మొన్న ఉండవల్లి కీలక వ్యాఖ్యలు: మోడీని కార్నర్ చేసే ఆధారాలు బాబుకిచ్చారా?
Recommended Video
అమరావతి: మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఏపీ సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును కలిశారు. సీఎంవో ఆహ్వానం మేరకు కలిసినట్లుగా తెలుస్తోంది. వీరి కలయిక ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. పది రోజుల క్రితం మాజీ ఎంపీ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఇప్పుడు సీఎంవో పిలవడంతో కలిశారనే ప్రచారం జరగడం గమనార్హం.
చదవండి: ఆధారాలు నీకిస్తా: చంద్రబాబుకు ఉండవల్లి 'గోల్డెన్' ఛాన్స్
ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హామీలపై ఉండవల్లి గత కొంతకాలంగా పోరాటం చేస్తున్నారు. కేంద్రం నుంచి వచ్చిన నిధులపై టీడీపీ, బీజేపీ మధ్య కొంతకాలం క్రితం జరిగిన వివాదంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జాయింట్ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ వేశారు. ఇందులో ఉండవల్లి కూడా ఉన్నారు.
పది రోజుల క్రితం ఆసక్తికర వ్యాఖ్యలు
కేంద్రం నుంచి ఏపీకి రావాల్సిన అంశాలపై పలు సందర్భాల్లో మాట్లాడారు ఉండవల్లి. ఇటీవల ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర విభజన సరిగా జరగలేదనేందుకు ఆధారాలు ఉన్నాయని, అందుకు సంబంధించిన ఆధారాలు టీడీపీకి ఇస్తానని, వారు వచ్చే పార్లమెంటు సమావేశాల్లో నోటీసులు ఇవ్వాలని, వారు కాదంటే నేను ఇతర రాష్ట్రాల పార్టీలకు వాటిని ఇచ్చి పోరాడమని కోరుతానని చెప్పారు.
గోల్డెన్ ఛాన్స్ ఇస్తున్నారా?
చంద్రబాబుకు ఇది గోల్డెన్ ఛాన్స్ అని, దీనిని ఉపయోగించుకోవాలని కూడా ఉండవల్లి చెప్పారు. మోడీ ప్రసంగంపై టీడీపీ ఎంపీలు చర్చకు పట్టుబట్టాలని, విభజన చట్టం చెల్లుబాటు కాదని, ఇందుకు సంబంధించి ఎంపీలు పోరాటం చేయాలని, పార్లమెంటులో జరిగిన దారుణాలు బీజేపీ అగ్రనేత ఎల్కే అద్వానీకి కూడా తెలుసునని మాజీ ఎంపీ అన్నారు.
ఆధారాలు ఇచ్చారా, అందుకే పిలిచారా?
ఉండవల్లి అలా మాట్లాడిన పది రోజులకు ఇప్పుడు చంద్రబాబుతో భేటీ కావడం గమనార్హం. ఈ నేపథ్యంలో ఆయన తన వద్ద ఉన్న ఆధారాలు ఇచ్చారా? ఆధారాలు సహా మరిన్ని వివరాలు తెలుసుకొని, కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని నిలదీసేందుకే సీఎంవో ఆయనను పిలిపించిందా? అనే అంశాలపై చర్చ సాగుతోంది. ఇచ్చినా ఆయన ఏం ఇచ్చారనేది ఆసక్తిగా మారింది.
అవిశ్వాసానికి మద్దతివ్వాలని లేఖ
ఇదిలా ఉండగా, ప్రత్యేక హోదాపై బీజేపీ, కాంగ్రెస్సేతర పార్టీలకు చంద్రబాబు లేఖలు రాశారు. ఎన్డీయేపై టీడీపీ ప్రవేశపెట్టే అవిశ్వాసానికి మద్దతివ్వాలని కోరారు. ఈ మేరకు చంద్రబాబు 8 పేజీల లేఖను అన్ని పార్టీలకు రాశారు. మంగళవారం ఉదయం పదకొండు గంటలకు ఢిల్లీలో అఖిలపక్ష భేటీ జరగనుంది. అన్ని పార్టీల నుంచి ఫ్లోర్ లీడర్లు హాజరు కానున్నారు.
చంద్రబాబుతో భేటీ తర్వాత ఉండవల్లి ఏమన్నారంటే?
ఇదిలా ఉండగా, చంద్రబాబుతో భేటీ అనంతరం ఉండవల్లి మాట్లాడుతూ.. తాను ఏ పార్టీలో లేనని, ఏ పార్టీలో చేరనని, రాజీనామాలకు తాను వ్యతిరేకమని, అయినా గతంలో నేను రాజీనామా చేయాల్సిన పరిస్థితి వచ్చిందని, రాజ్యాంగ విరుద్ధంగా విభజన బిల్లును ఆమోదించారని, నేను గతంలో రాష్ట్రపతి, ప్రధానికి రాసిన లేఖలు, కోర్టుల్లో వేసిన పిటిషన్ల కాపీలను సీఎంకు అందజేశానని చెప్పారు. పార్లమెంటు తలుపులు మూసి ఏపీకి అన్యాయం చేశారని ఫిబ్రవరి 7, 2018న ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలను గుర్తుచేశారు. ప్రధాని చేసిన వ్యాఖ్యలనే పార్లమెంటులో ప్రస్తావించాలని సీఎంను కోరానని, తన దగ్గర ఉన్న ఆధారాలను సీఎం చంద్రబాబుకు అందజేశానని తెలిపారు. విభజన బిల్లును ఆమోదించినప్పటి నుంచి రాజ్యాంగ విరుద్ధమని పోరాడుతున్నామని, దేశ చరిత్రలో లోకసభ నిబంధనలన్నీ ఉల్లంఘించి రాజ్యాంగ వ్యతిరేకంగా విభజన చట్టాన్ని ఆమోదించారన్నారు.