జీఈఎస్కు బాబుకు ఆహ్వానం అందనిది ఇందుకేనా? నాలుగు రెట్లు పెరిగిన బాబు ఆదాయం
హైదరాబాద్/ అమరావతి: గత నెల చివరి మూడు రోజుల పాటు తెలంగాణ రాజధాని 'భాగ్య నగరి' వేదికగా జరిగిన ప్రపంచ ఔత్సాహిక పారిశ్రామిక వేత్తల సదస్సు (జీఈఎస్)కు ఏపీ సీఎం చంద్రబాబు దూరంగా ఉన్నారు. కానీ వివిధ రకాల మీడియాల్లో ప్రత్యేకించి సోషల్ మీడియాలో 'జీఈఎస్' సదస్సు కోసం చంద్రబాబుకు ఎందుకు ఆహ్వానం లేదన్న విషయమై పుంఖానుపుంఖాలుగా వార్తలు వచ్చాయి. తెలంగాణ ప్రభుత్వం ఆయన్ను విమర్శించలేదని ఆ తప్పంతా.. తెలంగాణదేనని కూడా విమర్శలతో కూడిన వార్తలు వెలువడ్డాయి.
హైటెక్ సిటీ నిర్మాణంతోపాటు 'జీఈఎస్' సదస్సు జరిగిన హెచ్ఐసీసీ నిర్మించిన ఒకనాటి ఉమ్మడి ఏపీ సీఎం, ప్రస్తుత అవశేష ఏపీ సీఎం చంద్రబాబును కావాలనే తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆహ్వానించలేదని, దీనిపై చంద్రబాబుకే ప్రచారం లభిస్తుందని సందేహించారని వార్తలొచ్చాయి.
చంద్రబాబు మానస పుత్రిక హెచ్ఐసీసీ అని ప్రచారం
హైటెక్స్ వద్ద సదస్సు జరిగిన హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ (హెచ్ఐసీసీ).. ఏపీ సీఎం చంద్రబాబు మానస పుత్రిక అని చెప్పుకుంటారు మరి. కానీ దీనిపై తెలంగాణ సీఎం కేసీఆర్ నుంచి ఎటువంటి వివరణ రాలేదు. గమ్మత్తేమిటంటే ఏపీ సీఎం చంద్రబాబు తనయుడు, మంత్రి నారా లోకేశ్ శుక్రవారం తమ కుటుంబ ఆస్తుల ప్రకటన సందర్భంగా ఆ వివరణ ఇవ్వడం ఆసక్తికర పరిణామం.
కేంద్రం సహకారంతో జీఈఎస్ నిర్వహించిన అమెరికా
‘జీఈఎస్ - 2017' సదస్సును తెలంగాణ ప్రభుత్వం నిర్వహించలేదని ఏపీ మంత్రి నారా లోకేశ్ పేర్కొన్నారు. భారత ప్రభుత్వ సహకారంతో అమెరికా ప్రభుత్వం ఈ సదస్సు నిర్వహించిందని కూడా పేర్కొన్నారు. ‘వారు సదస్సు నిర్వహించడానికి వేదికగా హైదరాబాద్ నగరాన్ని ఎంచుకున్నారు. అందుకే తమకు ఆతిథ్యం ఇచ్చిన సీఎం కేసీఆర్ను మాత్రమే ఆహ్వానించారు' లోకేశ్ వివరణ ఇచ్చారు. ఏ రాష్ట్ర సీఎంను కూడా సదస్సుకు ఆహ్వానించలేదని లోకేశ్ గుర్తు చేశారు.
ఇవాంకను అమరావతికి రప్పించేందుకు బాబు యత్నాలు
‘చంద్రబాబుకు ఆహ్వానం లభిస్తుందని ఏ కోశాన అంచనా వేయలేదు. దానిపై ఎటువంటి వివాదం చేయొద్దు. అనవసర అంశాల్లో వివాదాలు కల్పించొద్దు' అని నారా లోకేశ్ వివరణ ఇవ్వడానికి ప్రయత్నించారు. కానీ వాస్తవమేమిటంటే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తనయ, ఆయన సలహాదారు ఇవాంకా ట్రంప్తో ‘అమరావతి' పర్యటన కోసం శత విధాల ప్రయత్నించారని టీడీపీ.. అనుకూల మీడియాలోనే ప్రముఖంగా వార్తలు రావడం కొసమెరుపు.
బాబు నికర ఆస్తుల విలువ రూ.1.86 కోట్లు వ్రుద్ధి
ఏడాది కాలంలో ఏపీ సీఎం, టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆదాయం 3.77 రెట్లు పెరిగింది. ఇది ఆయన కుటుంబ ఆస్తుల ప్రకటన సందర్భంగా ఏపీ మంత్రి నారా లోకేశ్ చేసిన ప్రకటన సారాంశం. చంద్రబాబు ఆస్తుల విలువ రూ.3.73 కోట్ల నుంచి రూ.8.17 కోట్లకు, ఇతర అప్పుల విలువ రూ.3.06 కోట్ల నుంచి రూ.5.64 కోట్లకు చేరుకున్నదని లోకేశ్ ప్రకటించేశారు. దీని ప్రకారం చంద్రబాబు నికర ఆస్తుల విలువ గతేడాది నుంచి ఈ ఏడాది వరకు రూ.67 లక్షల నుంచి రూ.2.53 కోట్లకు అంటే రూ.1.86 కోట్లకు పెరిగింది. ఇది అక్షరాలా 3.77 రెట్లు అధికం అన్నమాట.
బాబు మనుమడు దేవాన్ష్ ఆస్తులు స్వల్పంగా పెరుగుదల
చంద్రబాబు కుటుంబ సభ్యుల ఆస్తుల విలువలోనూ పురోగతి సాధించారు. లోకేశ్ ప్రకటన ప్రకారం ఆయన తల్లి భువనేశ్వరి ఆస్తుల విలువ రూ.33.66 కోట్ల నుంచి రూ.46.32 కోట్లకు పెరిగింది. ఆమె పేరు ఉన్న అప్పుల వివరాలు రూ.20.90 కోట్లు అయితే నికర ఆస్తుల విలువ రూ.25.41 కోట్లు అని తేల్చారు. నారా లోకేశ్ నికర ఆస్తులు రూ.15.21 కోట్లకు పెరిగాయి. ఇక నారా లోకేశ్ సతీమణి నారా బ్రాహ్మణి ఆస్తులు నికరంగా రూ.15.01 కోట్లకు చేరుకున్నాయి. గమ్మత్తేమిటంటే నారా చంద్రబాబు మనుమడు దేవాన్ష్ కూడా ఈ ఏడాది మరింత సంపన్నుడయ్యాడు. ఆయన ఆస్తులు ఏడాదిలోగా రూ.11.32 కోట్ల నుంచి రూ.11.54 కోట్లకు పెరిగాయి.