ప్రభావం ఉండదు: బాబుకు పురంధేశ్వరి దిమ్మతిరిగే కౌంటర్, మోడీకి ఘాటుగా మోహన్ బాబు
గుంటూరు: టీడీపీ-బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. కేంద్రం నుంచి టీడీపీ మంత్రులు రాజీనామా చేస్తున్నారు. ఏపీ బీజేపీ మంత్రులు ఇప్పటికే చంద్రబాబు నాయుడుకు తమ రాజీనామాను సమర్పించారు.
బాబు యూటర్న్ వెనుక... మీకోసమే 21న అవిశ్వాసం, జైట్లీ అబద్దం చెప్పలేదు: జగన్
ఏపీకి సాయం చేయడం లేదని టీడీపీ చెబుతుండగా, రాష్ట్రాల కంటే ఎక్కువ ఆదుకున్నామని బీజేపీ నేతలు చెబుతున్నారు. తాజాగా కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ మహిళా నాయకురాలు దగ్గుబాటి పురంధేశ్వరి ఏపీకి సాయం పై స్పందించారు.
రాజీనామాల ప్రభావం ఉండదు
ఈ రాజీనామాల పర్వం ఏపీ అభివృద్ధిపై ప్రభావం చూపే అవకాశం లేదని పురంధేశ్వరి తేల్చి చెప్పారు. రాష్ట్రానికి నష్టం చేసే పనులను కేంద్రం చేయలేదని, ఎప్పటికీ చేయబోదన్నారు. ప్రత్యేక హోదాతో వచ్చే ప్రయోజనాలు అన్నింటిని ప్యాకేజీతో కేంద్రం భర్తీ చేస్తుందని చెప్పారు.
హోదాకు బదులు ప్యాకేజీ, నష్టం లేకుండా చూస్తామన్నారు
హోదాకు బదులు ప్యాకేజీ రూపంలో అన్నీ ఇస్తున్న విషయాన్ని ప్రజలు గుర్తించాలని పురంధేశ్వరి విజ్ఞప్తి చేశారు. హోదాను ప్యాకేజీతో భర్తీ చేస్తుందన్నారు. ఏపీకి ఎలాంటి నష్టం లేకుండా చూస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ చెప్పారన్నారు.
టీడీపీకి పురంధేశ్వరి గట్టి కౌంటర్
దశలవారీగా జాతీయ సంస్థల నిర్మాణం ఉంటుందని, ఐఐటీ వంటి జాతీయ సంస్థలు మూడేళ్లలోనే పూర్తి కావని పురంధేశ్వరి టీడీపీకి గట్టి కౌంటర్ ఇచ్చారు. జాతీయ సంస్థలు ఎక్కడున్నా కేంద్రం పుత్రికలే అన్నారు. జాతీయ సంస్థలను కేంద్రమే పూర్తిగా నిర్మిస్తుందన్నారు.
టీడీపీకి పురంధేశ్వరి కౌంటర్
కాగా, విభజన హామీలు వెంటనే అమలు చేయాలని చంద్రబాబు సహా టీడీపీ నేతలు డిమాండ్ చేస్తోన్న విషయం తెలిసిందే. అయితే హామీలు నెరవేర్చడానికి పదేళ్ల సమయం ఉందని, ఆలోగా అన్నింటిని అమలు చేస్తామని, అయినా చాలా వేగంగా అమలు చేస్తున్నామని బీజేపీ చెబుతోంది.
మోడీకి మోహన్ బాబు ప్రశ్న
ఆంధ్రప్రదేశ్ పట్ల సవతి తల్లి తీరు ఎందుకని, ఏపీ ఏం తప్పు చేసిందని ఇలా ప్రవర్తిస్తున్నారని, ప్రత్యేక హోదా గురించి ఏం జరుగుతోందని, ఏపీకి హోదా కల్పించాలని తెలంగాణ కూడా అడుగుతోందని, ఇది ఏపీ సెంటిమెంట్ మాత్రమే అనుకుంటున్నారా అని సినీ నటుడు మోహన్ బాబు ట్వీట్ చేశారు.