"ఆది దమ్ముంటే ఆ పని చెయ్.. లోకేష్ తప్పుల్లేకుండా ఇది చెప్పు చూద్దాం"
ఆదినారాయణరెడ్డి నువ్వెప్పుడు రాజీనామా చేశావని జోగి రమేష్ సూటిగా ప్రశ్నించారు.
విజయవాడ: పార్టీ మారిన సమయంలోనే తాను రాజీనామా చేశానని, స్పీకర్ తన రాజీనామాను ఆమోదించకపోతే తానేం చేయగలనని మంత్రి ఆదినారాయణరెడ్డి మంగళవారం వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.
రాజీనామా ఆమోదిస్తే నేనెంటో చూపిస్తా: జగన్ పాదయాత్రపై ఆది సంచలనం
ఈ నేపథ్యంలో మంత్రి వ్యాఖ్యలకు వైసీపీ నేత జోగి రమేష్ కౌంటర్ ఇచ్చారు. ఆదినారాయణరెడ్డి తల్లిపాలు తాగి రొమ్ము గుద్దే ప్రబుద్ధుడు అని ఆయన విరుచుకుపడ్డారు. ఆదినారాయణరెడ్డి నువ్వెప్పుడు రాజీనామా చేశావని సూటిగా ప్రశ్నించారు. ఆ రాజీనామా లేఖను స్పీకర్కు ఎప్పుడిచ్చావ్?, రాజీనామా లేఖ ఇస్తే స్పీకర్ ఎందుకు ఆమోదించలేదు? అంటూ నిలదీశారు.
దమ్ముంటే ఆ పని చెయ్యి:
నీకు నిజంగా దమ్ము, ధైర్యముంటే రాజీనామా ఆమోదింపచేసుకుని ఎన్నికలకు రావాలని ఆదినారాయణ రెడ్డికి జోగి రమేష్ సవాల్ విసిరారు. ఇక జగన్ పాదయాత్రపై టీడీపీ విమర్శలను కూడా ఆయన తప్పుపట్టారు. జగన్ పాదయాత్రపై మంత్రులు అడ్డగోలుగా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు.
చంద్రబాబు 420
జగన్ పాదయాత్ర చేస్తే అంతలా ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. రాష్ట్రంలో '420' పేరు వినగానే ఎవరికైనా చంద్రబాబు పేరే గుర్తొస్తుందని ఎద్దేవా చేశారు. అలాగే జగన్ ను విమర్శిస్తున్న మంత్రి లోకేష్ పై తీవ్ర వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు.
లోకేష్ తప్పులు లేకుండా ఇది చెప్పు?
విశ్వ విఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారకరామరావు అని తప్పులు లేకుండా పలకలవా లోకేష్.. అంటూ జోగి రమేష్ ఎద్దేవా చేశారు. ఏబీసీడీలు కూడా రాని లోకేష్ జగన్ను విమర్శించడమా? అని మండిపడ్డారు. మంత్రులు నోరు అదుపులో పెట్టుకోవాలని సూచించారు.
దేవినేని.. టైం, ప్లేస్ చెప్పు..
మంత్రి దేవినేని ఉమకు బహిరంగ లేఖ రాస్తున్నాని జోగి రమేష్ చెప్పారు. తనపై చేసిన ఆరోపణలను నిరూపించాలని సవాల్ చేశారు. డేట్, టైమ్, ప్లేస్ చెబితే చర్చకు సిద్దమని ప్రకటించారు. 24గం.ల్లో తన సవాల్ పై స్పందించకపోతే బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తన లేఖను ఇరిగేషన్ కార్యాలయానికి, దేవినేని ఇంటికి పంపుతున్నట్టు తెలిపారు.