ఇదేం న్యాయం : రోజా సెల్ఫీతో వైసీపీని ఇరుకునపెడుతోన్న టీడీపీ..
ఏపీ శాసనమండలిలో బుధవారం వైసీపీ ఎమ్మెల్యే రోజా టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణతో కలిసి సెల్ఫీ దిగడం.. ఆ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ కావడం తెలిసిందే. ఈ ఫోటోపై కొంతమంది ట్రోల్స్ చేస్తుండగా.. టీడీపీ మాత్రం వైసీపీని ఇరుకునపెట్టే అస్త్రంగా వాడుతోంది. రోజాకు ఓ న్యాయం.. చంద్రబాబుకు ఓ న్యాయమా..? అంటూ ప్రశ్నిస్తోంది. టీడీపీ ఎందుకిలా ప్రశ్నిస్తుందో తెలియాలంటే పూర్తి కథనం చదవాల్సిందే..
చంద్రబాబు సెల్ఫోన్ లాగేసుకున్న మార్షల్స్..
సీఆర్డీఏ రద్దు,అభివృద్ది వికేంద్రీకరణ బిల్లు రద్దుపై మండలిలో చర్చ సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు.. మండలి గ్యాలరీలో కూర్చుని సమావేశాలను వీక్షించారు. దాదాపు నాలుగు గంటల పాటు ఆయన అక్కడే ఉన్నారు. ఛాంబర్కు వెళ్దామని టీడీపీ నేతలు చెప్పినప్పటికీ ఆయన అక్కడి నుంచి కదలడానికి ఇష్టపడలేదు. ఇంతలో అక్కడికి వచ్చిన మార్షల్స్.. రూల్ ప్రకారం గ్యాలరీలో కూర్చునేవాళ్లు సెల్ఫోన్ క్యారీ చేయకూడదని చెప్పారు. సెల్ఫోన్ తమకు ఇచ్చేయాలని సూచించడంతో చంద్రబాబు దాన్ని వాళ్లకు ఇచ్చేశారు.
బాలయ్యతో రోజా సెల్ఫీ
చంద్రబాబు సెల్ఫోన్ను మార్షల్స్ తీసుకున్న కొద్దిసేపటికే.. వైసీపీ ఎమ్మెల్యే రోజా మండలి గ్యాలరీలోకి వచ్చారు. టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణను చూసి నవ్వుతూ పలకరించారు. ఆయన పక్కనే కూర్చొని కాసేపు ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆయనతో సెల్ఫీ కూడా తీసుకున్నారు. ఈ సెల్ఫీ సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇప్పుడిదే సెల్ఫీ వైసీపీని ఇరుకున పెట్టేందుకు టీడీపీకి అస్త్రంగా మారింది.
మండిపడుతున్న టీడీపీ..
మండలి గ్యాలరీలోకి రోజా సెల్ఫోన్ తీసుకెళ్తే అభ్యంతరం చెప్పని మార్షల్స్.. చంద్రబాబు సెల్ఫోన్ను మాత్రం ఎందుకు లాగేసుకున్నారని టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. రోజాకు ఓ న్యాయం.. చంద్రబాబుకు మరో న్యాయమా.. అంటూ నిలదీస్తున్నారు. చంద్రబాబు సెల్ఫోన్ లాగేసుకున్నారన్న విషయం ఆలస్యంగా తెలియడంతో టీడీపీ నేతలు ఈ ఘటనపై మండిపడుతున్నారు. సోషల్ మీడియాలో టీడీపీ కార్యకర్తలు,అభిమానులు వైసీపీ వ్యవహార శైలిపై ట్రోలింగ్స్ చేస్తున్నారు.
లోకేష్పై వైసీపీ విమర్శలు
టీడీపీ విమర్శలకు,ట్రోలింగ్స్కు వైసీపీ నేతలు కూడా గట్టిగానే కౌంటర్ ఇస్తున్నారు. మండలిలో టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేష్... తన సెల్ఫోన్ కెమెరాతో వీడియో తీస్తున్న దృశ్యాలను సోషల్ మీడియాలోవైరల్ చేస్తున్నారు. మండలిలో వాడి వేడి చర్చ జరుగుతున్న సమయంలో లోకేష్ ఇలా తన సెల్ఫోన్లో వీడియో తీయడమేంటని వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఇది సభా హక్కుల ఉల్లంఘనగా పరిగణించి.. లోకేష్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.