ఆ నేతలపై సీబీఐ విచారణ తప్పదా..? రోజాతో సహా వారందరిపై, హైకోర్టు ఆగ్రహంతో వైసీపీలో కలకలం
కరోనావైరస్ నేపథ్యంలో అమలులో ఉన్న లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన వైసీపీ ఎమ్మెల్యేలపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అధికారిక పార్టీకి చెందిన ఐదుగురు ఎమ్మేల్యేలతో పాటుగా తాజాగా మరో ముగ్గురుతో కలిపి మొత్తం 8 మంది మీద హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. లాక్డౌన్ నిబంధనలను అధికారిక ఎమ్మెల్యేలు ఉల్లంఘించడంతో పాటుగా కరోనావ్యాప్తికి కారణమయ్యారంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.
ఈ రోజు దీనిపై విచారణ చేసిన హైకోర్టు అధికారపార్టీ ఎమ్మెల్యేల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. నిబంధనలను ఉల్లంఘించకపోతే వారిపై ఎందుకు చర్యలు తీసుకోకూడదని ప్రశ్నించింది. ప్రభుత్వం స్పందించకుంటే సీబీఐ విచారణకు ఎందుకు ఆదేశించకూడదని ధర్మాసనం ప్రశ్నించడం ఇప్పుడు వైసీపీల కలకలం రేపుతోంది.
వైసీపీ ఎమ్మెల్యేలపై సీబీఐ విచారణ..?
రెండు నెలల కాలంగా ఏపీలో కొనసాగుతున్న లాక్డౌన్ను వైసీపీ ఎమ్మెల్యేలు ఉల్లంఘిస్తున్నారంటూ హైకోర్టులో దాఖలైన పిటిషన్లలో మొత్తం 8 మంది ఎమ్మెల్యేల పేర్లున్నాయి. ఇప్పటికే హైకోర్టు అందులో ఐదుగురికి నోటీసులు జారీ చేసింది. శ్రీకాళహస్తి ఎమ్మెల్యే మధుసూధన రెడ్డి, నగరి ఎమ్మెల్యే రోజా, పలమనేరు ఎమ్మెల్యే వెంకట్ గౌడ్, చిలకలూరిపేట ఎమ్మెల్యే విడదల రజని, సుళ్లూరుపేట ఎమ్మెల్యే సంజీవయ్యలు ఉన్నారు. తాజాగా మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్తో పాటుగా విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, తాడికొండ ఎమ్మెల్యే శ్రీదేవిలపైనా పిటిషన్లు దాఖలయ్యాయి.
ఈ పిటిషన్ పైన ఈరోజు జరిగిన విచారణలో హైకోర్టు చేసిన కామెంట్స్ అధికార పార్టీ నేతల్లో టెన్షన్లకు కారణం అవుతున్నాయి. లాక్డౌన్ సమయంలో లబ్ధిదారులతో ముఖాముఖి కోసమే ఎమ్మెల్యేలు ప్రజల వద్దకు వచ్చే ప్రయత్నం చేశారని ప్రభుత్వం తరపున న్యాయవాది కోర్టుకు నివేదించారు. అయితే ప్రజాప్రతినిధులుగా ఉంటూ లాక్డౌన్ నిబంధనలను ఎలా ఉల్లంఘిస్తారంటూ ప్రశ్నించిన హైకోర్టు కొనసాగింపుగా సీరియస్ కామెంట్స్ చేసింది.
ప్రజా ప్రతినిధులే రూల్స్ అధిగమిస్తే ప్రభుత్వం చర్యలు తీసుకోదా అని ప్రశ్నించినట్లు సమాచారం. వారిపైన సీబీఐ విచారణకు ఆదేశిస్తే తప్పేంటని ధర్మాసనం తీవ్రంగా స్పందించింది. దీంతో పిటిషన్లలో ఉన్న నేతలు వ్యవహరించిన తీరు సందర్భాన్ని పూర్తి సమాచారంతో కోర్టుకు నివేదిస్తామని అందుకు సమయం ఇవ్వాలని అడ్వకేట్ జనరల్ అభ్యర్థించారు. దీంతో వచ్చే వారానికి కేసును వాయిదా వేస్తూ న్యాయస్థానం నిర్ణయం తీసుకుంది.