభుత్వమెందుకు ఉలిక్కిపడుతోందని పార్థసారథి ప్రశ్నించారు.
హైదరాబాద్: అమరావతి నిర్మాణం విషయంలో రైతులకు అన్యాయం చేశారని తొలినుంచి ఆరోపిస్తోన్న వైసీపీ విమర్శలకు పదును పెడుతోంది. వైసీపీ అధికారి ప్రతినిధి కె.పార్థసారథి తాజాగా దీనిపై స్పందించారు. బుధవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.
జగన్ అమరావతి వెళ్తున్నారంటే చాలు ప్రభుత్వమెందుకు ఉలిక్కిపడుతోందని పార్థసారథి ప్రశ్నించారు. రైతులకు అండగా నిలబడేందుకే జగన్ రాజధాని గ్రామాల్లో పర్యటిస్తున్నారని అన్నారు.
అమరావతి నిర్మాణంలో టీడీపీ నేతల తీరు గుమ్మడికాయల దొంగల్లా ఉందని.. టీడీపీ నేతలంతా భుజాలు తడుముకుంటున్నారని ఎద్దేవా చేశారు. ప్రభుత్వ చేతగాని తనాన్ని కప్పిపుచ్చుకోవడానికే జగన్ మీద లేని పోని ఆరోపణలు చేస్తున్నారని అన్నారు.
ల్యాండ్ పూలింగ్ పేరిట రైతుల నుంచి 33వేల ఎకరాలు తీసుకున్న ప్రభుత్వం.. వారికి ఇచ్చిన హామిలను మాత్రం ఎందుకు అమలు చేయడం లేదని నిలదీశారు. ల్యాండ్ పూలింగ్ ను వ్యతిరేకించిన రైతులపై భూసేకరణ చట్టం ప్రయోగించడం వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. రాజధాని ప్రాంత రైతులకు న్యాయం జరిగేవరకు పోరాడతామని తెలిపారు.