ముంపు ప్రాంతంలో ముందస్తు చర్యలు ఎందుకు చేపట్టలేదు, ప్రభుత్వాన్ని ప్రశ్నించిన సోము వీర్రాజు
పోలవరం ముంపు ప్రాంతాలు, కోనసీమ లంక గ్రామాల్లో ఆంధ్రప్రదేశ్ బీజేపీ ప్రతినిధులు పర్యటించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి ఒక బృందం.. ఎమ్మెల్సీ మాదవ్, కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు వేటుకురి సూర్యనారాయణ రాజు మరో బృందంగా పర్యటించి.. పంటలు, ఇళ్లను పరిశీలించారు. పాత పోలవరంలో నీట మునిగిన ఇల్లు, పాఠశాలలు, ఆలయాలు, పురిగుడిసెలను అబ్జర్వ్ చేశారు.
గత ప్రభుత్వం చేసిన తప్పిదాలు ఎత్తి చూపి.. జగన్ ప్రభుత్వం తప్పించుకుంటుందని సోము వీర్రాజు ఆరోపించారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి ఏడాది గడిచినా ముంపు ప్రాంత ప్రజలకోసం ఎందుకు ముందస్తు చర్యలు చేపట్టలేదని ప్రశ్నించారు. కాపర్ డాం ఎత్తు పెంచడం వల్లే లంక గ్రామాలకు వరద నీరు చేరిందన్నారు. తూర్పుగోదావరి జిల్లా దేవిపట్నం మండలంలో 23 లక్షల క్యూసెక్కుల నీరు ఎక్కువగా చేరిందని పేర్కొన్నారు.
ముంపు ప్రాంత ప్రజలకు తక్షణ సాయం రూ. 5 వేలు అందేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వారికి రూ. 5 వేలు అందజేస్తామని ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. దేవీపట్నం మండలం, పోలవరంలో 19 గిరిజన గ్రామాలు నీట మునిగాయని వీర్రాజు పేర్కొన్నారు. ఆర్ఆర్ ప్యాకేజీ ఎందుకు అందజేయలేదు అని వీర్రాజు మండిపడ్డారు. సమీక్షలతో ప్రభుత్వం కాలం వెళ్లదీస్తుందని.. ప్రజలను మాత్రం పట్టించుకోవడం లేదన్నారు.