తిరుపతి లడ్డూ, అద్దె గదులు.. మద్యం ధర కూడా పెంచారు.. అంతా జే ట్యాక్స్ మాయ...
జగన్ ప్రభుత్వ విధానాలతో ప్రజలకు నష్టం కలుగుతుందని టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు అన్నారు. రాష్ట్రంలో మద్యపాన నిషేధం అని చెప్పి.. ప్రభుత్వమే లిక్కర్ అమ్ముతుందని ఆరోపించారు. ఇదెక్కడి విధానం అని ప్రశ్నించారు. మద్యం విక్రయంపై గస్తీ ఉండాల్సిన పోలీసులు లిక్కర్ విక్రయించడం పరిస్థితికి అద్దం పడుతుందన్నారు. తణుకులో చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ జగన్ సర్కార్ చర్యలను దుయ్యబట్టారు.
అంతా మాయ..
మద్యపాన నిషేధం పేరు చెప్పి జగన్ మాయ చేశాడని విమర్శించారు. మద్యం ధర పెరిగితే కొనుగోలు చేయరని చెప్పి నాటకాలు ఆడారని మండిపడ్డారు. అయినా కొనుగోళ్లు ఆగయా అని ప్రశ్నించారు. రాత్రి 8 గంటల వరకు షాపులకు పర్మిషన్ ఇచ్చి.. తర్వాత వైసీపీ కార్యకర్తలతో బెల్ట్ షాపులు తెరిపిస్తున్నారని గుర్తుచేశారు. ఇదేక్కడి న్యాయమా.. గతంలో కన్నా విభిన్నంగా విధానాలు ఉన్నాయా అని ప్రశ్నించారు. ప్రజలను మరింత దోపిడీకి గురిచేస్తున్నారని ఫైరయ్యారు.
లడ్డూ ధర కూడా..
తిరుపతి లడ్డూ ధర పెంచడాన్ని కూడా చంద్రబాబు ప్రస్తావించారు. వెంకన్న లడ్డూ అందరికీ ప్రీతిపాత్రమని చెప్పారు. అలాంటి లడ్డూ ధర పెంచి ప్రజల నుంచి వ్యతిరేకతను మూటగట్టుకున్నారని చెప్పారు. దీంతో తిరుమలలో గదుల అద్దె పెంచడం వెనక ఉద్దేశం ఏమిటని ప్రశ్నించారు. ఇకపై భక్తులు తిరుమల రావొద్దా ? భగవంతుడిని దర్శించుకోవద్దా అని నిలదీశారు. లడ్డూలు, గదుల ధర పెంచి ఎలాంటి సంకేతాలు ఇస్తున్నారని అడిగారు.
మారిన విధి
రాష్ట్ర ప్రభుత్వ విధి మద్య నియంత్రణ అని చంద్రబాబు గుర్తుచేశారు. కానీ జగన్ మాత్రం మద్యం విక్రయిస్తున్నారని ఎద్దేవా చేశారు. అదీ కూడా ధరలు పెంచి.. కూలీ నాలీలను ఇబ్బంది పెడుతున్నారని మండిపడ్డారు. ఇటీవల లారీ డ్రైవర్ రాలేదంటే లారీని కొందామని ప్రభుత్వం ప్రకటన సరికాదన్నారు. రేపు మద్యం రాకుంటే లిక్కర్ రాష్ట్రంలోనే తయారు చేస్తారా అని ప్రశ్నించారు.
దొరకడం లేదా
రాత్రి 8 గంటలు దాటితే మందు దొరకడం లేదా అని చంద్రబాబు ప్రశ్నించారు. తర్వాతే ఎక్కువ లభిస్తుందని చెప్పారు. లిమిటెడ్ బ్రాండ్ల వెనక మర్మమేమిటి అని చంద్రబాబు నిలదీశారు. ఇందులో జే ట్యాక్స్ పాత్ర ఉందని ఆరోపించారు. రాష్ట్రంలో ఒక విభాగం కాదు.. అన్నింటీపై అవినీతి పేరుకుపోయిందని చంద్రబాబు చెప్పారు.