వైఎస్ జగన్ మంత్రివర్గం ఎందుకు, విశాఖపై విజయసాయిరెడ్డి కామెంట్లపై సీపీఐ రామకృష్ణ
ఏపీ మంత్రులపై సీపీఐ రామకృష్ణ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. విశాఖపట్టణం గురించి ఎంపీ విజయసాయిరెడ్డి మాట్లాడుతుంటే మంత్రివర్గం ఎందుకు, మంత్రులు ఎందుకు అని ప్రశ్నించారు. దీంతో సీఎం జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని మంత్రివర్గం సిగ్గుతో తలదించుకోవాలని హాట్ కామెంట్స్ చేశారు.
అమరావతి రాజధాని మార్చాలనే నిర్ణయం తీసుకుంటే సీఎం జగన్ ప్రభుత్వం పతనం ప్రారంభైనట్టేనని సీపీఐ రామకృష్ణ విమర్శించారు. అమరావతి రాజధానిగా అన్నీ ప్రాంతాలకు అనువుగా ఉంటుందని గుర్తుచేశారు. 29 గ్రామాల రైతులు ఉద్యమిస్తున్నా అడ్డుకోవడం సరికాదన్నారు. జగన్ ప్రభుత్వం తీరు మార్చుకోవాలని సూచించారు. లేదంటే ప్రజాగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు.
విశాఖపట్టణంపై ప్రభుత్వం ప్రకటన చేయాలి.. సీఎం, లేదంటే మంత్రులు మాట్లాడతారు. కానీ రాష్ట్రంలో పరిస్థితి రివర్స్గా ఉంది. ఎంపీ విజయసాయిరెడ్డి మాట్లాడుతుంటే.. మంత్రులు సిగ్గుతో తలదించుకుంటున్నారు అని మండిపడ్డారు. జగన్ మంత్రివర్గంలో మాట్లాడే మొనగాడే లేడా అని ప్రశ్నించారు. హైకోర్టును మూడు ప్రాంతాల్లో ఏర్పాటు చేయడంతో రాయలసీమకు మేలు జరుగుతోందా అని ఆయన ప్రశ్నించారు. వెనకబడిన రాయలసీమకు నీళ్లు ఇస్తే బాగుంటుందని చెప్పారు. సీఎం జగన్ తన పద్దతి మార్చుకోవాలని సూచించారు. లేదంటే జనాగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు.