జగన్ వారిని ఎందుకు తక్కువ అంచనా వేసినట్లు ? ఏపీలో ఎక్కడ చూసినా ఇదే చర్చ...!
ఏపీలో స్ధానిక ఎన్నికలను వాయిదా వేస్తూ తాజాగా ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తీసుకున్న నిర్ణయం కాకరేపుతోంది. అయితే ఎన్నికల కమిషనర్ ఈ నిర్ణయం తీసుకుంటారని సీఎం జగన్ తన నిఘా వ్యవస్దల ద్వారా ఎందుకు పసిగట్టలేకపోయారన్న చర్చ సాగుతోంది. గతంలో ఏపీపీఎస్సీ, మండలి ఛైర్మన్ల వ్యవహారంలోనూ వారి చర్యలను పసిగట్టడంలో విఫలమైన వైసీపీ ప్రభుత్వం అప్రదిష్ట మూటగట్టుకోక తప్పలేదు.
ఏపీలో రాజ్యాంగ పదవులు- టీడీపీ
ఏపీలో గత టీడీపీ హయాంలో రాజ్యాంగ పదవుల్లో నియమించిన కొందరు వ్యక్తుల వ్యవహారశైలిపై అప్పట్లో విపక్షంలో ఉన్న జగన్ తీవ్ర ఆరోపణలు చేసేవారు. చంద్రబాబు హయాంలో డీజీపీ, ఇంటెలిజెన్స్ ఛీఫ్, శాసనసభ స్పీకర్ తో పాటు పలు కీలక పదవుల్లో ఉన్న వారిపై జగన్ మండిపడేవారు. అయితే తానూ అధికారంలోకి రాగానే వారిని ఒక్కొక్కరిగా ఇంటికి పంపారు. అయితే కొన్ని రాజ్యాంగ పదవుల్లో ఉన్న వారిని మాత్రం జగన్ ఏమీ చేయలేకపోయారు. దానికి కారణం వారిని పదవీకాలం ముగిసేవరకూ లేదా అభిశంసన జరిగే వరకూ ఏమీ చేయలేని పరిస్ధితి. దీంతో వీరిలో కొందరిని తమ పార్టీవైపుకు తిప్పుకున్నారు. మరికొందరు వారంతట వారే రాజీనామాలు చేసేశారు. మిగిలిన వారు ఏం చేస్తారో చూద్దామని ఇంకా కొనసాగుతున్నారు.
వైసీపీ వచ్చాక వరుసగా ఎదురుదెబ్బలు..
గతేడాది అసెంబ్లీ ఎన్నికల్లో విజయంతో అధికారం చేపట్టిన వైసీపీ సర్కారు ముందుగా టీడీపీ హయాంలో నియమించిన కమ్మ సామాజిక వర్గ అధికారులను కీలక పదవుల నుంచి తప్పించేశారు. ఆ తర్వాత వరుసగా తమకు అనుకూలమైన వారితో వాటిని నింపేశారు. అయితే రాజ్యాంగ సంస్ధలైన ఏపీపీఎస్సీ, శాసనమండలి ఛైర్మన్, రాష్ట్ర ఎన్నికల కమిషన్ కు అధిపతులుగా ఉన్న వారు మాత్రం ఇంకా కొనసాగుతున్నారు. వీరిలో తొలుత ఏపీపీఎస్సీ ఛైర్మన్ పై జగన్ సర్కారు దృష్టిపడింది. ఉద్యోగాల భర్తీకి క్యాలెండర్ తయారు చేయమని ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను పూర్తిస్ధాయిలో అమలు చేయలేదనే కోపంతో ఉన్న వైసీపీ సర్కారుకు ఛైర్మన్ ఉదయ్ భాస్కర్ మరో ఝలక్ ఇచ్చారు. గ్రామ సచివాలయ ఉద్యోగాల కోసం నిర్వహించిన రాతపరీక్షకు ఏపీపీఎస్సీ తరఫున సహకరించేనట్లే సహకరిస్తూ తన ఉద్యోగులతో పేపర్ లీకేజీ చేయించారని వైసీపీ ఆరోపించింది. అయితే ఈ వ్యవహారంలో ఛైర్మన్ ఉదయ్ భాస్కర్ పై గవర్నర్ కు ఫిర్యాదు చేయడం మినహా ఏమీ చేయలేని పరిస్ధితి.
రాజధాని బిల్లుల విషయంలో షరీఫ్ ఝలక్..
టీడీపీ ఎమ్మెల్సీగా ఉన్న మహ్మద్ అహ్మద్ షరీఫ్ ను చంద్రబాబు ప్రభుత్వం నంద్యాల ఉపఎన్నికల సమయంలో మండలి ఛైర్మన్ గా నియమించింది. అప్పట్లో ఛైర్మన్ గా ఉన్న ఫరూక్ కు మైనార్టీ మంత్రిగా బాధ్యతలు ఇచ్చి ఆయన స్ధానంలో ఛైర్మన్ గా షరీఫ్ ను నియమించింది. అయితే సాధారణంగానే సౌమ్యుడైన షరీఫ్.. అసెంబ్లీ ఆమోదించిన రాజధాని బిల్లులు మండలికి వచ్చినప్పుడు వాటిని ఆమోదింపజేయడం లేదా తిప్పిపంపడం చేస్తారని అంతా ఊహించారు. జగన్ కూడా ఇదే అనుకున్నారు. అయినా ఎందుకైనా మంచిదని తన మంత్రులను కూడా షరీఫ్ వద్దకు పంపి నచ్చజెప్పారు. అయినా చివరి నిమిషంలో షరీఫ్ రాజధాని బిల్లులను సెలక్ట్ కమిటీకి పంపి పెద్ద ఝలక్ ఇచ్చేశారు.
ఎన్నికల కమిషనర్ విషయంలో మరోసారి..
తాజాగా స్ధానిక ఎన్నికల వాయిదా విషయంలో మరోసారి జగన్ కు ఇదే తలనొప్పి ఎదురైంది. చంద్రబాబు హయాంలో ఎన్నికల కమిషనర్ గా బాధ్యతలు చేపట్టిన నిమ్మగడ్డ రమేష్ కుమార్ విషయంలోనూ జగన్ అంచనా తప్పింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా ఉన్న నిమ్మగడ్డ స్ధానిక ఎన్నికల వ్యవహారంలో ముందునుంచీ జగన్ ప్రభుత్వానికి ఇబ్బందులు సృష్టించినట్లు వైసీపీ ఇప్పుడు చెబుతోంది. రిజర్వేషన్ల ఖరారుతో పాటు ఎన్నికల తేదీల విషయంలోనూ ప్రభుత్వానికి అనుకూలంగా ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అయితే ఆయన ఏకంగా కరోనా వైరస్ కారణం చూపి స్ధానిక ఎన్నికలనే వాయిదా వేస్తారని వైసీపీ కానీ, సీఎం జగన్ కానీ ఊహించలేదు. చేతులు కాలాక ఆకులు పట్టుకున్న తీరున ఇప్పుడు కోర్టుల్లో ఆయనపై పోరాటం చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. దీన్ని బట్టి చూస్తే జగన్ రాజ్యాంగ వ్యవస్దలకు అధిపతులుగా ఉన్నవారి విషయంలో ఏనాడూ అప్రమత్తంగా లేరని అర్ధమవుతోంది.