మౌనం వీడని గంటా ! జగన్ గంటాను ఇరకాటంలో పెడతాడా ?
ఏపీలో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన జగన్ పాలన చేపట్టిన నాటి నుండి గంటా శ్రీనివాసరావు సైలెంట్ అయ్యారు. ఇప్పటి వరకు టీడీపీ నేతలు జగన్ పాలనపై కాస్తో కూస్తో ఆరోపణలు చేసినా, టీడీపీపై జరుగుతున్న దాడులపై అసహనం ప్రదర్శించినా గంటా మాత్రం చాలా సైలెంట్ గా చూస్తున్నారు. ఒకపక్క ఆయన వైసీపీలో చేరేందుకు కూడా వ్యూహాలు రచిస్తున్నారని, అయితే మంత్రి అనీల్ కుమార్ యాదవ్ అడ్డు పడుతున్నారని కూడా ప్రచారం జరుగుతుంది. ఇంతకీ గంటా సైలెంట్ వెనుక బలమైన కారణమే ఉన్నట్టు తెలుస్తుంది.
మంత్రిగా జగన్ పై బోలెడు విమర్శలు చేసిన గంటా .. ఇప్పుడు సైలెంట్
ఏపీలో జగన్ పాలనా పగ్గాలు చేపట్టి పారదర్శకమైన పాలన అందిస్తానని ప్రకటించారు. అందులో భాగంగానే జగన్ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. జగన్ తీసుకున్నటువంటి నిర్ణయాలతో ప్రతిపక్ష పార్టీల నాయకులు ఖంగు తింటున్నారు. ఇక టీడీపీ ని పూర్తి స్థాయిలో టార్గెట్ చేసిన సీఎం జగన్ గతంలో టిడిపి హయాంలో చేసిన అవినీతిపై దృష్టి పెట్టారు. ఇప్పుడు అవినీతి పుట్టలు బద్దలు కొట్టే ప్రయత్నం చేస్తున్నారు.దీంతో టిడిపి నాయకులలో టెన్షన్ మొదలైంది. అందులో భాగంగా ఇప్పుడు గతంలో మంత్రిగా పనిచేసిన గంటా శ్రీనివాసరావుకు చెక్ పెట్టే పనిలో జగన్ సర్కార్ ఉన్నట్లుగా సమాచారం. ఇక మాజీ మంత్రి గంటా విషయానికి వస్తే ఆయన తాజా ఎన్నికల్లో విశాఖ ఉత్తరం నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. దీనికి ముందు ఆయన జగన్ పైనా - వైసీపీ పైనా తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించేవారు. కానీ ఇప్పుడు సైలెంట్ గా ఉంటున్నారు.
విశాఖ భూ కుంభకోణంలో జగన్ తనను టార్గెట్ చేస్తారని భయపడుతున్న గంటా
వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు చేయడంతో విశాఖ నేతలు అక్కడి భూ కబ్జా కేసులపై ఒత్తిడి పెంచుతుండడంతో ప్రభుత్వం తనను ఖచ్చితంగా టార్గెట్ చేస్తుందని భావిస్తున్న గంటా పూర్తి మౌనం పాటిస్తున్నారు. టీడీపీ నేతలు చాలా మందే మాట్లాడుతున్నా ఆయన ఎక్కడా కనిపించడం కూడా లేదు. ఒకపక్క - బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైన నేపథ్యంలో కూడా ఆయన ఎక్కడా కనిపించక పోవడం మీడియాకు అందుబాటులో లేకుండా పోవడాన్ని బట్టి విశాఖ భూకబ్జా కేసుతో ఆయన ఫుల్ గా భయపడుతున్నారని సమాచారం. గడిచిన ఐదేళ్లలో విశాఖ జిల్లాలో భూ దందాలు విపరీతంగా జరిగాయని ,విశాఖ భూ కుంభకోణం లో ఉన్నది టిడిపి నేతలేనని అప్పట్లో వైసీపీ నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతిపక్ష హోదాలో వైసిపి నాడు ఎంతో పోరాటం చేసినప్పటికీ నాడు అధికార పార్టీగా ఉన్న టిడిపి ఈ వ్యవహారంపై ఏమాత్రం స్పందించలేదు. గంటా శ్రీనివాసరావు వర్గంగా ఉన్న భీమిలి కి చెందిన నేతలే పెద్ద ఎత్తున అక్రమ భూ సేకరణ చేశారని, అందుకే ప్రభుత్వం దాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేసిందని అప్పట్లో పెద్దఎత్తున చర్చ సాగింది.
ఇక ఇప్పుడు జగన్ విశాఖ భూ కుంభకోణాన్ని బయటకు లాగి కుంభకోణానికి కారణమైన బాధ్యులను చట్టరీత్యా శిక్షించాలనే ప్రయత్నాల్లో ఉన్నారు.విశాఖ భూకుంభకోణం పై సమగ్ర దర్యాప్తుకు జగన్ ఆదేశించటంతో ఇప్పుడు గంటా శ్రీనివాసరావుకు, గంటా వర్గానికి టెన్షన్ పట్టుకుంది. అందుకే గంటా టెన్షన్ పడుతున్నారని సమాచారం .
టీడీపీ హయాంలో విచారణకు సిట్.. ప్రభుత్వం మారటంతో టెన్షన్ లో గంటా
అప్పటి బాబు ప్రభుత్వం దీనిపై ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమించింది. ఈ సిట్ బృందం పలు కోణాల్లో విచారణ చేసి నివేదికను ప్రభుత్వానికి అందించింది. అయితే ఎన్నికలు రావడంతో ఈ విషయం పక్కన పడింది . ఇక ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో విశాఖలోని స్థానిక నాయకులు ఈ కేసు విషయాన్ని తేల్చాలని ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నారు. ఈ కేసులో అన్ని వ్యవహారాలను మరింత లోతుగా పరిశీలిచించి భూ కబ్జాకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. అప్పట్లో అందరి కంటే ఎక్కువ ఆరోపణలు ఎదుర్కొన్నారు కాబట్టే గంటా ఈ వ్యవహారంలో ఏం చెయ్యాలో అర్ధం కాక మౌనం వహిస్తున్నారు.