రాజధాని మూడు చోట్లేనా ? ఐదు చోట్ల పెట్టండి : టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు ఎద్దేవా
ఏపీ శాసనసభ సమావేశాల చివరి రోజు రాజధాని అంశంపై ఏపీ అసెంబ్లీ లో జరిగిన చర్చలో సీఎం జగన్ మోహన్ రెడ్డి సూచనప్రాయంగా ఆంధ్రప్రదేశ్ మూడు రాజధానులు ఉంటె బాగుంటుంది అని చేసిన ప్రకటనపై దుమారం కొనసాగుతుంది. రాజధాని అమరావతి రైతుల నుండి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతుంది. నేడు రాజధానిలోని 29 గ్రామాల్లో బంద్ కొనసాగుతుంది. ఇక మరోపక్క ఏపీలోని ప్రతిపక్ష టీడీపీ జగన్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. ఏపీకి మూడు రాజధానులు అంటూ ముఖ్యమంత్రి జగన్ చేసిన వ్యాఖ్యలు అనాలోచిత వ్యాఖ్యలని టీడీపీ మండిపడుతోంది.
అమరావతిలో అసైన్డ్ భూమికి బదులుగా ఇచ్చిన ప్లాట్లు రద్దు... షాక్ ఇచ్చిన వైసీపీ సర్కార్
అయితే తాజాగా ఈ దుమారానికి చెక్ పెట్టాలనే ఉద్దేశంతో ఏపీ మంత్రి బుగ్గన సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు రాజధాని విషయంలో ఆయన అభిప్రాయం మాత్రమే అని పేర్కొన్నారు. 'సీఎం ప్రకటన చేయలేదు, రాజధాని అలా ఉండచ్చు అన్నారు' అని మంత్రులు అంటున్నారని, వైసీపీ మంత్రుల వ్యాఖ్యలపై టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. . నేడు ఆయన మీడియాతో మాట్లాడారు. రాజధాని మూడు చోట్ల ఎందుకు..? ఐదు చోట్ల పెట్టండి అంటూ ఎద్దేవా చేశారు. సీఎం జగన్ అనాలోచిత నిర్ణయాలు తీసుకుంటున్నారని మండిపడ్డారు.
ఏదైనా విషయాన్ని పక్కదారి పట్టించాలంటే అది వైసీపీ నేతలకే చెల్లుబాటు అవుతుందని ఆయన ఆరోపించారు. ఆత్మకూరును పక్కదారి పట్టించడానికి చంద్రబాబు ఇంటిని వైసీపీ ప్రభుత్వం టార్గెట్ చేసిందని అశోక్ బాబు ఆరోపించారు. ఇప్పుడు ప్రత్యేకహోదా తీసుకు రాలేక, ప్రజల నుండి ఎక్కడ వ్యతిరేకత వస్తుందో అని భయపడి రాజధాని వికేంద్రీకరణ అంటున్నారని అశోక్బాబు విమర్శించారు. తెలంగాణ నుంచి ఏపీ ఆస్తులు తేలేక, ఇలాంటి పనులు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు . సీఎం జగన్ ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని అశోక్ బాబు పేర్కొన్నారు.