పవన్ చెప్పింది నిజమే, జగన్ కాపాడుకోలేకపోయారు! పిచ్చివాడిలా ఉన్నావ్: అంబటి
విజయవాడ: వర్షాకాలం సమయంలో పుట్టగొడుగుల్లా పుట్టుకు వచ్చే పార్టీ వంటిదే పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన అని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ఆదివారం విజయవాడలో మండిపడ్డారు.
తెలంగాణ నుంచి హామీ ఇస్తున్నా!: ఏపీకి ప్రత్యేకహోదాపై సోనియా గాంధీ ప్రకటన
ఎన్నికల ముందు వస్తుందని, ఆర్భాటం చేస్తుందని, ఆ తర్వాత కనుమరుగు అవుతుందని ఎద్దేవా చేశారు. ఈ మధ్య చంద్రబాబును వదిలేసి జగన్ పైన విమర్శలు చేయడం ఏమిటన్నారు. తమ ఎమ్మెల్యేల్ని టీడీపీ ఎత్తుకుపోతే జగన్ శాసన సభ్యులను కాపాడుకోలేకపోయారని పవన్ చెప్పారని, అది నిజమేనని, కానీ చంద్రబాబును ఎందుకు నిలదీయడం లేదన్నారు.
మీకు పరీక్ష సమయం వస్తే పారిపోయారు
ప్రతి మనిషికి, ప్రతి పార్టీకి కొన్ని పరీక్ష సమయాలు వస్తాయని అంబటి చెప్పారు. తమకు ఎన్నో పరీక్షా సమయాలు వచ్చాయని చెప్పారు. చంద్రబాబు, సోనియా కలిసి తమకు ఎన్నో పరీక్షలు పెట్టారన్నారు. జగన్ పైన ఎన్నో కేసులు పెట్టి, 16 నెలలు జైల్లో పెట్టారని, అలాంటి జగన్ పిరికివాడా అన్నారు. మీకు పరీక్షా సమయం వచ్చినప్పుడు ఏం చేశారో చెప్పాలన్నారు. 2009లో చిరంజీవి పార్టీ పెట్టినప్పుడు, 18 మంది ఎమ్మెల్యేలు గెలిచారని, అప్పుడు మీకు పరీక్షా సమయం వచ్చిందని, ఆ సమయంలో మీరేం చేశారని, పార్టీని ముందుకు తీసుకెళ్లారా అని ప్రశ్నించారు. అప్పుడు మీరు పారిపోయారన్నారు. అప్పుడప్పుడు వైయస్ రాజశేఖర రెడ్డిని కూడా పవన్ విమర్శిస్తున్నారని, ఆయనను విమర్శించే అర్హత లేదన్నారు. మీకు అలాంటి నైతిక స్థాయి, నైతిక ధైర్యం లేదన్నారు.
నీదో పుట్టగొడుగు పార్టీ... పవన్కు హెచ్చరిక
జగన్ను, వైయస్ను విమర్శిస్తే మేం చేతులు కట్టుకొని కూర్చోవడానికి సిద్ధంగా లేమని పవన్కు అంబటి హెచ్చరికలు జారీ చేశారు. వైయస్ గురించి మాట్లాడితే మీ వారసత్వం గురించి మాట్లాడుతామని చెప్పారు. మీ వారసత్వం ఎక్కడి నుంచి వచ్చింది, మీరు ఎలా పెరిగారు, మీ రాజకీయ పార్టీ ఎలాంటిది అని నిలదీశారు. వర్షాకాలం వచ్చినప్పుడు కొన్ని పిచ్చిమొక్కలు మొలుస్తాయని, అద్భుతంగా కనిపిస్తాయని, పోటో తీస్తే బాగా కనిపిస్తాయని, కానీ వర్షాకాలం తగ్గగానే అవి మాడిపోతాయని, అలాంటి పుట్టగొడుగు వంటి పార్టీ జనసేన అన్నారు.
పవన్.. సరే, నీవు చెప్పింది నిజమే కానీ
అప్పుడప్పుడు పవన్ కళ్యాణ్ ఊగిపోతున్నారని, కాళ్లు విరగ్గొడతానని చెబుతున్నారని, ఇవేం మాటలని అంబటి ప్రశ్నించారు. కాళ్లు విరగ్గొట్టి మూలన కూర్చోబెట్టడానికి పార్టీలకు ఎక్కడ హక్కు ఉందని అడిగారు. తమది పోరాడుతున్న పార్టీ అన్నారు. 23 మంది ఎమ్మెల్యేల్ని ఎత్తుకెళ్లారని చెప్పారు. ఎమ్మెల్యేలను కాపాడుకోలేదని జగన్ చెబుతున్నారని, అది నిజమేనని అన్నారు. అవతల చంద్రబాబు వందలు, వేల కోట్లు ఖర్చు పెట్టి తమ ఎమ్మెల్యేలను కొనుక్కు వెళ్తే ఎందుకు నిలదీయలేదన్నారు.
నీవు కాపాడలేని 60 మందిన మా చెట్టు కిందకు వచ్చారు
ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు నీవు యువరాజ్యం అధ్యక్షుడిగా ఉన్నారని, అప్పుడు నీ పార్టీలో ఉన్న నేతలు ఏ పార్టీలో ఉన్నారో చెప్పాలని అంబటి నిలదీశారు. పోసాని, వెల్లంపల్లి శ్రీనివాస్, వంగవీటి రాధా.. ఇలా దాదాపు 50 నుంచి 60 మంది మీ పార్టీని నమ్ముకొని, మీ పార్టీ నుంచి నాడు పోటీ చేసి, ఆ తర్వాత గత్యంతరం లేక మా చెట్టు కిందకు వచ్చారని, అప్పుడు మీరు వారిని కాపాడుకున్నారా, వారిని నిలుపుకున్నారా అని నిలదీశారు. మాకు సుద్దులు చెబుతారా అన్నారు. మాకు సుద్దులు చెప్పే హక్కు లేదన్నారు.
పవన్.. పిచ్చివాడిలా ఉన్నావ్
పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి గురించి మాట్లాడకుండా జగన్ గురించి మాట్లాడుతున్నారని అంబటి మండిపడ్డారు. నాకు ఒక్క ఎమ్మెల్యే ఉన్నా నేను పోరాడేవాడినని పవన్ చెబుతున్నారని, కానీ అలాంటి అవకాశం నీకు భవిష్యత్తులోను రాదని జోస్యం చెప్పారు. మేం అసెంబ్లీ నుంచి పిరికివాళ్లలా పారిపోలేదని, బహిష్కరించి వచ్చామని చెప్పారు. పవన్.. నీవు పిచ్చివాడిలా ఉన్నావు.. మాకు భయం ఏమిటన్నారు. ధైర్యమే మా ఆయుధం అన్నారు. ఇలా జగన్ను అంటే చంద్రబాబును రక్షించేందుకు పుట్టిన కవలపిల్లల్లో మీరు ఒకరని భావించవలసి ఉంటుందని పవన్కు చెప్పారు. ధైర్యంగా పోరాడండి తప్పు లేదని, కానీ తమను అనవద్దన్నారు. టీడీపీ పనిముట్టులా మారితే మిమ్మల్ని ప్రజలు క్షమించరన్నారు. 2014లో చంద్రబాబుకు మద్దతిచ్చి, మమ్మల్ని ఓడించారని, ఇప్పుడు మళ్లీ బయటి నుంచి టీడీపీకి మద్దతిస్తారా అని నిలదీశారు. ఓసారి ఆత్మవిమర్శ చేసుకోవాలన్నారు. ప్రజాస్వామ్యంలో మీరు నడిచే నడక మంచిది కాదన్నారు.