ఆ పిటిషన్ లో సిఎం పేరు ఎందుకు?:హైకోర్టు;నకిలీ ఓటర్ల పిల్ పై ఈసీ వైఖరి తెలపాలి
హైదరాబాద్:ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కోరుతూ హై కోర్టులో దాఖలైన వ్యాజ్యంలో ముఖ్యమంత్రిని ఎందుకు ప్రతివాదిగా చేర్చారో చెప్పాలంటూ పిటిషనర్ ను ధర్మాసనం ప్రశ్నించింది.
ముఖ్యమంత్రిపై కూడా అనర్హత వేటు వేయాలని మీరు కోరుతున్నారా?...విచారణ సందర్భంగా పిటిషనర్ ను హైకోర్టు ఛీప్ జస్టిస్ అడిగారు. ఒక పార్టీ తరుపున గెలిచి మరో పార్టీ లోకి ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ మాజీ ఎమ్మెల్యే అన్నా వెంకట రాంబాబు వేసిన పిటిషన్ కు అనుబంధంగా పై సతీశ్కుమార్ అనే వ్యక్తి దాఖలు చేసిన వ్యాజ్యంపై మంగళవారం హైకోర్టులో విచారణ జరిగింది.
అనుబంధ పిటిషన్ విచారణ సందర్భంగా చీఫ్ జస్టిస్ టీబీఎన్ రాధాకృష్ణన్, జస్టిస్ ఎస్వీ భట్లతో కూడిన ధర్మాసనం ముఖ్యమంత్రి పేరును పిటిషన్ లో చేర్చడంపై పిటిషనర్ తరుపు న్యాయవాదిని ప్రశ్నించింది. దీనిపై పిటిషనర్ తరుఫున న్యాయవాది సీవీ మోహన్రెడ్డి వాదిస్తూ ఈ వ్యాజ్యానికి సంబంధించి తాము అనుబంధ పిటిషన్ ను వేశామని, అందులో సీఎంపై అనర్హత వేటు వేయాలని తాము కోరలేదని ధర్మాసనంకు తెలియబరిచారు. అనంతరం విచారణను వారం రోజులకు వాయిదా వేస్తూ హై కోర్టు ఆదేశాన్ని జారీ చేసింది.
ఇదిలావుంటే ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన ఓటర్ల జాబితాలో నకిలీ ఓటర్లకు స్థానం కల్పిస్తున్నారని పేర్కొంటూ దాఖలు చేసిన ఒక ప్రజాహిత వ్యాజ్యంపై మీ స్పందన తెలపాలంటూ కేంద్ర ఎన్నికల సంఘాన్ని హైకోర్టు ఆదేశించింది. ఓటర్ల జాబితా నుంచి అనర్హులైన నకిలీ ఓటర్లను తొలగించేలా కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని కోరుతూ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి హైకోర్టులో ఈ పిల్ ను దాఖలు చేశారు.
మంగళవారం దీనిపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టీబీఎన్ రాధాకృష్ణన్, జస్టిస్ ఎస్వీ భట్తో కూడిన ధర్మాసనం విచారణ జరపగా...పిటిషనర్ తరఫున న్యాయవాది పొన్నవోలు సుధాకర్రెడ్డి వాదనలు వినిపించారు. అనర్హులకు ఓటు హక్కు కల్పించడానికి బాధ్యులైన బూత్స్థాయి అధికారులపై చర్యలు తీసుకునేలా ఆదేశించాలని ఆయన ధర్మాసనాన్ని కోరారు.
పిటిషనర్ తరుపు న్యాయవాది వాదనలపై న్యాయస్థానం స్పందిస్తూ ఆంధ్రప్రదేశ్ లో ఓటర్ల జాబితా ప్రక్రియ అంశం ఏ దశలో ఉందని ఎన్నికల సంఘం తరఫు న్యాయవాదిని ప్రశ్నించింది. అందుకు ఆయన జనవరి 4 నాటికి ఓటర్ల జాబితా ముసాయిదాను ప్రకటిస్తామని తెలిపారు. ఈ వివరాలను హై కోర్టు పరిగణనలోకి తీసుకొని ఈ విషయమై మీ వైఖరి తెలపాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశిస్తూ విచారణను డిసెంబర్ 11వ తేదీకి వాయిదా వేసింది.