ఎందుకలా జరిగింది?: లోకేష్, బాబు సీరియస్.., ఐదుసార్లు అటెండెన్స్ తీసుకోమని..
అచ్చెన్నతో సంభాషణ కొనసాగుతున్న సమయంలోనే టీడీపీ శాసనసభాపక్ష కార్యాలయ కార్యదర్శి సురేష్ అటువైపు వచ్చారు. మంత్రుల గైర్హాజరుపై సురేష్కు లోకేష్ పలు సూచనలు చేశారు. 'సురేషన్నా..
అమరావతి: క్రమశిక్షణకు మారుపేరు తెలుగుదేశం పార్టీ అని ఏపీ సీఎం చంద్రబాబు పదేపదే చెబుతుంటారు. క్రమశిక్షణ పాటించకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తుంటారు. దీంతో చంద్రబాబుతో వ్యవహారం అంటే నేతలకు ముందు క్రమశిక్షణే గుర్తుకు వస్తుంది.
అయితే ఇటీవలి కాలంలో తెలుగు తమ్ముళ్లు క్రమశిక్షణ తప్పుతున్నారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారట. ముఖ్యంగా అసెంబ్లీ సమావేశాల వేళ నేతలు సమయ పాలన పాటించకపోవడంపై ఆయన గుర్రుగా ఉన్నట్టు తెలుస్తోంది. మంత్రి లోకేష్ సైతం జోక్యం చేసుకుని నేతలను సున్నితంగా మందలించే ప్రయత్నం చేశారట.
Recommended Video


అసలేం జరిగింది:
ఇటీవల విశాఖలో జరిగిన అగ్రిటెక్ సదస్సుకు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సహా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నప్పటికీ.. ముఖ్య సమావేశం కావడంతో సీఎం వెళ్లాల్సి వచ్చింది. అయితే సీఎం సభకు రావడం లేదన్న విషయం తెలిసి.. టీడీపీ నేతలు ఆలస్యంగా వచ్చారట.

ప్రశ్నోత్తరాల సమయంలో:
కొంతమంది మంత్రులు సభకు ఆలస్యంగా రావడంతో ప్రశ్నోత్తరాల సమయంలో సమాధానం చెప్పేవారే కరువయ్యారట. ఆ సమయంలో పురపాలక శాఖ, వైద్య- ఆరోగ్యశాఖ, విద్యాశాఖలకి సంబంధించిన ప్రశ్నలు రావడంతో స్పీకర్ కోడెల శివప్రసాదరావు సంబంధిత మంత్రులను సమాధానాలు కోరారు. కానీ ఆ సమయానికి వారు సభలో లేకపోవడంతో సైగలతోనే మరో మంత్రి అచ్చెన్నాయుడిని ప్రశ్నించారు.

లోకేష్ ఎదురుపడి:
స్పీకర్ సైగలతో అచ్చెన్నాయుడు వెంటనే సభ నుంచి బయటకు వెళ్లి మంత్రుల కోసం ఆరా తీశారు. అదే సమయంలో ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ అటు వైపు వస్తూ ఎదురుపడ్డారు. 'అచ్చెన్నా.. ఏంటి బయటకొస్తున్నారు?' అని ప్రశ్నించారు. దీంతో ప్రశ్నలకు బదులివ్వాల్సిన మంత్రులు సభలో లేరని లోకేష్ తో చెప్పారు. ఆగ్రహించిన లోకేష్ వెంటనే వారిని సభకు పిలిపించాలని తన సిబ్బందిని ఆదేశించారు.

ఐదుసార్లు అటెండెన్స్ తీసుకోండి:
అచ్చెన్నతో సంభాషణ కొనసాగుతున్న సమయంలోనే టీడీపీ శాసనసభాపక్ష కార్యాలయ కార్యదర్శి సురేష్ అటువైపు వచ్చారు. మంత్రుల గైర్హాజరుపై సురేష్కు లోకేష్ పలు సూచనలు చేశారు. 'సురేషన్నా.. వెంటనే మంత్రులకు ఫోన్ చేసి పిలిపించండి. ఎమ్మెల్యేల అటెండెన్స్ కూడా ఐదుసార్లు తీసుకొండి. పొద్దున్నే సీఎం గారు చెప్పి మరీ వెళ్లారు. ఇలా చేస్తే ఎలా?' అంటూ అసంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం అచ్చెన్నాయుడితో పాటు సభలోకి వెళ్లారు. కొద్దిసేపటికే మరో మంత్రి కామినేని శ్రీనివాసరావు కూడా సభకు వచ్చారు.

బాబు సీరియస్:
అగ్రి టెక్ సదస్సు నుంచి తిరిగి వచ్చిన తర్వాత సభ గురించి ఆరా తీశారు సీఎం. మంత్రుల గైర్హాజరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేలయినా, మంత్రులైనా.. కచ్చితంగా సమయం పాటించాల్సిందేనని ఆదేశించారు. దీంతో ఎమ్మెల్యేలు, మంత్రులు అప్రమత్తమైనట్టు తెలుస్తోంది. మరోసారి ఇలాంటివి రిపీట్ కాకుండా వారు జాగ్రత్తపడుతున్నట్టు సమాచారం.












Click it and Unblock the Notifications