తెర ముందుకు ప్రశాంత్ కిశోర్: జగన్ తప్పిదమా, వ్యూహమా?
విజయవాడ: వ్యూహకర్తగా ప్రశాంత్ కిశోర్ను వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ తెర ముందుకు ఎందుకు తెచ్చారనేది ప్రశ్నార్థకంగా మారింది. తనపై పార్టీ క్యాడర్కు నమ్మకం సడలిపోవడం వల్లనే ప్రశాంత్ కిశోర్ను ముందుకు తెచ్చి తిరిగి విశ్వాసాన్ని పాదుకొల్పుకోవడానికి ప్రయత్నించారనే విమర్శలు కూడా వస్తున్నాయి.
ప్రశాంత్ కిశోర్ సేవలను గతంలో బిజెపి, జనతాదళ్, కాంగ్రెస్, ఆప్, ఎస్పి వినియోగించుకున్నాయి. అయితే ఆయా పార్టీలు ప్రశాంత్ కిశోర్ను తెరవెనుకకే పరిమితం చేశాయి. వేదికపైకి తీసుకుని వచ్చి పార్టీ నాయకులకు, కార్యకర్తలకు పరిచయం చేసిన దాఖలాలు లేవు.
పార్టీ ప్లీనరీలో జగన్ అనూహ్యంగా పికెను జగన్ తెరపైకి తీసుకురావడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దానివల్ల ప్రత్యర్థి టిడిపి ముందుజాగ్రత్త పడే అవకాశాన్ని తామే ఇచ్చామని కూడా అంటున్నారు. అన్ని ఎన్నికల్లో గెలిపించిన పికె ఇటీవల జరిగిన యుపి ఎన్నికల్లో ఎస్పి-కాంగ్రెస్ జోడీని ఎందుకు గెలిపించలేకపోయారనే ప్రశ్నకు జవాబు ఇప్పటి వరకూ రాలేదు.
వ్యూహం ప్రకారమేనా...
ప్రశాంత్ కిశోర్ను తెర ముందుకు తీసుకురావడం జగన్ వ్యూహాత్మక నిర్ణయమేననే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. మోడీ వంటివారిని గెలిపించిన పికె తనను కూడా గెలిపించడానికి వచ్చాడనే సంకేతాలను ఇప్పటినుంచే ప్రజల్లో పంపించడానికి పనికి వస్తుందని, మధ్య తరగతి, తటస్థ ఓటర్లలో అతని సమర్ధతపై ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకోవడం సాధ్యమవుతుందని అంటున్నారు.
Recommended Video
చంద్రబాబుకు అవకాశమా...
జగన్ ప్రజలకు తొమ్మిది హామీలు ఇవ్వడం కూడా చర్చనీయాంశంంగా మారింది. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది కాబట్టి తాము ప్రకటించిన హామీలకంటే మరింత ఆకర్షణీయమైన పథకాలను ప్రకటించే వెసులుబాటు చంద్రబాబుకు ఉంటుందని కొద్ది మంది నాయకులు అంటున్నారు. అయితే, గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను చంద్రబాబు అమలు చేయలేదు కాబట్టి అదనంగా వచ్చే ఎన్నికల్లో ఎన్ని హామీలు ఇచ్చినా ప్రజలు నమ్మబోరనే విశ్వాసంతో జగన్ ఉన్నట్లు చెబుతున్నారు. ఆ నమ్మకంతోనే ఆయన ఆ హామీలను ఇచ్చినట్లు తెలుస్తోంది.
దాదాపుగా అదే మ్యానిఫెస్టో...
జగన్ ప్లీనరీ వేదికగా ఇచ్చిన తొమ్మిది హామీలే దాదాపుగా వచ్చే ఎన్నికల ప్రణాళిక అవుతుంది. తమ హామీలన్నీ టిడిపిని అప్రమత్తం చేయడానికే పనికొస్తాయని కొద్ది వైసిపి నాయకులు అంటున్నారు. అయితే, ఆ హామీలు ప్రజలకు విశ్వాసం కలిగిస్తాయని, తమకు బలాన్ని చేకూరుస్తాయని జగన్ నమ్ముతున్నట్లు చెబుతున్నారు.
పవన్ కల్యాణ్ వ్యూహమేమిటో..
జనసేన పవన్ కల్యాణ్ వేగాన్ని, వ్యూహాన్ని అంచనా వేయకుండా ముందుకు దూకడం ఏ మేరకు పనికి వస్తుందనేది కూడా చర్చనీయాంశంగానే మారింది, పవన్వైపు ఉభయ గోదావరి జిల్లాలు, ఉత్తరాంధ్ర, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో ఉన్న కాపులు, సీమలో బలిజ యువకులు మొగ్గు చూపుతారని, సినిమా అభిమానం మరికొంత అదనపు బలంగా మారుతుందని అంటున్నారు. అయితే, పవన్ కల్యాణ్ పూర్తి స్థాయిలో రంగంలోకి దిగిన తర్వాత చంద్రబాబుతో పాటు పవన్ కల్యాణ్ను ఎదుర్కోవడం అంతగా ఉపకరించదని, ముందే కార్యాచరణను రూపొందించుకుంటే పవన్ కల్యాణ్ను ఆత్మరక్షణలో పడేస్తుందని జగన్ అనుకున్నట్లు చెబుతున్నారు.