రోహిత్ ఆత్మహత్యపై ప్రశ్నలు: తండ్రీ సీన్లోకి ఎందుకొచ్చాడు, తల్లి ఏమంటోంది?
హైదరాబాద్: ఆత్మహత్య చేసుకున్న హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం విద్యార్తి వేముల రోహిత్ కులాన్ని వివాదంగా మార్చి అసలు విషయాన్ని పక్క దోవ పట్టించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయనే విమర్శలు వస్తున్నాయి. రోహిత్ దళితుడు కాదు, వడ్డెర కులానికి చెందినవాడని, అది బీసీ కిందికి వస్తుందని వాదిస్తున్నారు. రోహిత్ ఆత్మహత్య ఘటన, దానికి దారి తీసిన పరిణామాలను పక్క దారి పట్టించడానికే ఆ విధమైన వాదనలు ముందుకు వస్తున్నాయని అంటున్నారు.
అందుకే, ప్రొఫెసర్ కంచె ఐలయ్య రోహిత్ తండ్రి ఎక్కడి నుంచి వచ్చాడని అడిగారు. అంతేకాకుండా సూసైడ్ నోట్లో రోహిత్ తండ్రి గురించి ఎక్కడా ప్రస్తావించలేదని ఆయన అన్నారు. రోహిత్ ప్రస్తావించని తండ్రిని ఈ ప్రభుత్వాలు ఎక్కడి నుంచి సృష్టించాయని ఆయన ప్రశ్నించారు. రోహిత్ దళితుడు అనడానికి అతని మాటలు, జీవనమే సాక్ష్యాలని కంచె ఐలయ్య అన్నారు. రోహిత్ దళితుడు కాదనడానికి తండ్రితోసహా మరేవి సాక్ష్యాలు కావని ఆయన అన్నారు.
రోహిత్ మరణించిన కొద్ది రోజులకు అకస్మాత్తుగా తండ్రితో మాట్లాడించారు. తాము కలిసే ఉన్నామని ఆయన చెప్పాడు. కావాలనే రోహిత్ తండ్రిని సీన్లోకి తెచ్చారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తమ కుటుంబం అంతా కలిసే ఉందని ఆయన చెప్పారు. రోహిత్తో తాను మాట్లాడక ఎనిమిది నెలలు అవుతోందని చెప్పారు. విశ్వవిద్యాలయానికి సంబంధించిన విషయాలు తనకు ఎప్పుడూ తనతో చెప్పేవాడు కాదన్నారు. అమ్మ, అమ్మమ్మలతోనే చర్చించేవాడని చెప్పారు.
కలిసే ఉంటున్నామని రోహిత్ తండ్రి మాటల్లో ఏ మాత్రం నిజం ఉందనేది ప్రశ్నార్థకమే. రోహిత్ కుల వివాదంపై వివాదం ప్రారంభమైనప్పుడే మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ స్పష్టంగా చెప్పారు. రోహిత్ తమ ప్రాంతానికి చెందినవాడని, తల్లి మాల కులానికి చెందినవారని, వడ్డెర కులస్థుడిని పెళ్లి చేసుకున్నారని, అయితే వారు విడిపోయారని ఆయన స్పష్టంగా చెప్పారు.
మాణిక్య వరప్రసాద్ చెప్పిన తర్వాత కూడా రోహిత్ తండ్రిని ముందుకు తెచ్చి వివాదాన్ని రాజేయడానికి ప్రయత్నించారు. వివాదం రేగుతున్న స్థితిలో రోహిత్ తల్లి వేముల రాధిక దానిపై స్పష్టత ఇచ్చారు. తాను వడ్డెర కులానికి చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకున్నానని, అయితే మూడో బిడ్డ పుట్టిన తర్వాత విడాకులు తీసుకున్నామని ఆయన చెప్పారు. తాను మాల కులంలో జన్మించానని స్పష్టం చేశారు. తన కులం గురించి ఇప్పుడు ఎందుకు అడుగుతున్నారని ఆమె ప్రశ్నించారు.
పైగా, తాము ఇంటికి వచ్చి మాట్లాడుతామని విశ్వవిద్యాలయం అధికారులు రాధిక కుటుంబ సభ్యులకు చెబుతున్నారు. వీసీ పొదిలె అప్పారావు కూడా ఇంటికి వచ్చి ఆమెతో మాట్లాడడానికి ప్రయత్నించారు. అయితే, అందుకు రాధిక అంగీకరించడం లేదు. ఏదో విధంగా రోహిత్ ఆత్మహత్య ఘటనను మసి పూసి మారేడు కాయ చేయాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయని హెచ్సియు విద్యార్థులు అంటున్నారు.
ఐదుగురు విద్యార్తుల పట్ల యూనివర్శిటీ యాజమాన్యం సున్నితంగా వ్యవహరించడంలో విఫలమైందని విచారణ సంఘం కూడా అభిప్రాయపడింది. రోహిత్ తాను ఆత్మహత్య చేసుకుంటానని వీసికి లేఖ రాసినప్పుడే స్పందించి ఉంటే ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదని అంటున్నారు. ఆ లేఖ విషయాన్ని తనకు తెలిపి ఉంటే రోహిత్ ఆత్మహత్య జరిగి ఉండేది కాదని హెల్త్ సెంటర్ అధికారి కూడా చెబుతున్నారు.
మొత్తం మీద, ఐదుగురు విద్యార్థులను సస్పెండ్ చేయడం దగ్గరి నుంచి సమస్యను యూనివర్శిటీ అధికారులు సరైన రీతిలో పరిష్కరించలేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. దళితుల పట్ల సాధారణంగానే వివక్ష కొనసాగుతోందనే అబిప్రాయం కూడా బలంగా ఉంది. మొత్తంగా, పరిస్థితి యూనివర్సిటీ యాజమాన్యం చేయి దాటిపోయినట్లు కనిపిస్తోంది.