అవును వాళ్ళిద్దరూ కలిశారు,మైసూరా, సిఎం రమేష్ సమావేశం వెనుక మర్మమేమిటి..?
రాజకీయాల్లో ఎప్పుడూ ఏం జరుగుతోందో చెప్పలేం. మాజీ మంత్రి మైసూరారెడ్డితో టిడిపి ఎం పి సిఎం రమేష్ సమావేశం కావడం రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకొంది.
కడప : వాళ్ళిద్దరూ ఒక్కటయ్యారా. అంటే అవుననిపిస్తోంది. ఎవరి కారణంగా పార్టీకి దూరమయ్యారో అతనే నేరుగా ఆయన ఇంటికి వెళ్ళి మంతనాలు జరిపాడు. ఈ మంతనాలతో కడప రాజకీయాల్లో మార్పులు చోటుచేసుకొంటాయనే ప్రచారం సాగుతోంది. టిడిపి నుండి మైసుారా దూరం కావడానికి ప్రస్తుత రాజ్యసభసభ్యుడు సిఎం రమేష్ కారణమనే ప్రచారం పార్టీ లో ఉంది. ఇవాళ వారిద్దరూ సమావేశం కావడం రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.
2004 ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ను వీడి మైసూరా రెడ్డి టిడిపిలో చేరాడు. టిడిపి ఆయనకు రాజ్యసభ సభ్యుడిని చేసింది. ఉమ్మడి ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఆయన హయంలో అవినీతి చోటుచేసుకొందని రాజా ఆఫ్ కరప్షన్ అనే పుస్తకాన్ని టిడిపి విడుదల చేసింది. ఈ పుస్తకం రాయడంలో ఆనాడు టిడిపిలో ఉన్న మైసూరా రెడ్డి కీలకంగా వ్యవహారించాడు.
వైఎస్ జగన్ కడప పార్లమెంట్ స్థానానికి పార్టీ పెట్టిన తరుణంలో జరిగిన ఉప ఎన్నికల్లో టిడిపి అభ్యర్థిగా మైసూరా పోటీ చేశాడు. మైసూరా తనయుడు జగన్ కు సన్నిహితంగా ఉండేవాడు. ఈ ఎన్నికలు ముగిసిన తర్వాత రాజ్యసభ సభ్యత్వాన్ని చంద్రబాబునాయుడు మైసూరాకు పునరద్దురించలేదు. అదే జిల్లాకు చెందిన సిఎం రమేష్ కు రాజ్యసభ సభ్యత్వాన్ని కట్టబెట్టారు.
అదే సమయంలో వైఎస్ జగన్ ఇంట్లో అల్పాహరవిందుకు వెళ్ళిన మైసూరాపై టిడిపి వేటు వేసింది. తదనంతర పరిణామాల్లో మైసూరా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆయన చేరారు. 2019 ఎన్నికల్లో ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో టిడిపి అధికారంలోకి వచ్చింది. ఎన్నికలు పూర్తైన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కూడ మైసూరా రాజీనామా చేశారు. ఇటీవల కాలంలో మైసూరా టిడిపిలో చేరుతారనే ప్రచారం సాగుతోంది.
కొంత కాలం పాటు రాజకీయాలకు దూరంగా ఉంటున్నట్టు మైసూరా కన్పిస్తున్నారు. కడప జిల్లాల్లో తన ప్రాబల్యాన్ని పెంచుకొనేందుకు టిడిపి పావులు కదుపుతోంది. ఈ మేరకు జమ్మల మడుగు నియోజకవర్గంలో మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి, ప్రస్తుత ఎంఏల్ఏ ఆదినారాయణరెడ్డి మద్య ఆధిపత్యపోరు సాగుతుండేది. వీరిద్దరి మద్య సయోధ్య కుదిర్చారు. ఆదినారాయణరెడ్డి టిడిపి తీర్థం పుచ్చుకొన్నారు.
మరో వైపు రాజకీయంగా స్థబ్దుగా ఉన్న మైసూరారెడ్డిని కూడ తమ వైపుకు తిప్పుకొనే ప్రయత్నాల్లో టిడిపి ఉంది. మైసూరా పార్టీ వీడడానికి సిఎం రమేష్ కారణమే ప్రచారం పార్టీ వర్గాల్లో ఉంది. మైసూరా రెడ్డితో సిఎం రమేష్ సోమవారం నాడు ఆయన స్వగ్రామం ఎర్రగుంట్లలో సమావేశం కావడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకొంది. మైసూరా టిడిపి తీర్థం పుచ్చుకొంటారని కొంత కాలంగా ప్రచారం సాగుతున్న తరుణంలో మైసూరాతో సిఎం రమేష్ భేటీ కావడం చర్చనీయాంశమైంది.
ఇంతకాలంపాటు ఉప్పునిప్పు మాదిరిగా ఉన్న ఈ ఇద్దరు నాయకులు కలవడం పట్ల రాజకీయవర్గాల్లో చర్చకు దారితీసింది. కడప జిల్లాలో వలసలను అధికార టిడిపి ప్రోత్సహిస్తోంది. జగన్ కు గట్టిపట్టున్న ,నియోజకవర్గాల్లోని క్యాడర్ ను, నాయకులను పార్టీలోచేర్చుకొనే ప్రక్రియను వేగవంతం చేస్తోంది.మైసూరా టిడిపిలోకి వస్తే కమలాపూరం నియోజకవర్గంలో కొంత కలిసివచ్చే అవకాశం ఉందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి