నంద్యాల, కాకినాడలో టిడిపి గెలిస్తే ఉద్యమాన్ని ఆపేయాలా?: ముద్రగడ
కిర్లంపూడి: 2018లోనే ఎన్నికలు వస్తే బాగుంటుందని, అప్పుడు 13 జిల్లాల్లోని కాపు జాతి సత్తా ఏంటో చూపుతారని కాపు రిజర్వేషన్ పోరాట సమితి నేత ముద్రగడ పద్మనాభం అన్నారు.నంద్యాల, కాకినాడలో జరిగిన ఎన్నికల్లో టీడీపీ గెలిచినంత మాత్రాన కాపు ఉద్యమాన్ని ఆపేయాలా? అని కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ప్రశ్నించారు.
ఈ గెలుపును పండగ చేసుకోవాలని చంద్రబాబు పిలుపునివ్వడాన్ని ముద్రగడ తప్పుబట్టారు. ఈ మేరకు సోమవారంనాడు కిర్లంపూడిలోని తన ఇంట్లో ముద్రగడ మీడియాతో మాట్లాడారు.
ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన పలు ఎన్నికల్లో టీడీపీకి డిపాజిట్లు కూడా రాలేదని, అప్పుడు పార్టీని గంగలో కలిపేయ లేదు కదా? అని విమర్శించారు.
అలాంటప్పుడు ఎన్నికల్లో టీడీపీ గెలిచినంత మాత్రాన కాపు ఉద్యమం ఆపేయాలా? అని ప్రశ్నించారు. పవన్ కల్యాణ్ చెప్పిన ప్రకారం చంద్రబాబు కాపు రిజర్వేషన్లకు పట్టం కట్టాలన్నారు.
తాను జగన్కు అమ్ముడు పోయానని ఆరోపించడం దారుణమని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వంగవీటి రంగాను అవమానించడం సరికాదని ముద్రగడ అన్నారు. ''ఆ రోజు ఆయనయ్యాడు.. రేపు నేనవుతాను.. చనిపోయిన వ్యక్తి మీద రాళ్లు వేయడం, అభాండాలు మోపడం సరికాదు'' ముద్రగడ అభిప్రాయపడ్డారు.