బ్యాలెట్ ఎన్నికలకు సీఈసి ఎందుకు జంకుతోంది..? ఈసీ నిరంకుశ వైఖరి విడనాడాలన్న ఏపి కాంగ్రెస్..!!
కడప/హైదరాబాద్ : బ్యాలెట్ ఎన్నికలకు ఏపి కాంగ్రెస్ సంఘీభావం ప్రకటించింది. బ్యాలెట్ ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేస్తున్న రాజకీయ పార్టీల వాదనను ఎన్నికల సంఘం ఎందుకు త్రోసిపుచ్చుతోందని ఏపిసిసి సూటిగా ప్రశ్నిస్తోంది. దేశంలోని ఇరవై మూడు రాజకీయ పార్టీలు ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ల ద్వారా కాకుండా బ్యాలెట్ పేపర్లు ద్వారా భవిష్యత్తులో ఎన్నికలు జరపాలని డిమాండ్ చేస్తున్నాయని ఏపీపీసీసీ ఉపాధ్యక్షులు తులసి రెడ్డి అన్నారు. ఈ ఎన్నికలకు సంబంధించి వీవీప్యాట్ రశీదులను లెక్కించాలని కోరుతుండగా కేంద్ర ఎన్నికల సంఘం మొండిగా, నిరంకుశంగా తిరస్కరించడం దురదృష్టకరమన్నారు.
కడపజిల్లా వేంపల్లె లో మీడియాతో తులసిరెడ్డి మాట్లాడారు. ప్రపంచంలో 191 దేశాలుండగా అందులో 173 దేశాల్లో బ్యాలెట్ పేపర్ పద్ధతిలో ఎన్నికలు జరుగుతున్నాయన్నారు. అందులో అమెరికా, జర్మనీ లాంటి అభివృద్ధి చెందిన దేశాలు ఉన్నాయన్నారు. కొన్ని దేశాలు కొన్నాళ్లు ఈవీఎంలు వాడి లోపాలు ఉన్నాయని గ్రహించి తిరిగి బ్యాలెట్ పేపర్ పద్ధతిలో ఎన్నికలు నిర్వహిస్తున్నాయని ఆయన గుర్తు చేశారు.
వీవీప్యాట్ రశీదులు లెక్కించనప్పుడు వాటిని ఎందుకు ప్రవేశపెట్టినట్లు అని ఆయన ప్రశ్నించారు. కేంద్ర ఎన్నికల కమిషన్ తానా అంటే ..బీజేపీ , వైసీపి పార్టీలు తందానా.. అని వంతపాడటం శోచనీయమని తులసిరెడ్డి అన్నారు.