రంగా, రామజోగయ్య పుస్తకం: బాబు మాస్టర్ మైండ్, పవన్ కళ్యాణ్తో అన్నింటికీ చెక్?
అమరావతి: జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురువారం నాడు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును కలిసి, ఆ తర్వాత విలేకరుల సమావేశంలో ఆయనకు అనుకూలంగా మాట్లాడారు. ఇది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. దీనిపై భిన్న కథనాలు వినిపిస్తున్నాయి.
హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లిన పవన్ కళ్యాణ్... సీఎం క్యాంప్ కార్యాలయంలో చంద్రబాబుతో రెండు గంటలకు పైగా సుదీర్ఘంగా భేటీ అయ్యారు. ఈ భేటీలో రైతు సమస్యలు, భూసమీకరణ, బాక్సైట్ తవ్వకాలు, ఏపీకి ప్రత్యేక హోదా తదితర అంశాలపై చర్చించినట్లు పవన్ కళ్యాణ్ తెలిపారు.
అదే సమయంలో, చంద్రబాబు సమస్యల పట్ల సానుకూలంగా ఉన్నారని పవన్ కళ్యాణ్ కితాబిచ్చారు. ఇది ఇప్పుడు చర్చనీయాంశమైంది. మరో విషయమేమంటే, ఇటీవలి పరిణామాల నేపథ్యంలో పవన్ కళ్యాణ్తో భేటీకి చంద్రబాబు చొరవ తీసుకున్నారనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి.
పవన్ కళ్యాణ్తో భేటీ ద్వారా చంద్రబాబు ఒక్క దెబ్బకు రెండు పిట్టలు కొట్టినట్లుగా పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇటీవలి పరిణామాలు తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబుకు మింగుడు పడకుండా ఉన్నాయని, ఇప్పుడు పవన్ కళ్యాణ్తో భేటీ చంద్రబాబుకు ఒకింత ఊరట కలిగించే విషయమంటున్నారు.
హరిరామ జోగయ్య పుస్తకం, ముద్రగడ హెచ్చరిక
కొద్ది రోజుల క్రితం హరిరామ జోగయ్య ఓ పుస్తకాన్ని విడుదల చేశారు. అందులో సంచలనాలు రాశారు. వంగవీటి రంగా హత్య కేసులో చంద్రబాబు హస్తం ఉందనే అభిప్రాయం ఆయన వ్యక్తం చేశారు. దీంతో, మిత్రపక్షం బిజెపి, విపక్షాలు చంద్రబాబును టార్గెట్ చేశాయి.
హరిరామ జోగయ్య పుస్తకం నేపథ్యంలో చంద్రబాబు తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాలని పలువురు డిమాండ్ చేశారు. తద్వారా, 2014లో ఎన్నికల్లో టిడిపి - బిజెపికి మద్దతు పలికిన కాపు వర్గాలను దూరం చేసే ప్రయత్నాలు జరిగాయంటున్నారు.
ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్తో భేటీకి చంద్రబాబు చొరవ తీసుకొని ఉంటారని అంటున్నారు. కాపులను బిసిలలో చేర్చే అంశం విషయంలోను చంద్రబాబును కార్నర్ చేసే ప్రయత్నం చేశారు. కాపులను బిసిల్లో చేర్చకుంటే ఉద్యమిస్తామని ముద్రగడ పద్మనాభం హెచ్చరించారు.
అదే సమయంలో ఏపీ రాజధాని అమరావతి శంకుస్థాపనకు పవన్ దూరంగా ఉన్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ సీఎంను కలవడం ద్వారా... ఆయన తమకు మద్దతుగా ఉన్నారనే విషయాన్ని ఆ సామాజిక వర్గానికి, ఆయన అభిమానులకు చెప్పినట్లయిందని టిడిపి భావిస్తుందని చెబుతున్నారు.
బిజెపికి షాక్
ఇన్నాళ్లు పవన్ కళ్యాణ్... టిడిపి కంటే బిజెపికి దగ్గర అనే అభిప్రాయం ఉంది. చంద్రబాబుతో భేటీ అనంతరం పవన్ వ్యాఖ్యల ద్వారా... ఆయన టిడిపికి దూరం కాదని చెప్పినట్లయిందని అంటున్నారు. పరోక్షంగా, ప్రత్యక్షంగా పురంధేశ్వరి, సోము వీర్రాజు, కన్నా లక్ష్మీనారాయణ తదితరులు చంద్రబాబు ప్రభుత్వంపై మండిపడుతున్నారు. వారికీ కౌంటర్ ఇచ్చినట్లయింది అంటున్నారు.
చంద్రబాబు, పవన్ కళ్యాణ్ భేటీలో మంత్రి కామినేని శ్రీనివాస రావు మధ్యవర్తిత్వం వహించినట్లుగా వార్తలు వచ్చాయి. విమానంలో పవన్ కళ్యాణ్కు మంత్రి కామినేని పూర్తి వివరాలు చెప్పినట్లుగా తెలుస్తోంది. చంద్రబాబుకు పవన్ మంచి మార్కులు వేయడం, బిజెపిని ప్రశ్నించడం చర్చనీయాంశమైంది.
మొత్తంగా, హరిరామ జోగయ్య పుస్తకం, ముద్రగడ హెచ్చరిక, బిజెపి నేతలు ఇరుకున పెట్టే పరిస్థితి, అమరావతికి హాజరు కాకపోవడం ద్వారా పవన్ కళ్యాణ్ టిడిపికి దూరమయ్యారనే ఊహాగానాలు... వీటన్నింటికి, చంద్రబాబు తన మాస్టర్ మైండ్ ద్వారా చెక్ పెట్టినట్లయిందని అంటున్నారు.