ఆ పాము ఎందుకు చనిపోయిందంటే?...దుర్గాడ పాము మరణంపై అటవీ శాఖ అధికారుల నివేదిక
తూర్పుగోదావరి:దుర్గాడలో సాక్షాత్తూ సుబ్రమణ్యేశ్వర స్వామి అవతారమంటూ భక్తుల పూజలు అందుకున్న పాము హఠాత్తుగా మృతి చెందడం వివాదానికి దారి తీసిన సంగతి తెలిసిందే...అయితే ఇప్పుడు ఆ పాము మరణంపై అటవీ శాఖ అధికారులు విచారణ జరిపి నివేదిక సమర్పించారు.
"ఆ పాము కుబుసం విడిచే స్థితిలోనే అక్కడ ఉండిపోయింది...అది ముసలిది, నీరసంగానూ ఉంది... అందుకే అది మరణించింది...పైగా దానిని అడవిలోకి తరలించడానికి, వైద్యం చేయడానికి ప్రజలు అంగీకరించలేదు. అయితే ఆ పాము ఎవరినీ కరవలేదు...దానిని ఎవరూ గాయపరచలేదు...అందువల్ల వన్యప్రాణి సంరక్షణ చట్టం ప్రకారం ఎవరిపైనా కేసులు నమోదు చేయలేదు'...అని దుర్గాడ పాము మృతిపై ఫారెస్ట్ అధికారులు తమ ఉన్నతాధికారులకు రిపోర్ట్ ఇచ్చారు.
పాము మృతిపై...నివేదిక
తూర్పు గోదావరి జిల్లా ఏలేశ్వరం అటవీ రేంజ్ పరిధిలోని శంఖవరం సెక్షన్కు చెందిన గొల్లప్రోలుమండలం దుర్గాడ గ్రామంలో ఈ నెల 2వ తేదీన భక్తుల పూజలు అందుకున్న నాగుపాము హఠాన్మరణానికి సంబంధించి విచారణ జరిపి ఉన్నతాధికారులకు నివేదిక అందజేసినట్టు కాకినాడ డివిజన్ అటవీ శాఖాధికారి డాక్టర్ నందని సలారియా మీడియాకు వెల్లడించారు.
భక్తులు...జోక్యం
సుబ్రమణ్యస్వామి అవతారంగా భక్తుల నుంచి ఎడతెగని పూజలు అందుకుంటున్న ఆ పామును అక్కడ నుంచి తరలించాల్సిన అవసరం గురించి స్థానిక ఎమ్మెల్యేకు చెప్పగా భక్తులు ఆ పామును దైవాంశగా భావిస్తున్న విషయం చెప్పి...భక్తుల మనోభావాల దృష్ట్యా అధికారుల జోక్యంవద్దని చెప్పారని తెలిపారు. నిబంధనల ప్రకారం పాము మృతదేహాన్ని తమకు అప్పగించాలని అటవీ శాఖాధికారులు కోరినా స్థానికులు అంగీకరించలేదని వెల్లడించారు.
అందుకే అలా...ఖననం
దీంతో అధికారులు గత్యంతరం లేక చివరకు భక్తుల సమక్షంలోనే అటవీశాఖ అధికారుల అదే స్థలంలో ఆ పామును ఖననం చేశారని ఫారెస్ట్ అధికారులు తమ నివేదికలో పేర్కొన్నారు. దుర్గాడ పాము హఠాన్మరణంపై భక్తులు...ఆ పాము చనిపోవడానికి పోలీసులు, అటవీ శాఖ సిబ్బందే కారణమని ఆందోళనకు దిగిన సంగతి తెలిసిందే. భక్తుల ఆందోళన కారణంగానే స్థానిక ఎస్ ఐని విధుల నుంచి తప్పించడమే కాకుండా ఆయనపై కేసు కూడా నమోదు చేశారు.
శ్రావణ మాసంలో...గుడి
కొంతమంది ఎస్ ఐ పాముకు విషం పెట్టించి చంపారని ఆరోపించగా...మరికొందరు పాముకు ఎండ పడుతుంటే రక్షణగా కప్పిన పై వస్త్రాన్ని అధికారులు తొలగించారని అందుకే పాము చనిపోయిందని అన్నారు. ఇదిలా వుంటే వచ్చే శ్రావణ మాసంలో ఈ పాము చనిపోయిన చోట సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ నిర్మాణానికి అంకురార్పణ చేసేందుకు భక్తులు సన్నాహాలు చేస్తున్నారు.