నిమ్మగడ్డ తొందరపడ్డారా ? హైకోర్టు తీర్పు చూడకుండానే బాధ్యతల్లోకి- ఆ తర్వాత...?
నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఏపీ ఎన్నికల కమిషనర్ గా ఉన్నట్లా లేనట్లా.. ఇప్పుడు రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఇదే చర్చ సాగుతోంది. రాజకీయ వర్గాలతో పాటు అధికారులు, సామాన్యుల్లోనూ ఇదే చర్చ. దీనంతటికీ ప్రధాన కారణం హైకోర్టు తీర్పు కోసం ఎదురు చూస్తూ టీవీల్లో స్క్రోలింగ్స్ రాగానే చకచకా విధుల్లోకి తిరిగి చేరేందుకు ఏర్పాట్లు చేసుకున్న నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆతృతే అన్న ప్రచారం జరుగుతోంది. ఇంతకీ ఆయన ఎందుకు తొందర పడ్డారు, చివరికి తన నియామకం ఉత్తర్వులను ఎందుకు ఉపసంహరించుకున్నారు. తిరిగి ఇప్పుడు హైకోర్టును ఆశ్రయించేందుకు ఎందుకు సిద్ధమవుతున్నారు ?
నిమ్మగడ్డ వ్యవహారంలో మరో మలుపు.. జగన్ సర్కారుపై ఎస్ఈసీ ధ్వజం.. కోర్టు ధిక్కారమంటూ ఫైర్..
నిమ్మగడ్డ ఆతృత ఎందుకు ?
ఏపీ ఎన్నికల కమిషనర్గా నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను తొలగిస్తూ ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ ను హైకోర్టు కొట్టేసింది. అయితే తీర్పు కాపీ వెలువడిన మధ్యాహ్నం మూడు గంటల తర్వాత దాని కోసమే ఎదురుచూస్తున్న నిమ్మగడ్డ తనకు తానుగా హైకోర్టు తీర్పు ప్రకారం తిరిగి విధుల్లోకి చేరుతున్నట్లు రాష్ట్రంలో అధికారులందరికీ సర్కులర్ పంపిచేశారు. రాజ్యాంగ బద్దమైన పదవిలో ఉన్న నిమ్మగడ్డ హైకోర్టు తీర్పును ముందే ఊహించినట్లు ఈ పరిణామాలు స్పష్టం చేసినా తర్వాత జరిగే పరిణామాలను మాత్రం ఆయన ఊహించలేదా అన్న చర్చ మొదలైంది.
హైకోర్టు తీర్పు అన్వయించుకున్న తీరు...
నిమ్మగడ్డ రమేష్ కుమార్ బాధ్యతలు చేపట్టేందుకు పరిగణనలోకి తీసుకున్న ఒకే కారణం తనను తొలగిస్తూ ప్రభుత్వం ఇచ్చిన ఆర్డినెన్స్ ను హైకోర్టు కొట్టేయడం. అది నిజమే అయినా హైకోర్టు ఇచ్చిన తీర్పులు ఇంకా చాలా అంశాలున్నాయి. వాటిని రమేష్ కుమార్ ఎందుకు పరిగణనలోకి తీసుకోలేదన్నదే ఇప్పుడు సర్వత్రా చర్చ సాగుతోంది. ముఖ్యంగా ఎన్నికల కమిషనర్ నియామకం ప్రభుత్వం చేతిలో లేదని, ఆ పదవిలో ఎవరుండాలనేది ప్రభుత్వం సూచించజాలదని హైకోర్టు చెప్పిన విషయం జస్టిస్ కనగరాజ్ తో పాటు నిమ్మగడ్డ రమేష్ కుమార్ కూడా వర్తిస్తుంది కదా. మరి ఈ విషయాన్ని నిమ్మగడ్డ విస్మరించడమే ఈ అంశంలో ఇప్పుడు ప్రధానంగా మారిపోయింది.
ప్రభుత్వ వాదన కూడా అదే....
హైకోర్టు తీర్పును నిమ్మగడ్డ తనకు అన్వయించుకున్న తీరును చూశాక అసాధారణ రీతిలో అడ్వకేట్ జనరల్ శ్రీరాం సుబ్రహ్మణ్యం నేరుగా మీడియా ముందుకు వచ్చి హైకోర్టు తీర్పును మరోసారి వివరించాల్సి వచ్చింది. హైకోర్టు తీర్పు నిమ్మగడ్డ తొలగింపు ఆర్డినెన్స్ కే పరిమితం కాలేదని, ప్రభుత్వానికి ఉన్న కమిషనర్ నియామక అధికారాలను హైకోర్టు ప్రశ్నించిందన్న అంశం కూడా గుర్తుపెట్టుకోవాలని ఏజీ చెప్పారు. దీంతో జస్టిస్ కనగరాజ్ నియామకమే కాదు నిమ్మగడ్డ నియామకం కూడా రాంగ్ అని తేలిపోయింది. ఇప్పుడు హైకోర్టు తీర్పు ప్రభుత్వ వాదనకు ఊపిరిపోసినట్లయింది.
చేతులు కాలాయని తెలిసి....
హైకోర్టు తీర్పు రాగానే వెంటనే రంగంలోకి తాను ఎన్నికల కమిషనర్ గా బాధ్యతలు చేపట్టినట్లు సర్కులర్ ఇచ్చేసిన నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఏజీ ప్రెస్ మీట్ లో చెప్పిన అంశాలతో ఆత్మరక్షణలో పడ్డారు. దీంతో ఎందుకొచ్చిన ఇబ్బంది అనుకుంటూ తన నియామకంపై ఈసీ కార్యాలయం నుంచి జారీ అయిన సర్క్కులర్ ను ఉపసంహరించుకుంటూ మరో సర్క్కులర్ ఇచ్చారు. దీంతో తన నియామకంపై ప్రభుత్వానికే కాదు ఆయనకు కూడా క్లారిటీ లోపించిందని అర్ధమవుతోంది.
Recommended Video
క్లారిటీ కోసం హైకోర్టుకు ... కానీ
తాజా పరిణామాల నేపథ్యంలో క్లారిటీ కోసం హైకోర్టును ఆశ్రయించాలని నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఓ నిర్ణయానికి వచ్చారు. అయితే హైకోర్టు తీర్పు తర్వాత ప్రభుత్వం కూడా సుప్రీంకోర్టుకు అప్పీలుకు వెళ్లే అవకాశం ఉందని తెలిసిన తర్వాత కూడా ఆదరాబాదరాగా విధుల్లోకి చేరడం, ఆ తర్వాత తన సర్క్యులర్ తానే ఉపసంహరించుకోవడం వంటి పరిణామాలు నిమ్మగడ్డ ప్రతిష్టను, ఎన్నికల సంఘం పరువును మసకబార్చాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. హైకోర్టు, సుప్రీంకోర్టు అంతిమ తీర్పులు ఎలా ఉన్నా ఈ వ్యవహారంలో నిమ్మగడ్డ హడావిడిగా బాధ్యతలు చేపట్టడం మాత్రం విమర్శలకు తావిస్తోంది.