10 కార్లలో ఎందుకు..?, పిల్లలు, వృద్ధులకు ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యులు, చంద్రబాబుపై బొత్స ఫైర్
టీడీపీ నేతల తీరుపై మంత్రి బొత్స సత్యనారాయణ విరుచుకుపడ్డారు. బుద్దా వెంకన్న, బోండా ఉమ.. పల్నాడు, మాచర్ల ఎందుకు వెళ్లాల్సి వచ్చిందని ప్రశ్నించారు. నామినేషన్ ప్రక్రియ పరిశీలించేందుకు చెరో కారు తీసుకెళ్లాలి.. కానీ 10 కార్లతో వెళ్లి ఏం చేద్దామనుకొన్నారని ప్రశ్నించారు. మీ రౌడీలతో దాదాగిరి చేద్దామనుకొన్నారా అని బొత్స సత్యనారాయణ సూటిగా ప్రశ్నించారు. వీరి కాన్వాయ్ స్పీడ్కు అక్కడున్న పిల్లలు, వృద్ధలు భయపడ్డారని బొత్స వివరించారు.
సీబీఐ-సీఐడీ వయా సిట్.. ఇన్సైడర్ ట్రేడింగ్పై టీడీపీది పూటకోమాట, ఈఎస్ఐ స్కాంపై కూడా: మంత్రి బొత్స
రాజకీయం తగదు..
చంద్రబాబు నాయుడుకు రాజకీయాలు చేయడం అలావాటైపోయిందని బొత్స సత్యనారాయణ విమర్శించారు. బోండా ఉమా, బుద్దా వెంకన్నను మంది మార్బలంతో మాచర్లకు ఎందుకు పంపించారని సూటిగా ప్రశ్నించారు. వారి కార్ల అతివేగంతో ఎవరికైనా ప్రమాదం జరిగితే ఎవరూ బాధ్యులు అని ప్రశ్నించారు. మీ కాన్వాయ్ వస్తుందని వీధుల్లో పిల్లలు, పెద్దలు తిరగొద్దా అని దుయ్యబట్టారు. కారు వేగంతో ప్రమాదం జరిగితే.. పరిస్థితి ఏంటీ అని నిలదీశారు.
నీతిగా, నిజాయితీగా..
చంద్రబాబు నాయుడు ఇదివరకు నీతిగా, సాంప్రదాయంగా పనిచేస్తే ఆరోపిస్తే బాగుండేదని బొత్స సత్యనారాయణ అన్నారు. పార్టీ అధ్యక్షుడిగా 25 ఏళ్ల నుంచి చేస్తున్న రాజకీయాలను ప్రజలు కూడా గమనిస్తున్నారని గుర్తుచేశారు. 14 ఏళ్ల ముఖ్యమంత్రిగా ఏం చేశారు. విశాఖపట్టణం అభివృద్ధి కోసం పాటుపడ్డారా అని బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. మీ పాలనను చూసి విసుగెత్తి వైసీపీకి ప్రజలు అధికారం కట్టబెట్టారని పేర్కొన్నారు. మీ నేతృత్వంలో పనిచేయలేమని రోజుకు నలుగురు, ఐదుగురు చొప్పున పార్టీ వీడుతున్నారని బొత్స గుర్తుచేశారు.
వైసీపీ గూటికి
పులివెందుల నుంచి సతీష్ రెడ్డి సహా క్యాడర్ వైసీపీలో చేరిన విషయాన్ని బొత్స సత్యనారాయణ గుర్తుచేశారు. మీరు చెప్పినట్టే డొక్కా మాణిక్య వరప్రసాద్ తన పదవీకి రాజీనామా చేసి వైసీపీలో చేరారని పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు సజావుగా నిర్వహించాలని సీఎం జగన్మోహన్ రెడ్డి ఆదేశించారని పేర్కొన్నారు. అందుకోసమే మద్యం, నగదు పంపిణీ చేయొద్దని నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. వ్యవస్థలో మార్పు తీసుకొచ్చేందుకు జగన్ శ్రీకారం చుట్టారని.. అందుకు తగినట్టు చర్యలు తీసుకుంటున్నారని పేర్కొన్నారు.
గీత దాటితే..
స్థానిక సంస్థల ఎన్నికలను ప్రజాస్వామ్యయుతంగా నిర్వహిస్తామని, శాంతికి విఘాతం కలిగిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. గ్రామస్వరాజ్యం పరిఢవిల్లేందుకు తమ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని వివరించారు. గత ప్రభుత్వం ఎందుకు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించలేదని బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. దాడి పేరుతో చంద్రబాబు నాయుడు వాడిన భాషను, వ్యవహారశైలిని వైసీపీ తరఫున ఖండిస్తున్నామని బొత్స సత్యనారాయణ స్పష్టంచేశారు.