ఇదేంది జగన్ గారూ.. ఏబీ వెంకటేశ్వరరావును సన్మానిస్తారనుకొంటే, సస్పెండ్ చేశారు: కేశినేని నాని
ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్పై ప్రతిపక్ష టీడీపీ కూడా స్పందించింది. వెంకటేశ్వరరావును సన్మానిస్తారని అనుకొంటే.. సస్పెండ్ చేశారేంటీ అని టీడీపీ ఎంపీ కేశినేని నాని ప్రశ్నించారు. ఈ మేరకు సీఎం జగన్మోహన్ రెడ్డికి ట్వీట్ చేశారు. సర్వీసు నిబంధనలను ఉల్లంఘించారని నిన్న రాత్రి ఏబీ వెంకటేశ్వరరావును ప్రభుత్వం సస్పెండ్ చేసింది. దీనిపై తాను చట్టపరంగా ముందుకెళ్లే అంశాన్ని పరిశీలిస్తానని వెంకటేశ్వరరావు మీడియాకు లేఖ కూడా విడుదల చేశారు.
ట్వీట్లో ఏమన్నారంటే..
జగన్మోహన్ రెడ్డి సీఎం అవడానికి, వైసీపీ పార్టీ అధికారంలోకి రావడానికి ఏబీ వెంకటేశ్వరరావు కారణం అని ట్వీట్లో కేశినాని పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో వెంకటేశ్వరరావు ఇంటెలిజెన్స్ చీఫ్గా వ్యవహరించారు. గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓడిపోవడం వెంకటేశ్వరరావు కీ రోల్ పోషించారని నాని ఆరోపించారు. అలాంటి వ్యక్తిని సన్మానం చేయాల్సింది పోయి.. సస్పెండ్ చేయడం ఏంటి అని ట్వీట్లో కేశినేని నాని ప్రశ్నించారు.
వెంకటేశ్వరరావు రియాక్షన్
సస్పెన్షన్పై సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు స్పందించారు. మీడియాలో వస్తున్న కథనాల్లో వాస్తవం లేదని ప్రతికా ప్రకటన విడుదల చేశారు. బంధుమిత్రులు, సన్నిహితులను ఉద్దేశించి ప్రకటన విడుదల చేశారు. సస్పెన్షన్తో తాను కృంగిపోనని పేర్కొన్నారు. ప్రభుత్వ చర్యను చట్టపరంగా ఎదుర్కొనే అవకాశాలను పరిశీలిస్తానని స్పష్టంచేశారు. తన సస్పెన్షన్ గురించి ఎవరూ ఆందోళన చెందొద్దని పత్రికా ప్రకటనలో వెంకటేశ్వరరావు కోరారు.
ఇదీ కారణం
అఖిల భారత ఉద్యోగుల సర్వీసుల నియమావళి, ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించారనే కారణంతో వెంకటేశ్వరరావును ఏపీ ప్రభుత్వం విధుల నుంచి తప్పించింది. గత సార్వత్రిక ఎన్నికల సమయంలో ఏబీ వెంకటేశ్వర రావు ఇంటెలిజెన్స్ బ్యురో అదనపు డైరెక్టర్ జనరల్గా పనిచేశారు. అనంతరం బదిలీ చేసిన ప్రభుత్వం ఇంతవరకు పోస్టింగ్ ఇవ్వలేదు. ఎన్నికల సమయంలో ఏబీ వెంకటేశ్వర రావు ఇంటెలిజెన్స్ బ్యురో చీఫ్గా తన అధికారాలను దుర్వినియోగం చేశారనే ఆరోపణలను ఎదుర్కొన్నారు.
కుమారుడి కంపెనీకి..
ఏబీ వెంకటేశ్వర రావు పోస్టింగ్లో ఉన్న సమయంలో అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని అప్పట్లోనే ఆరోపణలు వచ్చాయి. కుమారుడు చేతన్ సాయికృష్ణకు చెందిన ఓ సంస్థకు సెక్యూరిటీ పరికరాలను తయారు చేసే కాంట్రాక్టు పనులను ఇప్పించారంటూ విమర్శలు వచ్చాయి. వాటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని.. దర్యాప్తునకు ప్రభుత్వం ఆదేశించింది. ఆరోపణలు నిజమేనని తేలడంతో.. ఏబీ వెంకటేశ్వర రావుపై సస్పెన్షన్ వేటు వేసినట్టు తెలుస్తోంది.