మోడీని నిలదీయడానికి పవన్-జగన్ ఎందుకు భయపడుతున్నారు: గల్లా జయదేవ్
అమరావతి: ఆంధ్రప్రదేశ్కు కేంద్రం ఏమీ ఇవ్వకుండానే అన్నీ చేశామని చెబుతోందని టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ అన్నారు. మహానాడు వేదికపై గల్లా మాట్లాడారు. బీజేపీ నేతల మాటలను ప్రజలు ఏమాత్రం నమ్మేస్థితిలో లేరన్నారు. ప్రధాని నరేంద్ర మోడీని, బీజేపీని నిలదీయడానికి వైసీపీ అధినేత వైయస్ జగన్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్లకు ఎందుకు అంత భయమన్నారు.
బీజేపీకి కుట్ర రాజకీయాలు ఇవి కొత్తేమీ కాదన్నారు. ఏపీలో బీజేపీ కుట్ర రాజకీయాలను చంద్రబాబు తిప్పికొడుతున్నారని చెప్పారు. అన్ని రాష్ట్రాలలో అధికారం కోసం బీజేపీ కుట్రలు చేస్తోందని మండిపడ్డారు.
వైసీపీ ఎంపీల రాజీనామాలు అన్నీ డ్రామా అని అశోక్ గజపతి రాజు అన్నారు. వైసీపీ ఎంపీల రాజీనామాల్లో చిత్తశుద్ధిలేదని చెప్పారు. జాతీయ రాజకీయాల్లో టీడీపీ పాత్రపై ఆయన మహానాడులో తీర్మానం ప్రవేశ పెట్టి మాట్లాడారు.
జాతీయ రాజకీయంలో టీడీపీ పాత్ర అంటే ఎన్టీఆర్ గుర్తుకు వస్తారన్నారు. ఒక ఫెడరల్ స్ట్రక్చక్ కోసం ఆయన ఎంతో కృషి చేశారన్నారు. ఎన్ని ఒత్తిడిలు వచ్చినా తట్టుకున్నారని కొనియాడారు. ఆనాడు ఆయనొక పిలుపు ఇస్తే 105 మంది ఎంపీలు రాజీనామా చేశారన్నారు.
ఇప్పుడు రాజీనామా పేర్లు ఉన్న నటులను చూస్తే చాలా తేడా ఉందని వైసీపీ ఎంపీలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. పార్లమెంట్ సమావేశాలు ముగిసిన వెంటనే రాజీనామాలు ఇచ్చారని, ఇంతవరకు వారి రాజీనామాలు ఆమోదించిన దాఖలాలు లేవన్నారు.