తెలుగుదేశం అధికారంలోకి వస్తే- ఇదీ వారి కాన్సెప్ట్..!!
అమరావతి: మూడు రాజధానులను ఏర్పాటు చేసే విషయంలో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దూకుడుగా వ్యవహరిస్తోంది. మరో రెండు నెలల్లో ఈ సాగరనగరం నుంచి పరిపాలనను మొదలు పెట్టడానికి సమాయాత్తమౌతోంది. ఇప్పుడున్న రాజధాని అమరావతి నుంచి సచివాలయాన్ని తరలించే విషంలో ఏ మాత్రం వెనక్కి తగ్గట్లేదు. వచ్చే ఏడాది ఎన్నికలను ఎదుర్కొనాల్సిన ప్రస్తుత పరిస్థితుల్లో మూడు రాజధానులను ఎట్టి పరిస్థితుల్లోనూ తెర మీదికి తీసుకుని రావాలనే ఉద్దేశంలో ఉంది.

అసెంబ్లీలో..
దీనికి ఉద్దేశించిన ఏపీ వికేంద్రీకరణ బిల్లును అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ప్రవేశపెట్టడానికి కసరత్తు చేస్తోంది జగన్ సర్కార్. దీనికి అసవరమైన ప్రక్రియను పూర్తి చేస్తోంది. ఈ సమావేశాల్లోనే ఈ బిల్లులను ఆమోదించే అవకాశాలు కనిపిస్తోన్నాయి. ఈ బిల్లు సభామోదం పొందితే- విశాఖపట్నాన్ని కేంద్రంగా చేసుకుని వైఎస్ జగన్ పరిపాలనను సాగించడం లాంఛనప్రాయమే అవుతుంది.

31న సుప్రీంలో..
రాజధానిగా అమరావతిని కొనసాగించాలంటూ ఏపీ హైకోర్టు ఇదివరకు జారీ చేసిన ఆదేశాలపై దేశ అత్యున్నత న్యాయస్థానం స్టే విధించిన విషయం తెలిసిందే. దీనిపై తదుపరి విచారణ ఈ నెల 31వ తేదీన జరుగనుంది. రాజధాని ఎక్కడ ఉండాలనే విషయాన్ని నిర్ధారించడానికి కోర్టులు- టౌన్ ప్లానింగ్ కార్యాలయాలు కావంటూ ఇదివరకు న్యాయమూర్తులు వ్యాఖ్యానించిన నేపథ్యంలో- అన్నీ సానుకూల పరిస్థితులే ఎదురవుతాయని వైసీపీ భావిస్తోంది.

రెండు నెలల్లో..
రెండు నెలల్లో విశాఖ నుంచి పరిపాలన ఆరంభమౌతుందంటూ మంత్రి గుడివాడ అమర్నాథ్ సైతం స్పష్టం చేశారు. దీనికి అవసరమైన చర్యలు మొదలు పెట్టామనీ తేల్చి చెప్పారు. న్యాయపరమైన చిక్కులు పూర్తిగా తొలగిపోతాయని తాము ఆశిస్తోన్నామని, ఇక ఏ మాత్రం జాప్యం చేయకుండా అమరావతి ప్రాంతంలోని సచివాలయాన్ని విశాఖపట్నానికి తరలిస్తామని పేర్కొన్నారాయన.

సాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు..
ఈ పరిణామాల మధ్య వైసీపీ పార్లమెంటరీ పార్టీ చీఫ్ వీ విజయసాయి రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. మూడు రాజధానుల ఏర్పాటు విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేయాలనే సత్సంకల్పంతో మూడు రాజధానుల అంశాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిపాదించారని సాయిరెడ్డి పునరుద్ఘాటించారు. ఇందులో నుంచి వెనక్కి వెళ్లబోమని అన్నారు.

టీడీపీ అధికారంలోకి వస్తే..
తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తేనే అభివృద్ధి సాధ్యమంటూ ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలను సాయిరెడ్డి తప్పుపట్టారు. టీడీపీ హయాంలో ఒకే కులం, ఒకే జిల్లా, ఒకే కుటుంబం మాత్రమే అభివృద్ధి చెందుతుందని, ఈ విషయం రాష్ట్ర ప్రజలందరికీ బాగా తెలుసని తేల్చి చెప్పారు. 2014-19 మధ్యకాలంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు అమరావతిలో ఒక్క ఇటుక కూడా ఎందుకు పేర్చలేదని, సంతకం చేసిన అవగాహన ఒప్పందాలకు సైతం చంద్రబాబు విలువ ఇవ్వలేదని అన్నారు..












Click it and Unblock the Notifications