'బాబును పిలుద్దామనే అనుకున్నాంకానీ, మాట రాకుండా కేసీఆర్ ఇలా, ఏం జరిగిందంటే'
హైదరాబాద్/అమరావతి: తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రపంచ తెలుగు మహాసభలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికు ఆహ్వానం లేకపోవడంపై తెలంగాణ ప్రభుత్వ వర్గాలు శనివారం నాడు స్పందించాయి.
ప్రపంచ తెలుగు మహాసభలను తెలంగాణ ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తోన్న విషయం తెలిసిందే. ఈ సభలకు చంద్రబాబును ఆహ్వానిద్దామని గతంలో సమీక్షా సమయంలో తెలంగాణ సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారు. కానీ ఆయనకు ఆహ్వానం అందలేదు. ఇది చర్చనీయాంశంగా మారింది.
చంద్రబాబును ఆహ్వానించేందుకు సన్నాహాలు చేశాం కానీ
ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వ వర్గాలు స్పందించాయి. కొంత తర్జన భర్జన తర్వాత చంద్రబాబు అధికారిక, వ్యక్తిగత పర్యటన కార్యక్రమాలను దృష్టిలో పెట్టుకొని ఆ ఆలోచనను (ఆహ్వానం) విరమించుకున్నట్లు వెల్లడించాయి. చంద్రబాబును ఆహ్వానిద్దామని మొదట అనుకున్నామని, అందుకు తగ్గట్లు సన్నాహాలు కూడా చేశామని చెప్పారు.
వివాదం చేయాల్సిన అవసరం లేదు
ఈ మహాసభలలో చంద్రబాబు పాల్గొనకపోవడాన్ని వివాదం చేయాల్సిన అవసరం ఎంతమాత్రమూ లేదని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. రెండు రాష్ట్రాల మధ్య పూర్తి సుహృద్భావ సంబంధాలు ఉన్నాయని, తెలుగు రాష్ట్రాల అభివృద్ధి, ఉమ్మడి ప్రయోజనాల విషయంలో ఇరువురూ కలిసి మెలిసి పని చేస్తున్నారని అధికార వర్గాలు చెబుతున్నాయి.
ముఖ్యమంత్రులు పూర్తి సదవగాహనతో
తెలుగు మహాసభల విషయంలోను ఇద్దరు ముఖ్యమంత్రులు పూర్తి సదవగాహనతో వ్యవహరించారని, చంద్రబాబు గైర్హాజరీ వివాదం కాకూండా చూసేందుకు ఇద్దరూ పలు జాగ్రత్తలు తీసుకున్నారని చెప్పాయి.
కేసీఆర్ ఆరా తీశారు
ప్రపంచ తెలుగు మహాసభలకు ఏపీ సీఎం చంద్రబాబును ఆహ్వానించాలనుకున్న తెలంగాణ సీఎం కేసీఆర్.. శ్రేయోభిలాషుల సాయంతో ఆయన వీలును తెలుసుకునే ప్రయత్నం చేశారని అధికార వర్గాలు వెల్లడించాయి. చంద్రబాబు వెసులుబాటును బట్టి పిలవాలనుకున్న కేసీఆర్ చివరి రోజైన 19న రాష్ట్రపతి కోవింద్తో పాటు మహాసభల్లో పాల్గొంటే బాగుంటుందని సందేశం పంపించారన్నారు.
సన్నిహితుల ద్వారా ఇదంతా నడిచింది
అయితే అప్పటికే కార్యక్రమం ఫిక్స్ అయిపోయింది కనుక చంద్రబాబు రాలేని పరిస్థితి ఉందని, అధికారికంగా ఇరువురికీ సన్నిహితంగా ఉండే కొందరి ద్వారా ఈ వ్యవహారం నడిచిందని చెప్పినట్లుగా తెలుస్తోంది.
ఏ అపోహలు లేకుండా
పిలిచినా చంద్రబాబు రాలేదన్న అపోహ రాకుండా ఉండటం కోసం తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా ఆహ్వానం పంపకుండా ఉండిపోగా, తనను పిలువలేదన్న అభిప్రాయం కలగకుండా చంద్రబాబు తెలుగు మహా సభలకు సంపూర్ణ సంఘీభావం ప్రకటించారు. ఇద్దరు సీఎంల మధ్య ఎలాంటి అంతరం లేదని, తెలుగు మహా సభల విషయంలో ఇరువురు పూర్తి సదగాహనతో వ్యవహరించారని అంటున్నారు. ఓ విధంగా బాబును తెలంగాణ పిలువకపోవడం లేదా సర్కార్ పిలిచినా బాబు కాదనలేదు అని చెప్పే పరిస్థితి లేదంటున్నారు.