ఏపీలో కాలు పెట్టని మీరాకుమార్: అసలు కారణమిదే!
కాంగ్రెస్, ప్రతిపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి మీరాకుమార్ దాదాపు దేశంలోని అన్ని రాష్ట్రాల్లో పర్యటిస్తున్నారు. కానీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మాత్రం రాలేదు.
అమరావతి: కాంగ్రెస్, ప్రతిపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి మీరాకుమార్ దాదాపు దేశంలోని అన్ని రాష్ట్రాల్లో పర్యటిస్తున్నారు. కానీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మాత్రం రాలేదు. తెలంగాణలోనూ ఆమె కాంగ్రెస్ పార్టీ నేతలతో కలిసి ప్రచారం నిర్వహించారు. కానీ, ఏపీలో ఆమె కాలు పెట్టకుండానే హైదరాబాద్ నుంచి వెనుదిరిగారు.
దీంతో దక్షిణాదిలో ఆమె పర్యటించని రాష్ర్టం ఏదైనా ఉందంటే అది ఆంధ్రప్రదేశ్ అనే చెప్పవచ్చు. అయితే, మీరా కుమార్ ఏపీలో పర్యటించకపోవడానికి ఓ ప్రత్యేక కారణంగా కూడా ఉంది.
తెలంగాణ, ఏపీల్లో రామ్ నాథ్
ఆ వివరాల్లోకి వెళితే... రాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలో ఇటు ఎన్డీయే.. అటు యూపీఏ అభ్యర్థి అన్ని దాదాపు రాష్ట్రాలలో పర్యటిస్తూ ఎమ్మెల్యేలు, ఎంపీలను కలిసి ఓట్లు అభ్యర్ధిస్తున్న విషయం తెలిసిందే. మంగళవారం ఎన్డీయే అభ్యర్ధి రామ్నాధ్ కోవింద్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో పర్యటించారు.
ఏపీ, టీల్లో మద్దతు
హైదరాబాద్లో ఆయనకు బీజేపీ, టీఆర్ఎస్, టీడీపీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీల నేతలు స్వాగతం పలికారు. ఆయనతో సమావేశమై మద్దతు ప్రకటించారు. ఆ తర్వాత విజయవాడలోనూ తెలుగుదేశం పార్టీ , బీజేపీ ఎమ్మెల్యేలు, ఎంపీలను ఆయన కలుసుకున్నారు. వారి మద్దతు అభ్యర్ధించారు. పేరు పేరున అందరినీ పలుకరించారు. పరిచయం చేసుకున్నారు.
మద్దతే లేదు.. ఏపీకి ఎందుకు?
కాగా, అంతకు ముందు రోజే సోమవారం తెలంగాణలో యుపీఏ రాష్ట్రపతి అభ్యర్ధి, లోక్సభ మాజీ స్పీకర్ మీరా కుమార్ పర్యటించి, అక్కడ ఎమ్మెల్యేలను కలుసుకున్నారు. కానీ, ఆమె ఆంధ్రప్రదేశ్కు రాలేదు. 2014లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ రాష్ర్టంలో డిపాజిట్లు కోల్పోయింది. అంతేగాక, పోటీ చేసిన కాంగ్రెస్ అభ్యర్థి ఒక్కరు కూడా గెలుపొందలేదు. దీంతో ఆమెకు మద్దతు పలికేవారు ఇక్కడ లేకుండా పోయారు. ఫలితంగా ఆమె ఆంధ్రప్రదేశ్కు రావాల్సిన అవసరమే లేకుండా పోయింది.
మర్యాద పూర్వకంగానే.. నిరాశలో కాంగ్రెస్
అయితే, పీసీసీ తరుపున హైదరాబాద్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నేతలు కలిసి ఆమెకు తమ మద్దతు ప్రకటించారు. కాగా, ఏపీ నేతలది కేవలం మర్యాదపూర్వకమే కావడం గమనార్హం. దేశంలో యూపీఎ రాష్ర్టపతి అభ్యర్ధి వెళ్లని రాష్ర్టం ఏదైనా ఉందంటే అది ఆంధ్రప్రదేశేనని, రాజకీయ నేతలు విశ్లేషిస్తున్నారు. ఇటీవల జరిగిన ఓ సర్వేలో కూడా కాంగ్రెస్ ఓట్ల శాతం పెరగలేదని తేలిపోవడంతో ఆ పార్టీ నేతలు మరింత నిరుత్సాహానికి గురవుతున్నట్లు తెలుస్తోంది. అందుకే పలువురు నేతలు టీడీపీ, వైసీపీ బాట పడుతున్నట్లు తెలుస్తోంది.