జగన్పై దాడి ఆరోజే ఎందుకు?: మూడు నెలలుగా విశాఖ నుంచే, ఐనా ఎన్నడూ కలవని శ్రీనివాస్.!
Recommended Video
అమరావతి/విశాఖపట్నం: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డిపై యత్నంపై అనేక అనుమానాలు కొనసాగుతూనే ఉన్నాయి. నిందితుడు శ్రీనివాస్ జగన్ అభిమానే అయితే ఆయనపై దాడి ఎందుకు చేస్తారని వైసీపీ వర్గాలు ప్రశ్నిస్తుండగా.. టీడీపీ మాత్రం నిందితుడు సానుభూతి కోసమే దాడి చేశాడంటూ ఆరోపిస్తున్నారు.
ఆ రోజే ఎందుకు?
కాగా, జగన్మోహన్ రెడ్డిపై హత్యాయత్నం కుట్ర విశాఖ ఎయిర్పోర్ట్లోని ఫ్యూజన్ఫుడ్స్ రెస్టారెంట్ కేంద్రంగానే జరిగిందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జగన్ అభిమానినని చెప్పుకుంటున్న నిందితుడు ఆ రోజే ఎందుకు తెగబడ్డాడనే విషయంపై దర్యాప్తు బృందాలు ప్రధానంగా దృష్టి సారించినట్లు సమాచారం.
జగన్పై దాడి: రాత్రి వరకు విచారణ, శ్రీనివాస్కి 6రోజుల కస్టడీ, ‘చికెన్ బిర్యానీ తెప్పించుకుని..'
గతంలో ఎప్పుడూ జగన్ని కలవని శ్రీనివాస్..
తాను వైయస్ జగన్ వీరాభిమానినని, ఆయనంటే చాలా ఇష్టమని, ఇదే విషయం లేఖలో స్పష్టంగా రాశానని చెప్పుకొస్తున్న నిందితుడు శ్రీనివాసరావు.. ఎయిర్పోర్ట్లోని వీవీఐపీ లాంజ్ పక్కనే ఉన్న ఫ్యూజన్ ఫుడ్స్ రెస్టారెంట్లో ఎనిమిది నెలలుగా పని చేస్తున్నాడని పోలీసులు చెబుతున్నారు. మరి మూడు నెలల కాలంలో జగన్ చాలా సార్లు ఎయిర్పోర్ట్కు వెళ్తే ఏ సందర్భంలోనూ ఆయనతో ఫొటో కోసం గానీ, ఆటో గ్రాఫ్ కోసం గానీ, కనీసం చూసేందుకు గానీ వచ్చిన దాఖలాల్లేకపోవడం గమనార్హం.
కుట్ర పూరితంగానేనా.?
అయితే, సరిగ్గా హత్యాయత్నానికి తెగబడిన అక్టోబర్ 25నే తొలిసారి సెల్ఫీ పేరిట రావడం అనుమానాలకు తావిస్తోంది. అంతకు ముందు వైయస్ జగన్కు పార్టీ నేత ఇంటి నుంచి కాఫీ వస్తుంటే.. అలా తీసుకురావడానికి వీల్లేదంటూ.. శ్రీనివాసరావు పనిచేస్తున్న ఫ్యూజన్ఫుడ్స్ రెస్టారెంట్ నుంచే సర్వ్ చేయించడం చూస్తుంటే పక్కాగా వ్యూహం ప్రకారం రెస్టారెంట్ కేంద్రంగానే కుట్ర జరిగిందా? అనే అనుమానం కలగకమానదని విశ్లేషకులు పేర్కొంటున్నారు.
మూడు నెలలుగా విశాఖ నుంచే జగన్..
వైయస్ జగన్మోహన్రెడ్డి ఆగస్టు నుంచి దాదాపు వారంలో రెండుసార్లు విశాఖ ఎయిర్పోర్ట్కు వస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో ప్రజా సంకల్ప యాత్ర ముగింపు దశ మొదలు.. విశాఖ జిల్లాలో యాత్ర కొనసాగినప్పుడు, ప్రస్తుతం విజయనగరంలో యాత్ర కొనసాగిస్తున్న నేపథ్యంలో దాదాపు ప్రతి వారం హైదరాబాద్ వెళ్లి వచ్చారు. గురువారం విశాఖ నుంచి హైదరాబాద్కు వెళ్లి, శుక్రవారం తిరిగి వస్తారు. సుమారుగా మూడు నెలల కాలంలో 20 సార్లకు పైగా ఆయన ఈ ఎయిర్పోర్ట్ ద్వారా వెళ్లి వచ్చారు. హైదరాబాద్ నుంచి వచ్చేటప్పుడు విమానాశ్రయంలో ఎక్కడా ఆగకుండా నేరుగా పాద్రయాత్ర జరిగే ప్రాంతంలోని శిబిరం వద్దకు చేరుకుంటారు.
దాడికి విమానాశ్రయాన్నే ఎన్నుకున్నారా?
కాగా, హైదరాబాద్ వెళ్లేటప్పుడు మాత్రం కొంచెం సమయం ఉంటుంది (చెక్ ఇన్ కోసం కనీస నిర్ణీత సమయంలోగా వెళ్లాలి) కాబట్టి ఎయిర్పోర్ట్లోని వీవీఐపీ లాంజ్లో వేచి ఉంటారు జగన్. బోర్డింగ్ తర్వాత విమానం వద్దకు వెళ్తారు. జగన్ ఎయిర్పోర్టుకెళ్లిన సందర్భాల్లో అక్కడి ఉద్యోగులు, ప్రయాణీకులు, అభిమానులు.. ఎవరు సెల్ఫీ అడిగినా కాదనకుండా వారితో ఫొటో దిగుతుంటారు. ఈ దృష్ట్యా జగన్పై హత్యకు కుట్ర పన్నిన వారు ఎయిర్పోర్ట్నే దాడికి సరైన ప్రాంతంగా ఎంచుకున్నట్లు అనుమానాలు కలుగుతున్నాయి.