వంశీ స్వరం ఎలా మారింది.. 10 రోజుల్లో ఏం జరిగింది..ప్రజల నుంచి వ్యతిరేకతేనా..?
గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ పార్టీని వీడితో టీడీపీ వచ్చే నష్టమేమి లేదని ఆ పార్టీ నేత నిమ్మల రామానాయుడు అన్నారు. అలాగే అధికార వైసీపీకి చేకూరే ప్రయోజనం ఏమీ లేదని చెప్పారు. అధినేత చంద్రబాబు, లోకేశ్, పార్టీపై విమర్శలు చేయడంతో చర్యలు తీసుకున్నట్టు వివరించారు. సస్పెండ్ చేశామని.. అందుకు వంశీ ఇచ్చే వివరణను బట్టి చర్యలు ఉంటాయని రామానాయుడు స్పష్టంచేశారు. అమరావతిలో చంద్రబాబు నివాసంలో పార్టీ ముఖ్యనేతల సమావేశం జరిగింది. వంశీ, ఇతర అంశాలపై పార్టీ నేతలు చర్చించి నిర్ణయం తీసుకున్నారు.
సోషల్ మీడియాలో తనపై వస్తున్న అసభ్యకర పోస్ట్ లపై వల్లభనేని వంశీ ఫిర్యాదు..
అప్పుడు అలా.. ఇప్పుడు ఇలా..
వంశీపై రామానాయుడు ఫైరయ్యారు. ఇళ్ల పట్టాలకు సంబంధించి ఫోర్జరీ జరిగిందని తనను వైసీపీ ప్రభుత్వం వేధిస్తోందని చెప్పారని పేర్కొన్నారు. పదిరోజుల క్రితం వంశీ చెప్పిన విషయాలకు ప్రభుత్వం మద్దతుగా నిలిచిందని పేర్కొన్నారు. కానీ గురువారం మీడియాలో పార్టీ అధినేతను దూషించడంతో ఆయన వైఖరేంటో తెలిసిపోయిందన్నారు. వంశీ క్యారెక్టర్ ఏంటో తమకు పూర్తిగా తెలిసిందని చెప్పారు.
కామనే.. కానీ
సాధారణంగా అధికార పార్టీలోకి కొందరు ఎమ్మెల్యేలు చేరతారని రామానాయుడు అంగీకరించారు. తమ హయాంలో కూడా 23 మంది వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీలో చేరిన విషయాన్ని గుర్తుచేశారు. ఆ సమయంలో ఫిరాయింపులు వద్దని నీతులు చెప్పినా.. జగన్ ఇప్పుడు చేస్తున్నదేంటీ అని ప్రశ్నించారు. తమ పార్టీ నేతలను చేర్చుకోవడం లేదా అని ప్రశ్నించారు.
ఎందుకు సస్పెండ్ అంటే..?
పార్టీపై ధిక్కార స్వరం వినిపించిన వంశీని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు పేర్కొన్నారు. అతను ఇదివరకే టీడీపీకి రాజీనామా చేశారని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా.. వంశీ టీడీపీకి రాజీనామా చేశానని మీడియాలో తెలిపారు. పార్టీకి, అధినేతకు ఎలాంటి రాజీనామా లేఖ పంపలేదని తేల్చిచెప్పారు. పార్టీకి ఎలాంటి సమాచారం అందలేదని పేర్కొన్నారు. గురువారం మీడియా సమావేశంలో జగన్కు మద్దతిస్తానని.. ఆయన కోరితే ఎమ్మెల్యే పదవీకి రాజీనామా చేస్తానని తెలిపారని గుర్తుచేశారు.
5 నెలల్లోనే..
వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన 5 నెలల్లోనే ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చిందని రామానాయుడు పేర్కొన్నారు. ప్రజా సమస్యలను ప్రభుత్వం గాలికొదిలేసిందని చెప్పారు. చంద్రబాబు చేపట్టిన ఇసుక దీక్షకు మంచి స్పందన లభించిందని తెలిపారు. దీనిపై ప్రజల్లోకి ఎలా వెళ్లాలనే అంశంపై డిస్కషన్ చేసినట్టు తెలిపారు.
తొందరెందుకు..
ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీషు మీడియాన్ని హడావిడిగా తీసుకురావాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. టీడీపీ హయాంలో మున్సిపల్ స్కూళ్లలో ఇంగ్లీష్ ప్రవేశపెడితే జగన్ గగ్గోలు చేశారని రామానాయుడు తెలిపారు. ఇప్పుడేమో ఒకటో తరగతి నుంచి ఆరో తరగతి వరకు తప్పనిసరి చేస్తున్నారని పేర్కొన్నారు. విపక్షంలో ఉంటే ఒకలా .. అధికారంలో ఉంటే మరొలా జగన్ వ్యవహరిస్తారా అని నిమ్మల రామానాయుడు ప్రశ్నించారు.